- అమరావతిలో బిట్స్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది
- అమరావతిలో డీప్ టెక్, విశాఖలో ఎఐ వర్సిటీలు రాబోతున్నాయి
- ప్రైవేటు యూనివర్సిటీల సవరణ బిల్లు చర్చలో మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్య రథం): ‘రాష్ట్రంలో పెద్దఎత్తున ప్రైవేటు, విదేశీ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించాని నిర్ణయించాం. దేశంలో పేరెన్నికగన్న బిట్స్ను అమరావతిలో ఏర్పాటుకు 70 ఎకరాలు కేటాయిస్తూ ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. టాటా గ్రూప్, ఎల్ అండ్ టి, ఐఐటి మద్రాసు, యూనివర్సిటీ ఆఫ్ టోక్యోతో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ చేయాలని నిర్ణయించాం. దీనిని ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్దీకరణ సవరణ బిల్లు `2025ను మంత్రి నారా లోకేష్ శాసనసభలో ప్రవేశపెడుతూ… దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తోందన్నారు. వివిధ ఫారిన్ వర్సిటీల క్యాంపస్లను రాష్ట్రానికి రప్పించాలన్నది సభ్యుల మనోగతం. 2016లో ప్రైవేటు వర్సిటీల చట్టం తేవడం జరిగింది. గత ప్రభుత్వం దీనికి ఐదు సవరణలు చేసింది. అవి యుజిసి గైడ్లైన్స్కి విరుద్దంగా ఉన్నాయి. గ్రీన్ఫీల్డ్ వర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్-100 గ్లోబల్ వర్సిటీతో జాయింట్ డిగ్రీ ఉండాలని నిబంధన విధించారు. ఈ విషయంలో యుజిసి నిబంధనలు వేరుగా ఉన్నాయి. పూర్తిస్థాయిలో చర్చించి, ఆ చట్టాన్ని సవరించాల్సి ఉంది. విశాఖలో ఏఐ వర్సిటీ, అమరావతిలో స్పోర్ట్ వర్సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని పేర్కొన్నారు.
పలు ప్రైవేటు వర్సిటీలు ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డుతో చర్చలు జరుపుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, ఎఎంఇ వర్సిటీ ఫిలిప్పీన్స్ ఆసక్తి కనబర్చాయి. ఇతర వర్సిటీల ప్రతినిధులు కూడా చర్చలకు వస్తున్నారు. పెద్దఎత్తున ప్రైవేటు రంగంలో భారత్లో టాప్ వర్సిటీలతోపాటు విదేశీ యూనివర్సిటీలను ఏపీకి తెచ్చేవిధంగా ప్రోత్సహిస్తాం. కేవలం అమరావతి, విశాఖపట్నానికే కాకుండా అన్ని ప్రాంతాలకు తెస్తాం. ఇన్సెంటివ్లు అధికంగా ఇచ్చి రాయలసీమకు కూడా వర్సిటీలు రప్పించేందుకు కృషి చేస్తున్నాం. కనిగిరి ప్రాంతానికి ట్రిపుల్ ఐటి ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తాం. ఆంధ్రకేసరి యూనివర్సిటీని 2022లో ఎటువంటి శాంక్షన్ పోస్టులు లేకుండా ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రొఫెసర్లు, సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతానికి దాతలు కూడా ముందుకు వస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన మెకానిజం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆంధ్రకేసరి యూనివర్సిటీని కూడా అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేష్ వెల్లడిరచారు.
తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ఎప్పుడూ విద్యకు ప్రాధాన్యత నిస్తుంది. ప్రధానంగా ఉన్నత విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 2016లో ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ఒక ప్రత్యేక చట్టాన్ని ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం తేవడం జరిగింది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నానికి సెంచూరియన్ వర్సిటీ మంజూరుచేసి, 75 ఎకరాలు, 4.75లక్షల చదరపు అడుగుల్లో భవనాలు ఏర్పాటు చేశారు. 23 ప్రోగ్రామ్లలో 133మంది అధ్యాపకుల ద్వారా 2550మంది విద్యార్థులు అక్కడ శిక్షణ పొందుతున్నారు. దీనికి అనుబంధంగా 8 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, 3 ఇంక్యుబేషన్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ట్రస్ట్ పరిధి ఒరిస్సాలో ఉండటంతో కొన్ని పాలనపరమైన సమస్యలను వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. సకాలంలో నిధులు వారికి రాలేదు. ఈ వర్సిటీ అభివృద్ధికి స్పాన్సరింగ్ బాడీగా ఏపిలో అనుమతి ఇవ్వాలని, ఇన్కం ట్యాక్స్ సియుటిఎఫ్ ఏపి కింద ఉంచాలని వారు కోరారు. వర్సిటీలకు సంబంధించి సవరణ చేయాలంటే శాసనసభ, మండలికి మాత్రమే అధికారం ఉంది. అందుకే ఈ సవరణ బిల్లు ప్రతిపాదిస్తున్నామని మంత్రి లోకేష్ ప్రతిపాదించారు.
అంతకుముందుకు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రైవేటు విదేశీ విశ్వవిద్యాలయాలను రాష్ట్రంలోకి అనుమతించే విషయమై పరిశీలించాలని కోరారు. బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ… రాష్ట్రంనుంచి లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకోసం ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. దీనివల్ల రాష్ట్ర సంపద కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోతోంది. కొన్ని వర్సిటీలు ఇక్కడ ఏర్పాటుచేసినా ఐటి, జిఎస్టి రిజిస్ట్రేషన్ వేరే ప్రాంతాల్లో ఉండటం వల్ల ఆదాయం అక్కడకు వెళుతోంది. ప్రైవేటు యూనివర్సిటీలు ఇంకా పెద్దఎత్తున రాష్ట్రానికి రప్పించేందుకు సబ్సిడీపై వారికి భూములు ఇవ్వాలి. మన రాష్ట్రంలో కూడా ప్రైవేటురంగంలో పెద్దఎత్తున జాతీయ, అంతర్జాతీయస్థాయి వర్సిటీలను ప్రోత్సహించాలని కోరారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ… కనిగిరిలో ట్రిపుల్ ఐటి విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, తిరిగి ప్రారంభించాలని కోరారు. ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి యూనివర్సిటీని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.