- ఏపీని అగ్రస్థానంలో నిలపడంలో బాధ్యత నిర్వర్తించండి
- జన్మభూమి-కర్మభూమి సిద్ధాంతాన్ని వదిలిపెట్టొద్దు..
- ‘వన్ ఫ్యామిలీ.. వన్ ఎంటర్ప్రెన్యూర్’కు సహకరించాలి
- ఏపీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నాం..
- ప్రవాసాంధ్రులకూ భీమా పథకం వర్తింప చేస్తున్నాం..
- దుబాయ్లో తెలుగు డయాస్పోరాలో సీఎం చంద్రబాబు పిలుపు
- ఉత్సాహభరితంగా సాగిన తెలుగు డయాస్పోరా
- పది గల్ఫ్ దేశాలనుంచి భారీగా హాజరైన ప్రవాసాంధ్రులు
దుబాయ్ (చైతన్య రథం): వన్ ఫ్యామిలీ `వన్ ఎంట్రప్రెన్యూర్ నినాదాన్ని అందిపుచ్చుకుని ప్రతీ ప్రవాసాంధ్రుల కుటుంబంలో ఒక్కరు ఏపీలో పెట్టుబడి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జన్మభూమి- కర్మభూమి సిద్ధాంతాన్ని అందిపుచ్చుకుని రెండుదేశాల అభివృద్ధికీ తోడ్పడాలని సూచించారు. శుక్రవారం దుబాయ్లోని లీమెరిడియన్ హోటల్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. పది గల్ఫ్ దేశాలనుంచి పెద్ద సంఖ్యలో తెలుగుప్రజలు హాజరయ్యారు. యుఏఈ సహా సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాలనుంచి తెలుగు ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యారు. సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తూ… ‘‘తెలుగు జాతికి తిరుగే లేదు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1గా తయారవుతుంది. ప్రపంచంలో ఎక్కడకి వెళ్లినా తెలుగు ప్రజలు ఉన్నతస్థాయిలో ఉండాలని ఆకాంక్షించాను. 30 ఏళ్ల ముందు ఐటీని ప్రోత్సహించాను. తెలుగువాళ్లు ఐటీ నిపుణులుగా ఇప్పుడు ప్రపంచమంతటా రాణిస్తున్నారు. సత్యనాదెళ్లలాంటి తెలుగు వాళ్లు మైక్రోసాఫ్ట్ కంపెనీకి ప్రస్తుతం సీఈఓగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి కోసం ప్రవాసాంధ్రులంతా తపించి గెలిపించారు. గల్ఫ్లోని పది దేశాలనుంచి తరలివచ్చి తెలుగు డయాస్పోరాకు హాజరు కావటం ఆనందాన్ని కలిగిస్తోంది’’ అని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్
‘అబుదాబీ, దుబాయ్లు ఆయిల్ ఎకానమీ నుంచి పర్యాటకం, నాలెడ్జ్ ఎకానమీ దిశగా నడుస్తున్నాయి. 1.5 లక్షల హోటల్ రూములతో ఆతిథ్యరంగానికి పెద్దఎత్తున ఆదాయాన్ని ఆర్జించి పెడుతోంది. ఏపీలోనూ పర్యాటకానికి ప్రోత్సాహం కల్పిస్తున్నాం. దేశంలో ఐటీలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ఐటీని ప్రోత్సహిస్తే ఇప్పుడు ఏఐకి ప్రాధాన్యమిస్తున్నాం. వన్ గవర్నమెంట్ వన్ సిటిజన్ పేరిట డేటా లేక్ తీసుకువస్తున్నాం. దీని ద్వారానే సుపరిపాలన అందించేలా కార్యాచరణ చేస్తున్నాం. గతంలో హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ తీసుకువస్తే.. ఇప్పుడు ఏపీలోని విశాఖకు గూగుల్ తీసుకువస్తున్నాం. గూగుల్ విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. దేశంలో క్వాంటం వ్యాలీ ఉన్న ఏకైక ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రమే’’నని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.
ప్రవాసాంధ్రులకు భీమా పథకం
‘ఏపీలో ప్రతీ ఇంటికీ ఒక పారిశ్రామికవేత్తను తయారుచేసి లక్ష్యాన్ని సాధిస్తాం. ఐటీ, కమ్యూనికేషన్ల రంగంలో విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకుంటున్నాం. సాంకేతికత ద్వారా పాలన అందించేలా వాట్సప్ ద్వారా 730కి పైగా పౌర సేవలు అందిస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు కాబోతోంది. త్వరలో ఇక్కడి నుంచే దుబాయ్కి అవసరమైన ఎయిర్ టాక్సీలు తయారు చేసే రోజు వస్తుంది. దుబాయ్లాంటి దేశాలు మన దేశంనుంచే బంగారంకొని, ఆభరణాలుగా చేసి మళ్లీ మనకే విక్రయిస్తున్నారు. ఈ తరహా నాణ్యమైన ఉత్పాదక ప్రక్రియల్ని మన పారిశ్రామికవేత్తలు చేపట్టాలి. హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీ విధానంతో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తున్నాను. ప్రవాసాంధ్రుల కోసం భీమా కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. రూ.10 లక్షల వరకూ అందరికీ భీమా కల్పించేలా కార్యక్రమం చేపట్టాం. ఉద్యోగులు, కార్మికులు, విద్యార్ధులు 18-60 ఏళ్ల వరకూ వయస్సున్న ప్రవాసాంధ్ర ఉద్యోగులు, కార్మికులు, విద్యార్ధులకు ఈ భీమా వర్తింపచేస్తున్నాం. ప్రవాసాంధ్రులు ఎదుర్కోనే న్యాయపరమైన ఇబ్బందులకు ఎన్నార్టీ సొసైటీ ద్వారా లీగల్ కౌన్సిలింగ్, డాక్యుమెంటేషన్, అడ్వకేట్ ఫీజులలాంటి సమస్యలు పరిష్కరిస్తాం. అలాగే ప్రసూతీ ఖర్చుల కింద రూ.35 వేలు, సిజేరియన్ ద్వారా రూ.50 వేల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తాం. ఏపీలో వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అని ఏపీలో పిలుపునిచ్చాం. ప్రవాసాంధ్రులు రాష్ట్రంలో ఒకరు పరిశ్రమ పెట్టండి. దీనికోసం ఓ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. దుబాయ్లో ఇంత పెద్దఎత్తున తెలుగువారు తరలివచ్చి ఏ నాయకుడికీ దక్కని గౌరవాన్ని అందించిన ప్రవాసాంధ్రులకు ధన్యవాదాలు’’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అనంతరం తెలుగు డయాస్పోరాకు హాజరైన వారు ఫోటోలు దిగేందుకు సీఎం సమయం ఇచ్చారు. కార్యక్రమానికి మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్రెడ్డి, ఏపీ ఎన్నార్టీ సౌసైటీ చైర్మన్ వేమూరి రవి, దుబాయ్లో భారత కాన్సులేట్ జనరల్ సతీష్శివన్ తదితరులు హాజరయ్యారు.











