- రప్పా రప్పా అని రెచ్చిపోతే జైలుకే
- ప్రపంచంలో ఎక్కడైనా పుట్టినరోజు కేకులను వేటకొడవళ్లు, తల్వార్లతో కట్ చేస్తారా?
- వికృత చేష్టలతో వైసీపీ సైకోమూకల ఉన్మాదం
- ప్రజలు బుద్ధిచెప్పినా హింసా నైజం మార్చుకోని జగన్
- అధికారం కోల్పోయినా రాజకీయ ముసుగులో రౌడీయిజం
- సమాజంలో భయత్పాతం సృష్టించే కుట్ర
- గర్భిణిపై దాడి కేసులో నీచుడిని అరెస్ట్ చేస్తే జనసేన కార్యకర్త అని విష ప్రచారం
- చంద్రబాబు నేతృత్వంలో శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యత
- కూటమి పాలనలో హింసా రాజకీయాలకు తావులేదు
- హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం
అమరావతి (చైతన్యరథం): కత్తులు పట్టుకుని రోడ్లమీద ఉన్మాదుల్లా తిరిగితే కటకటాలు తప్పవని హెూంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. రాజకీయ ముసుగులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రదర్శిస్తున్న ఉన్మాదపు చర్యలపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పుట్టినరోజు వేడుకల పేరుతో సమాజానికి హానికరమైన సంప్రదాయాలను ప్రోత్సహించడం గర్హనీయమన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సాధారణంగా పుట్టినరోజు అంటే అన్నదానం చేయడం, రోగులకు పళ్ళు, రొట్టెలు పంచడం, రక్తదానం చేయడం లేదా గుడిలో పూజలు నిర్వహించడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తారు.. కానీ వైసీపీ నాయకులు దీనికి భిన్నంగా రౌడీయిజాన్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
కేక్ కట్ చేయడానికి చిన్న ప్లాస్టిక్ కత్తి వాడటం మన సంప్రదాయం. కానీ వైసీపీ శ్రేణులు కొడవళ్ళు, వేటకొడవళ్ళు, పెద్ద పెద్ద కత్తులతో కేక్ కట్ చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇది సైకో తత్వానికి పరాకాష్ట. కేవలం కత్తుల ప్రదర్శనతో ఆగకుండా, ఆ కత్తులతోనే మూగజీవాలను బలి ఇచ్చి, ఆ రక్తంలో వారి నాయకుడి ఫ్లెక్సీలకు అభిషేకం చేయడం అత్యంత అమానుషం. ఇలాంటి హింసాత్మక చర్యలు సమాజానికి ఏం సందేశాన్ని ఇస్తున్నాయో తెలుసుకోవాలి. “రప్పా రప్పామని నరుకుతాం.. 2029లో ఇదే రిపీట్ అవుతుంది” అంటూ నినాదాలు చేయడం వారి నేరపూరిత ఆలోచనలకు అద్దం పడుతోంది. అధికారం కోల్పోయినా ఇంకా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూడటం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి, ప్రజల్లో అలజడి సృష్టించడానికి ఎంతటి నేరానికైనా వీరు వెనకాడటం లేదనే విషయాన్ని ప్రజలు గమనించాలని హెూం మంత్రి అనిత కోరారు.
భయోత్పాతం సృష్టించేందుకే..
ఇంట్లో పిల్లల లేదా పెద్దల పుట్టినరోజులు మనందరం ఎంతో పవిత్రంగా, ప్రేమగా జరుపుకుంటాం. కానీ వైసీపీ నాయకులు గంగమ్మ జాతరలో పొట్టేలును కోసినట్లుగా వీధుల్లో కత్తులు తిప్పుతూ రౌడీయిజం చేయడం దారుణం. ఇలాంటి ఉన్మాద చర్యలను ప్రభుత్వం సహించబోదు. మాజీ మంత్రులు, సీనియర్ నాయకుల సమక్షంలోనే. వైసీపీ కార్యకర్తలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తూ, సమాజంలో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. రాజకీయ ముసుగులో సాగుతున్న ఈ “ఫ్యాక్షన్ సంస్కృతి” రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదకరం. వేడుకల పేరుతో ఇష్టానుసారంగా టపాసులు కాల్చుతుంటే, ఇబ్బంది కలిగి పక్కకు వెళ్లమని కోరిన ఒక గర్భిణీ స్త్రీని కడుపుపై కాలితో తన్నడం వారి ఉన్మాదానికి పరాకాష్ట గర్భిణులకు గౌరవం ఇచ్చే మన సంస్కృతిని మంటగలిపి, పసికందు ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి సైకోలపై కఠిన చర్యలు తప్పవు.
రోడ్ల మీద మూగజీవాలను నరుకుతూ వీడియోలు తీయడం ఆ పార్టీ సైకో తత్వానికి నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా 11,12 నియోజకవర్గాల్లో ఒకే రోజు, ఒకే పద్ధతిలో జంతుబలులు, కత్తులతో ప్రదర్శనలు జరిగాయంటే.. ఇది యాదృచ్ఛికం కాదు, ముందస్తుగా పన్నిన కుట్ర అని స్పష్టమవుతోంది, కళ్యాణదుర్గం, ఉరవకొండ, సింగనమల, రాప్తాడు, కుప్పం, తదితర నియోజకవర్గాల్లో ఒకే రోజు, ఒకే తరహాలో జంతు బలులు, రక్తాభిషేకాలు జరిగాయంటే.. ఇది జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన వ్యవస్థీకృత నేరమేనని స్పష్టమవుతోందని హోంమంత్రి అనిత అన్నారు.
తల్లిదండ్రులు ఆలోచించాలి
మాజీ మంత్రులు పక్కనే ఉండి ప్రోత్సహిస్తుంటే, కార్యకర్తలు మేకల తలలు నరికి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. “2029లో ఇలాగే నరుకుతాం” అని బహిరంగంగా ఫ్లెక్సీలు కట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. గర్భిణిపై దాడి చేసిన వ్యక్తిని కాపాడటానికి, అతను జనసేన కార్యకర్త అని వైసీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేయడం సిగ్గుచేటు. జగన్ పుట్టినరోజు వేడుకల్లో జనసేన వారు టపాసులు ఎందుకు కాలుస్తారో ఆ మాత్రం ఇంగితం లేదా అని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు నాయుడు ఫ్యాక్షనిజాన్ని, మత విద్వేషాలను ఉక్కుపాదంతో అణిచివేసి రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచారు. కానీ నేడు వైసీపీ రాజకీయ ముసుగులో కొత్త తరహా రౌడీయిజాన్ని పురికొల్పుతూ, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోంది.
క్రోనలాజికల్ డేటా ప్రకారం చూస్తే, ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల్లో 18 ఏళ్ల లోపు పిల్లలు కూడా కత్తులు పట్టుకుని రోడ్ల మీదకు వస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు గంజాయితో యువతను పాడుచేసిన జగన్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి వారిని నేరస్థులుగా మారుస్తున్నారు. మీ పిల్లలను ఏ పార్టీ వెనుక పంపిస్తున్నారో తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి ఆస్తి కోసం తల్లిని, సొంత చెల్లిని కోర్టులకు ఈడ్చిన వ్యక్తి, రేపు మీ పిల్లలు కేసుల్లో ఇరుక్కుంటే రక్షిస్తాడని అనుకోవడం భ్రమ. అరాచక శక్తుల వెనుక పంపి పిల్లల జీవితాలను నాశనం చేసుకోవద్దని తల్లిదండ్రులకు హోంమంత్రి హితవు చెప్పారు.
హింసను ప్రేరేపించటమే వైసీపీ నైజం
జగన్ హయాంలో డాక్టర్ సుధాకర్ వెంటాడి వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పించడం, ఎమ్మెల్సీ అనంతబాబు ద్వారా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య (డోర్ డెలివరీ), చెల్లిని ఏడిపించారని ప్రశ్నించిన అమర్నాథ్ గౌడ్ అనే బాలుడిని పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటనలు మర్చిపోలేం. అధికారంలో ఉన్నా లేకపోయినా హింసను ప్రేరేపించడమే వైసీపీ నైజం. ఈ నేర రాజకీయాలతో విసిగిపోయిన ప్రజలు ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం చేసినా వారి తీరు మార్చుకోకుండా ఇంకా ఉన్మాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. నాయకుడిగా కాకున్నా.. కనీసం మనిషిగా ఇలాంటి హింసను జగన్ ఎలా సమర్థిస్తున్నారో అర్థం కావటం లేదు. రాష్ట్రంలో వైద్య విద్యను పేదలకు చేరువ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలను నిర్మిస్తుంటే, టెండర్లు వేసే వారిని అరెస్ట్ చేస్తానంటూ జగన్ బెదిరించడం ఆయన వినాశకర ఆలోచనలకు నిదర్శనం. గతంలో లాగే మళ్లీ భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని హెూంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమాజంలో అలజడి రేపే కుట్ర
జగన్మోహన్ రెడ్డి తన మనుషులను పంపి ఎన్ని భయభ్రాంతులకు గురిచేయాలని చూసినా, వారిని ఎలా అరికట్టాలో మాకు తెలుసు. ఇక్కడ అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. రోడ్ల మీద కత్తులు, కొడవళ్లు పట్టుకుని “రప్పా రప్పా నరుకుతాం” అని తిరిగే ఉన్మాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం. ఫ్లెక్సీలపై రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కరి జాతకం మా దగ్గర ఉంది. గతంలో లాగా ముసుగులేసి దాచడం కాదు.. ప్రతి నేరస్థుడిని రోడ్డు మీద నిలబెట్టి ప్రజలకు చూపిస్తాం. రౌడీయిజం చేస్తామంటే మా డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంది. ఇప్పటికే రౌడీ షీటర్లను రోడ్ల మీద నడిపిస్తున్నాం. పరిస్థితి విషమిస్తే, అరాచక శక్తులను రాష్ట్రబహిష్కరణ చేయడానికి కూడా వెనుకాడం, ముఖ్యమంత్రి ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రైమ్ రేట్ 4% తగ్గింది. శాంతిభద్రతలు బాగున్నాయి కాబట్టే రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేకే జగన్ తన రౌడీ మూకలతో అలజడి సృష్టించాలని చూస్తున్నారు. బాబాయి హత్యను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి, ఎంతోమంది ప్రాణాలను తీసి, అవినీతికి పాల్పడిన చరిత్ర జగన్. ప్రజలు ఛీ కొట్టినా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా యువతను సైకోలుగా మారుస్తున్నారు. మీ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మేము ‘స్కిల్ డెవలప్మెంట్’ సెంటర్లు పెడుతుంటే, జగన్ వారి చేతికి కత్తులు ఇస్తున్నారు. కత్తులు పట్టుకునే నాయకుడి వెనుక మీ పిల్లలను పంపి వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. భరోసా ఇచ్చే నాయకుడిని ఎంచుకోండి. 17, 18 ఏళ్ల వయసున్న పిల్లలు ఇంటర్, డిగ్రీ చదువుకుంటూ రేపు పొద్దున తమను చూసుకుంటారని తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అటువంటి బిడ్డల చేతికి కత్తులు ఇచ్చి, రక్తాభిషేకాలు చేయించి వారిని జైలు పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారని హోంమంత్రి అనిత ప్రశ్నించారు.
ఎవరైనా సరే.. చట్ట ప్రకారం చర్యలు
కార్యకర్తలు తప్పు చేస్తే సరిదిద్దాల్సింది పోయి, “రప్పా రప్పా నరుకుతామంటే తప్పేంటి?” అని ఆ పార్టీ అగ్రనేతలే మాట్లాడటం వారి ఉన్మాదానికి నిదర్శనం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ మాటల్లో సంస్కారం ఉండాలని, మనం మాట్లాడే మాట కోట్లాది మందికి ఆదర్శంగా ఉండాలని మాకు నేర్పిస్తారు. బహిరంగంగా కత్తులు పట్టుకుని తిరగడం ‘ఆర్మ్స్ యాక్ట్’ కింద నేరం. ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడిన వారిపై చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టం ముందు ఎవరూ అతిథులు కాదు, నేరస్థులు మాత్రమే. అనకాపల్లి జిల్లాలో రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ నమోదు చేయడంపై స్పందిస్తూ… పోలీసులు పూర్తి ఆధారాలతో, చట్టపరమైన నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటున్నారని మంత్రి అనిత స్పష్టం చేశారు.
19 కేసులు ఉన్నా కూడా బుద్ధి మారని వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించడం తప్పేమీ కాదు. కోర్టులు కూడా దీనిని అర్థం చేసుకుంటాయి. గతంలో చంద్రబాబు నాయుడు ఫ్యాక్షనిజాన్ని అణిచివేసే క్రమంలో సొంత పార్టీ వారైనా సరే తప్పు చేస్తే కేసులు పెట్టిన చరిత్ర ఉంది. రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి ఆటంకం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా సహించేది లేదు. అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన లేదా బీజేపీ అయినా.. ఎవరైనా సరే రోడ్ల మీద ఉన్మాదుల్లా ప్రవర్తిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.
రాష్ట్రంపై నమ్మకాన్ని దెబ్బతీసేందుకే..
ఈ ఒకటిన్నర ఏళ్లలో లక్షల కోట్ల పెట్టుబడులు, వేల ఉద్యోగాలు రాష్ట్రానికి వస్తున్నాయి. గూగుల్ వంటి డేటా సెంటర్లు, భారీ పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు అవుతున్నాయి. ప్రజల్లో భద్రతా భావం పెరిగింది. ఈ నమ్మకాన్ని దెబ్బతీసి, రాష్ట్ర ఉనికిని ప్రమాదంలో నెట్టడానికే జగన్మోహన్ రెడ్డి తన రౌడీ మూకలతో అలజడి సృష్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చిన్న పిల్లల చేతికి కత్తులు ఇచ్చి వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. దీనికి విరుద్ధంగా మా యువ నాయకుడు, మంత్రి లోకేష్ విజ్ఞతను గమనించండి. ఎక్కడైనా చిన్న పిల్లలు పార్టీ జెండా పట్టుకున్నా, పార్టీ టీషర్టులు వేసుకున్నా.. బాబూ, నీది చదువుకునే వయసు, రాజకీయాలు ఎందుకు? అని జెండా పక్కన పెట్టించి చదువుకోమని పంపిస్తున్నారు.
అంతటి ఉన్నతమైన సంస్కృతి మాది. ఏ నాయకుడు మన బిడ్డల భవిష్యత్తు కోరుకుంటున్నాడు, ఏ నాయకుడు వారిని నేరస్థులుగా మారుస్తున్నాడు అన్నది తల్లిదండ్రులు ఆలోచించాలి. ఇటువంటి ఉన్మాద రాజకీయ పార్టీలకు మద్దతు ఇవ్వడం అంటే మన బిడ్డల భవిష్యత్తును మనమే నాశనం చేసుకోవడమే. రాజకీయ పార్టీ నాయకుడిగా కాకుండా, ఒక బాధ్యత గల పౌరురాలిగా చెబుతున్నాను.. ఇలాంటి సైకోయిజాన్ని ప్రజలు గ్రహించాలి. చట్టాన్ని అతిక్రమించే ఎవరినైనా సరే కటకటాల వెనక్కి నెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి అనిత తేల్చి చెప్పారు.















