- ప్రజల అవసరాలు తీర్చాం… ఆకాంక్షలు నెరవేరుద్దాం
- ఉద్యోగులకు 60 నెలల పెండింగ్ డీఏలను ఇచ్చాం
- నీరు-చెట్టు బిల్లులు చెల్లించాం
- ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గించేలా ప్రణాళికలు
- మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు
- అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం
నారావారిపల్లె (చైతన్యరథం): రాష్ట్రంలోని ప్రతి పల్లె పండుగ శోభతో కళకళలాడుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల అవసరాలు తీర్చాం.. ఆకాంక్షలు నెరవేరుద్దామన్నారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు పండుగ వాతావరణం కనబడుతోందన్నారు. ప్రతి జిల్లాలోనూ ఉత్సవ వాతావరణంలో ప్రజలు పండుగ చేసుకుంటున్నారన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో తిరుపతి జిల్లా నారావారిపల్లె నుంచి టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. గ్రామానికి రాగానే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తాయన్నారు. మన ఆచారాలను, సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోతే జాతి ఉనికి ఉండదు. ప్రకృతిని ప్రేమించడం, పశు సంపదను పూజించే పండుగ ఈ సంక్రాంతి. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు పండుగ వాతావరణం కనబడుతోంది. ప్రతి జిల్లాలోనూ ఉత్సవశోభ వెల్లివిరుస్తోంది. కేరళలో పడవ పోటీలను తలపించే రీతిలో ఆత్రేయపురంలో పడవల పోటీలు జరుగుతున్నాయి. జగ్గన్నతోట ప్రభల ఉత్సవం అద్భుతంగా జరుగుతోంది… దీన్ని రాష్ట్ర పండుగగా చేపడుతున్నాం. ఉత్తరాంధ్రలో, గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కడప జిల్లా గండికోటలో ఉత్సవాలు, సూళ్లూరు పేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ వంటివి జరుగుతున్నాయి.
రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలోనూ పర్యాటక కేంద్రాలు ఉన్నాయి… వాటిని అభివృద్ధి చేసుకునే దిశగా పని చేస్తున్నాం. ఇప్పుడు పల్లెల్లోకి వెళ్లిన వారికి గుంతలు పడ్డ రోడ్లు కన్పించడం లేదు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాం. గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాం. గ్రామాల్లోని ప్రతి ఇంటిపైనా సోలార్ రూప్టాప్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ సాగును ప్రోత్సహిస్తున్నాం. పరిశుద్ధమైన, ప్రశాంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం. 2025లో ప్రజల అవసరాలను తీర్చాం…2026లో వారి ఆకాంక్షలను నెరవేర్చేలా పని చేయాలి. ౦క్షేమం, అభివృద్ధితో సుపరిపాలనకు నాంది పలికాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ డెలివరింగ్ విధానం వైపు వెళ్తున్నాం. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహించాం. పోలీస్ రిక్రూట్మెంట్ పూర్తిచేశాం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, ఎన్టీఆర్ భరోసా, అన్న క్యాంటీన్ వంటి పథకాలు అమలు చేశాం. ధాన్యం సేకరణ చేసిన 48 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నాం. ఈ ఏడాది 42 లక్షలమెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి రూ.10 వేల కోట్లు రైతులకు చెల్లించామని సీఎం చంద్రబాబు చెప్పారు.
విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం
అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీల భారం తగ్గిస్తున్నాం. ట్రూడౌన్ విధానంతో 13 పైసలు తగ్గించాం. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలను మరింత తగ్గించేలా కృషి చేస్తున్నాం. రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు అందిస్తున్నాం. ఏడాదిలో రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తాం. సీఐఐ సమ్మిట్ ద్వారా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం మన రాష్ట్రానికే వచ్చాయి. 30 శాతం మేర పీపీపీ ప్రాజెక్టులు కేంద్రం మన రాష్ట్రానికే కేటాయించింది. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు నీళ్లిసామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
అన్ని ఎన్నికల్లో గెలవాలి
అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఉద్యోగులకు రూ.1,100 కోట్లతో డీఏ ఎరియర్స్, సరెండర్ లీవ్ చెల్లించాం. సీపీఎస్ ఉద్యోగులకు 60 నెలలుగా చెల్లించని డీఏ ఎరియర్స్ చెల్లించాం. 2019కి ముందు పనులు చేసిన నీరు చెట్టు బిల్లులు కూడా క్లియర్ చేశాం. పార్టీ పరంగా పార్లమెంట్ స్థాయి వరకు పదవులు భర్తీ చేశాం… త్వరలోనే రాష్ట్ర కమిటీ నియామకం చేపడతాం. కూటమి ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. రాబోయే అన్ని ఎన్నికల్లో కూటమి విజయం సాధించాలి గెలవాలి. ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
















