- ప్రజలు మనపై పెద్ద బాధ్యత పెట్టారు
- ప్రజల్లోనే ఉండాలి, వారి సమస్యలు పరిష్కరించాలి
- పార్టీ నేతలు కష్టకాలాన్ని మర్చిపోకూడదు
- ఈ ఏడాది నిరుద్యోగ భృతి అందిస్తాం
- మచిలీపట్నం అంటే టీడీపీ, టీడీపీ అంటేనే మచిలీపట్నం
- కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని జులై 2 నుంచి ఇంటింటికీ తీసుకెళ్లాలి
- వైసీపీ నేతలకు ఇప్పటికీ అహంకారం తగ్గలేదు
- మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేష్
మచిలీపట్నం (చైతన్యరథం): ప్రజలు మనపై బాధ్యత పెట్టారని, కష్టపడి ప్రజాసమస్యలు పరిష్కరించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపు ఇచ్చారు. మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలతో బుధవారం మంత్రి నారా లోకేష్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మచిలీపట్నం అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే మచిలీపట్నం అన్నారు. మంత్రి కొల్లు రవీంద్రపై గత ప్రభుత్వంలో ఎన్ని అక్రమ కేసులు పెట్టి వేధించినా టీడీపీ కోసం, చంద్రబాబునాయుడు కోసం నిలబడ్డారు. మచిలీపట్నంలో అక్రమ కేసులతో ఎంత వేధించినా పార్టీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొని విజయాన్ని సాధించి పెట్టిన కార్యకర్తలకు నమస్కారాలు తెలుపుతున్నానన్నారు.
పార్టీ నేతలు కష్టకాలాన్ని మర్చిపోకూడదు
నేను ఈ రోజు మచిలీపట్నం వస్తుంటే అడుగడుగునా పోలీసులు ఉన్నారు. మనపై అక్రమ కేసులు పెట్టిన వారే మనకు సెల్యూట్ కొట్టారంటే అదీ ప్రజాస్వామ్య గొప్పదనం. చంద్రబాబు మొండిధైర్యం మామూలుది కాదు. 1996లో రాజమండ్రి సెంట్రల్ జైలును ఆధునీకరించిన వ్యక్తి. 2014-19 మధ్య చంద్రబాబు కట్టిన బ్లాక్లోనే గత ప్రభుత్వ హయాంలో ఆయనను అక్రమంగా నిర్బంధించారు. జైలు నుంచి చంద్రబాబునాయుడు పులిలా బయటకు వచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు అందరూ మనకు సెల్యూట్లు కొడతారు. పార్టీ నేతలు కష్టకాలాన్ని మర్చిపోకూడదు. పార్టీ కోసం ప్రాణ త్యాగం చేసిన తోట చంద్రయ్య, కంటిచూపు పోగొట్టుకున్న చెన్నుపాటి గాంధీ, గొడ్డలివేటుకు తీవ్రంగా గాయపడ్డ మంజులారెడ్డి, దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలిచిన అంజిరెడ్డి తాతలే మనకు ఆదర్శనం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలా వ్యవహరించాలి. మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందాం. ఏవైనా ఇబ్బందులు ఉంటే అంతర్గతంగానే పోరాడాలి. జగన్ రెడ్డిపై కంటే మూడు రెట్లు ఎక్కువగా పార్టీలోనే పోరాడా. పార్టీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ కట్టుబడి ఉండాలని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
ఈ ఏడాది నిరుద్యోగ భృతి అందిస్తాం
దేశంలో ఏ పార్టీకి రానివిధంగా 94శాతం సీట్లు కూటమి కైవసం చేసుకుంది. ప్రజలకు మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చెప్పుకోవాలి. మెగా డీఎస్సీ ద్వారా 16వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నాం. పెద్దఎత్తున కంపెనీలను తీసుకువచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. ఈ ఏడాది నిరుద్యోగ భృతి మొదలుపెడుతున్నాం. భూమి కన్నా ఎక్కువ భారం మోసేది మహిళ. వారిని గౌరవించాలనేది టీడీపీ నినాదం. మహిళలను గౌరవించటం అనేది ముందు మన ఇంట్లోనే మొదలవ్వాలి. 50శాతం పనులు మగవారు, 50శాతం పనులు ఆడవారు చేయాలని పాఠ్యాంశాల్లో పెట్టాం. జులై 5న మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్లో తల్లుల ఆశీర్వాదం తీసుకోవాలి. మహిళలకు ఏటా 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం. ఇప్పటి వరకు 2 కోట్ల సిలిండర్లు అందించాం. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సబ్సిడీ మొత్తాన్ని మహిళల అకౌంట్లలో జమచేస్తాం. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా వృద్ధాప్య పెన్షన్ రూ.4వేలు, దివ్యాంగ పెన్షన్ రూ.6వేలు, పూర్తిగా అంగవైకల్యం ఉన్నవారికి రూ.15వేలు పెన్షన్ అందిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
కూటమి ప్రభుత్వ అభివృద్ధిని ఇంటింటికీ తీసుకెళ్లాలి
కూటమి ప్రభుత్వ అభివృద్ధిని గడపగడపకు తీసుకెళ్లాలి. జులై 2 నుంచి సుపరిపాలనలో-తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేయాలి. పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇస్తాం. ఇకపై నేతలందరూ నియోజకవర్గ పర్యటనల్లో ముందుగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలి. కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నేను అది చూసుకుని వెళ్లకుండా ముందుగా కార్యకర్తలతో సమావేశం అయ్యాను. ఇకపై నేతలందరూ నియోజకవర్గ పర్యటనల్లో కార్యకర్తలతో భేటీ కావాలి.
వైసీపీ నేతలు ఇప్పటికీ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు
వైసీపీ నేతలు ఇప్పటికీ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నేత ఇప్పటికీ ప్రజలను కలుసుకోవడం లేదు. కార్యకర్తలను కలవడం లేదు. రెడ్ బుక్ పేరు చెబితేనే ఒకరికి గుండెపోటు వచ్చింది, మరొకరికి బాత్రూమ్లో జారి చేయి విరిగింది. మేం చట్టప్రకారం ముందుకు వెళ్తున్నాం. పార్టీ నేతలు, కార్యకర్తలకు అహంకారం వద్దు. సౌమ్యంగా ఉండాలి. అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రజలు మనపై బాధ్యత పెట్టారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. కష్టపడి ప్రజల సమస్యలను పరిష్కరించాలని మంత్రి లోకేష్ ఉద్బోధించారు.
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది. కేంద్ర సహకారం వల్లే మనం ముందుకు వెళ్లగలుగుతున్నాం. ఏపీ కోరిన అన్ని కోరికలను ప్రధాని నరేంద్ర మోదీ తీరుస్తున్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో 3 లక్షల మంది యోగాసనాలతో గిన్నీస్ బుక్ రికార్డ్ సృష్టించి ప్రధాని మోదీకి కానుకగా ఇచ్చాం. కూటమి పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తాయి. కూటమిని బలోపేతం చేద్దాం. ప్రభుత్వం, పార్టీ జోడెద్దుల బండి. రెండిరటినీ నడిపేందుకు కష్టపడి పనిచేస్తున్నామన్నారు. మాటల్లో కాకుండా చేతల్లో కార్యకర్తలను గౌరవిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, జిల్లా ఇంఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, జోనల్ ఇంఛార్జ్ మంతెన సత్యనారాయణ రాజు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, నియోజకవర్గ పరిశీలకులు ఎల్. సాయిరాం ప్రసాద్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.