- కృష్ణా జలాలు తెచ్చి కుప్పం వాసుల దశాబ్దాల కల నెరవేర్చారు
- కుప్పానికి పరిశ్రమల రాకతో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
- మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలి
- ఉపాధి పొందడం కాదు..ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలి
- మహిళలతో ముఖాముఖిలో నారా భువనేశ్వరి
- 3వ రోజు కుప్పం నియోజకవర్గ పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న భువనమ్మ
- గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
- తుమ్మిసి పెదచెరువు వద్ద జలహారతి
- మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం
కుప్పం (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. కృష్ణా జలాలు తీసుకొచ్చి కుప్పం వాసుల దశాబ్దాల కల నెరవేర్చారన్నారు. మహిళలకు ఆర్థిక భద్రత అవసరమని, స్వయం ఉపాధి ద్వారా వారికి మరింత ఆదాయం లభిస్తుందన్నారు. 3వ రోజు కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా శుక్రవారం పలు కార్యక్రమాల్లో నారా భువనేశ్వరి పాల్గొన్నారు.
మహిళల ఆర్థిక ప్రగతికి చేయూత
నడిరపల్లి గ్రామంలో పర్యటించిన నారా భువనేశ్వరి ముందుగా గంగమ్మ దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. వారితో కలిసి కోలాటం ఆడారు. ఆపై వారిని ఉద్దేశించి మాట్లాడుతూ…మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో చంద్రబాబు డ్వాక్రా వ్యవస్థకు శ్రీకారం చుట్టారన్నారు. నేడు డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని సకాలంలో చెల్లిస్తూ పారిశ్రామికవేత్తల స్థాయికి ఎదిగారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. మన వల్ల ఏమీ కాదు అనే భావన నుంచి ముందు బయటకు రావాలి. ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. వాటి నుంచి నేర్చుకుని మందుకు నడవాలి. మహిళల్లో ప్రతిభను వెలికితీసి వారికి సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా పారిశ్రామిక వేత్తలుగా తయారుచేయడంలో ఎలీప్ చేస్తున్న కృషి అభినందనీయం. రమాదేవి ఆమె టీం సభ్యులంతా ఎలీప్ ద్వారా అనేకమంది మహిళలను ఔత్సాహిక పారిశ్రామివేత్తలుగా తీర్చిదిద్దారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా మహిళల ఆర్థిక ప్రగతికి పాటుపడుతున్నాం. వారి స్వయం ఉపాధికి చేయూత అందిస్తున్నాం. టైలరింగ్, మగ్గం, చికెన్ కారీ వర్క్లో శిక్షణ ఇస్తున్నాం. నడిరపల్లిలో 198 మందికి పింఛను అందుతోంది. టిడ్కో కింద 62 గృహాలు, రూ.1.30 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించారు. తల్లికి వందనం పథకం కింద 155 మంది లబ్ధి పొందుతున్నారు. 147 మంది రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఆర్థిక సాయం అందిందని భువనేశ్వరి వివరించారు.
దేశంలో ఏపీ నెంబర్ వన్ గా నిలవాలి
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ విజయవంతంగా అమలు చేశారు. చంద్రబాబు దూరదృష్టితో కుప్పానికి నీటి కష్టాలు తీరాయి. కుప్పంలో ప్రతి గ్రామం పచ్చగా ఉండాలన్నదే ఆయన కోరిక. ఇటీవల కుప్పానికి 7 పరిశ్రమలు వచ్చాయి. త్వరలో మరో 8 సంస్థలు రాబోతున్నాయి. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు భయం గుప్పిట్లో బ్రతికారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు స్వేచ్ఛ లభించింది. రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మేము ఎంత చేసినా కుప్పం ప్రజల రుణం తీర్చుకోలేము. నేను నిజం గెలవాలి యాత్ర చేసినప్పుడు టీడీపీ కార్యకర్తలు, కుప్పం ప్రజల ఎంతో సహకరించారు. అలాగే…2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు తరపున నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు మీరు నాపై చూపిన అభిమానాన్ని మర్చిపోలేనని భువనేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు.
కృష్ణమ్మకు జలహారతి
తుమ్మిసి పెద్ద చెరువు దగ్గర జల హారతి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. అంతకుముందు శాంతిపురం నుంచి తుమ్మిసి వరకూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహిళా ప్రయాణికులతో ముచ్చటించారు. భువనేశ్వరి ఆర్టీసీ బస్సు ఎక్కగానే ఆధార్ తప్పనిసరి అని మహిళా కండక్టర్ అడగటంతో.. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్నావని మహిళా కండక్టర్ ను భువనేశ్వరి అభినందించారు.














