- తీవ్రంగా గాయపడిన వారికి రూ.3 లక్షలు
- అనూహ్యంగా భారీగా భక్తులు రావటంతోనే తొక్కిసలాట
- ఘటన జరిగిన వెంటనే అందరినీ అప్రమత్తం చేశాం
- ఇకపై ప్రైవేటు వ్యక్తులు నిర్మించిన దేవాలయాలపై నిరంతర పర్యవేక్షణ
- పలాసలో విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్
- కాశీబుగ్గ ఆలయంలో తోపులాట జరిగిన ప్రాంతం పరిశీలన
- పలాస సీహెచ్సీలో క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి లోకేష్
పలాస (చైతన్యరథం): శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి అనుకోకుండా పెద్దఎత్తున భక్తులు తరలిరావడం వల్ల తోపులాట జరిగిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శనివారం ఉదయం జరిగిన దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే మంత్రి లోకేష్ హైదరాబాద్ నుండి హుటాహుటిన బయలుదేరి కాశీబుగ్గ చేరుకున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆలయంలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటన జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలాసలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యాన్ని, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలాస సీహెచ్సీ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద చాలా బాధాకరమైన ఘటన జరిగిందన్నారు. ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్దఎత్తున ఆలయానికి వెళ్లారు. అక్కడ ఆలయ ప్రవేశమార్గం వద్ద తోపులాట జరిగి 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 16 మంది గాయపడ్డారు. ముగ్గురిని ప్రత్యేక వైద్య చికిత్సల కోసం శ్రీకాకుళం జేమ్స్ ఆసుపత్రికి ప్రభుత్వం తరలించారు. 94 ఏళ్ల భక్తుడు పాండా ప్రజల కోసం సొంత ఖర్చుతో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. శనివారం ఇక్కడకు వచ్చిన చాలా మంది భక్తులు మొదటిసారి వచ్చినవారే. కేవలం 10శాతం మందే రెండు, మూడోసారి వచ్చారని మంత్రి లోకేష్ తెలిపారు.
ఊహించని విధంగా భారీగా భక్తులు
గత నాలుగైదేళ్లుగా నిర్మాణం జరుపుకున్న ఈ దేవాలయంలో నాలుగు నెలల క్రితం విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు, పోలీసులకు ఇంతమంది భక్తులు తరలివస్తారనే అంచనా లేదు. గతంలో తాము వచ్చినప్పుడు ఎలాంటి రద్దీ లేకుండా దర్శనం చేసుకుని వెళ్లేవాళ్లమని రెండోసారి వచ్చిన భక్తులు తెలిపారు. ఈ సారి ఎప్పుడూ లేని విధంగా పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారని చెప్పారు. అక్కడ పై అంతస్తుకు వెళ్లేటప్పుడు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి వెళ్లేందుకు, మరొకటి వచ్చేందుకు. దేవాలయంలో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనం ఏర్పాటు చేశారు. తర్వాత మూడు నాలుగు గంటలు విరామం ఇచ్చారు. తర్వాత సాయంత్రం దర్శనం ఏర్పాటు చేశారు. ఉదయం వచ్చిన భక్తులు 11.30 ప్రాంతంలో లోపలికి వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం మూసివేయాల్సి ఉన్నందున ప్రవేశ మార్గాన్ని కూడా మూసివేశారు. లోపల ఉన్న భక్తులు దర్శించుకుని బయటకు వస్తున్న సమయంలోనే.. బయట ఉన్న వారు మళ్లీ సాయంత్రం వరకు వేచి ఉండటం ఎందుకనే ఉద్దేశంతో లోపలికి వెళ్లి దర్శనం చేసుకోవాలని తొందరపడ్డారు. ఒకే మార్గం ఉండటంతో తోపులాట జరిగింది. దీంతో మెట్లపై ఉన్నవారు కింద పడిపోవటంతో తీవ్ర విషాదం చోటు చేసుకుందని మంత్రి లోకేష్ తెలిపారు.
ఘటన జరిగిన వెంటనే అందరినీ అప్రమత్తం చేశాం
భక్తుల నియంత్రణకు బ్యారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ.. రద్దీ కారణంగా సరిపోలేదు. బ్యారికేడ్ల ఫౌండేషన్ రెండున్నర అంగుళాలు మాత్రమే చేశారు. ఎక్కువ మంది భక్తులు వచ్చినప్పుడు కనీసం ఆరు అంగుళాలు వేస్తారు. ఇది చేయలేక పోయారు. ఒక పక్క అయితే బ్యారికేడిరగ్ తర్వాత నేరుగా సిమెంట్ దిమ్మలు ఉన్నాయి. అటువైపు పడిన వారు తీవ్ర ఇబ్బంది పడి కొంతమంది చనిపోయారు. నాకు సమాచారం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే శిరీషకి ఫోన్ చేశాను. వెంటనే ఆమె బయలుదేరారు. తర్వాత మంత్రి అచ్చెన్నాయుడుకి ఫోన్ చేశాను. అధికారులతో మాట్లాడాను. అందరూ యుద్ధప్రాతిపదికన ప్రాంగణానికి వచ్చి తీవ్రంగా గాయపడిన వారిని శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరిని పలాస ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారని మంత్రి లోకేష్ వివరించారు.
మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటన జరిగినప్పుడు హెలికాఫ్టర్లో ఉన్నారు. కదిరిలో ల్యాండ్ అయిన వెంటనే ఆయనతో మాట్లాడారు. అప్పటి నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. సీఎం ఆదేశాల ప్రకారం చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందిస్తాం. తీవ్రంగా గాయపడిన వారికి రూ.3 లక్షలు అందజేస్తాం. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధాని కార్యాలయానికి తెలియజేశాం. ప్రధాని మోదీ కూడా చనిపోయిన వారి కుటుంబానికి రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున సాయం అందిస్తామని చెప్పారు. చనిపోయిన వారిలో ముగ్గురు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్నారు. మా ప్రమాద బీమా కార్యక్రమం ద్వారా వారికి పార్టీ నుంచి రూ.5 లక్షలు అందిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు.
ఇకపై ప్రైవేటు దేవాలయాలపై నిరంతర పర్యవేక్షణ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నింటి కార్యక్రమాలు, ముఖ్యమైన తేదీలు.. గతంలో ఎంత మంది భక్తులు వచ్చారు, రాబోయే రోజుల్లో ఎంతమంది భక్తులు వస్తారో ముందే వివరాలు సేకరించి, సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటుచేసి, క్రౌడ్ మానిటరింగ్కు టెక్నాలజీ వినియోగించాలని కలెక్టర్లు, ఎస్పీలందరికీ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయ శాఖ కింద ఉన్న దేవాలయాలకు ఒక వ్యవస్థ ఉంటుంది. అదే విధంగా ప్రైవేటు వ్యక్తులు దేవాలయాలు నిర్మించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఎస్వోపీ రూపొందించాలని ఆదేశించారు. దీనిని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటోంది. అనుకోకుండా ఘటన జరిగింది. ముఖ్యమంత్రి పర్యటన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది. దేవాలయ నిర్వాహకులు పాండా 94 ఏళ్ల వ్యక్తి. సమాజంలో మంచి పేరున్న వ్యక్తి. ప్రజలకు దేవుడిని దగ్గర చేయాలనే ఆలోచనతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. 12 ఎకరాల్లో రూ.15 నుంచి రూ.20 కోట్ల వరకు ఖర్చు చేశారు. దశల వారీగా దేవాలయాన్ని నిర్మించారు. వివరాలన్నీ సేకరించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు. తక్షణమే చనిపోయిన వారి కుటుంబాలకు మట్టి ఖర్చులకు ప్రతి కుటుంబానికి రూ.10వేలు ప్రభుత్వ తరపున ఆర్థిక సాయం అందజేశామని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ వెంట మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష తదితరులు పాల్గొన్నారు.














