- విపత్తుల సమయంలో కీలకపాత్ర పోషించాలి
- జీఐఎస్ సమాచారాన్ని విశ్లేషించి, సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి
- ఏపీఎస్ఏసీపై మంత్రి నారా లోకేష్ సమీక్ష
ఉండవల్లి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఏపీఎస్ఏసీ)ను సమర్థవంతంగా తీర్చిదిద్దుతామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీఎస్ఏసీ విభాగం అధికారులతో ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఏసీ చేపట్టిన పలు ప్రాజెక్టుల వివరాలను, పైప్ లైన్లో ఉన్న ప్రాజెక్టుల గురించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. వరదలు, తుఫాన్లు వంటి విపత్తుల సమయంలో ఏపీఎస్ఏసీ రియల్ టైం డేటాను ప్రభుత్వానికి అందించి కీలకపాత్ర పోషించాలన్నారు. విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి పనిచేయాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని జీఐఎస్ సమాచారాన్ని విశ్లేషించి, సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. నాణ్యమైన, కచ్చితమైన జీఐఎస్ సమాచారాన్ని ఇస్రో, గూగుల్ వంటి సంస్థల నుంచి సేకరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సెక్రటరీ కాటమనేని భాస్కర్, ఐఎఫ్ఎస్ స్పెషల్ సెక్రటరీ బి.సుందర్, సైంటిస్టులు ఏ.కన్నన్, జి.ప్రసాదరావు, వాణి, సుధీర్, తదితరులు పాల్గొన్నారు.