అమరావతి (చైతన్య రథం): రాష్ట్రాలుగా రెండైనా.. తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటేనని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. 11వ రాష్ట్రావతరణ దినోత్సవం జరుపుకున్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ‘తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే నా ఆలోచన, ఆకాంక్ష. 11వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకున్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించాలని, అభివృద్ధి పథంలో సాగాలని కోరుకుంటున్నా, రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడుతూ వికసిత్ భారత్-2047నాటికి అగ్రస్థానానికి చేరుకోవాలని, తెలుగుజాతి తిరుగులేని శక్తిగా నిలవాలని.. ఇందులో ప్రతి తెలుగు పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిస్తున్నాను’ అని పేర్కొన్నారు.