- తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం విజయవంతం
- ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పాల్గొన్న మంత్రి లోకేష్
- చంద్రబాబు పాదాలకు నమస్కరించిన లోకేష్
- ఆయనతో కలిసి విద్యార్థులతో ఇష్టాగోష్టి
- ఉపాధ్యాయుడిగా మారి పాఠాలు చెప్పిన చంద్రబాబు, విద్యార్థిగా మారి శ్రద్ధగా విన్న మంత్రి లోకేష్
- పాఠశాలల్లో మార్పులు తీసుకువచ్చారంటూ మంత్రి లోకేష్కు సీఎం చంద్రబాబు ప్రశంసలు
కొత్తచెరువు (చైతన్యరథం): శ్రీ సత్యసాయి జిల్లా జడ్పీ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పీటీఎం 2.0 కార్యక్రమం ఆద్యంతం పండుగ వాతావరణంలో కొనసాగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ముందుగా జూనియర్ కళాశాల ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పాదాలకు మంత్రి లోకేష్ నమస్కరించారు. అనంతరం తన నలుగురు పిల్లలకు తల్లికి వందనం పథకం కింద సాయం పొందిన పీ మాధవి, పిల్లలతో పాటు ముఖ్యమంత్రి పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం పొందారు. తరువాత తల్లల గొప్పదనంతో పాటు తల్లికి వందనం పథకం గురించి తెలియజేసేలా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వాల్స్ను ముఖ్యమంత్రితో కలిసి మంత్రి లోకేష్ వీక్షించి, ఫొటోలు దిగారు. అనంతరం ఎన్సీసీ క్యాడెట్స్ గౌరవ వందనం మధ్య జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా వారికి ఘనస్వాగతం పలికారు.
విద్యార్థులతో ఇష్టాగోష్టి
జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముందుగా పదో తరగతి విద్యార్థులతో ఇష్జాగోష్టి నిర్వహించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థుల విద్యా ప్రగతి, అభిరుచి, ప్రవర్తన, ఆరోగ్యం, హాజరు, తదితర అంశాలతో కూడిన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఒకే కుటుంబానికి చెందిన పదో తరగతి ఏ సెక్షన్కు చెందిన పి.రిహాన్ బాష, పి.జిగ్ను ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి, మార్కులు అడిగి తెలుసుకున్నారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇంకా బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. స్కూల్కు గైర్హాజరైన విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రులకు ఆగస్ట్ నుంచి మెసేజ్ రూపంలో తెలియజేయజేస్తామని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తెలిపారు.
ఉపాధ్యాయుడిగా చంద్రబాబు, విద్యార్థిగా లోకేష్
పదో తరగతి విద్యార్థులతో ఇష్టాగోష్టి అనంతరం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలోని 8వ తరగతి బి సెక్షన్కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉపాధ్యాయుడుగా మారి విద్యార్థులకు ‘వనరులు’ అనే సబ్జెక్ట్పై క్లాస్ చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థిగా మారిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. ముందు బెంచీలో కూర్చొని చంద్రబాబునాయుడు చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా విన్నారు. మానవ వనరులు అంటే ఏమిటి, సహజ వనరులు, పునరుత్పాదక వనరులు, పునరుత్పాదకం కాని వనరులపై విద్యార్థులకు ముఖ్యమంత్రి పాఠం బోధించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని విద్యార్థులకు ఉద్బోధించారు. సమాజంలో మార్పు తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు.
మంత్రి లోకేష్కు సీఎం చంద్రబాబు ప్రశంసలు
భవిష్యత్లో విద్యార్థులు ఏం కావాలనుకుంటున్నారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. పోలీస్, డాక్టర్, ఐఏఎస్, క్రికెట్ ప్లేయర్లు కావాలనుకునేవారు చేతులు పైకి ఎత్తాలని సూచించారు. వారంతా తమ లక్ష్యాన్ని చేతులు పైకి ఎత్తి చెప్పారు. విద్యార్థులకు ఆశయం ఉండాలని.. ఆశయ సాధన కోసం ఇప్పటినుంచే కష్టపడి చదవాలని మార్గదర్శకం చేశారు. అందరికీ గుడ్లక్.. ఆల్ ది బెస్ట్ చెప్పారు. రాజకీయ నాయకులు కావాలనుకునేవారు చేతులు ఎత్తాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అడగగా.. ఎవరూ చేయి పైకి ఎత్తలేదంటూ నవ్వులు పూయించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. నారా లోకేష్ బాగా చదువుకున్నారు, మంత్రి అయ్యారు, తల్లికి వందనం అమలు చేశారు, పాఠశాలల్లో మార్పులు తీసుకువచ్చారంటూ ఆయనను ప్రశంసించారు. అనంతరం విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించారు. మార్కులపై ఆరా తీశారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఫొటోలు దిగారు.