- ముందస్తు హెచ్చరికలు విస్తృతం చేయండి
- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం
అమరావతి (చైతన్య రథం): అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశించే పరిస్థితులు ఉత్పన్నయ్యే అవకాశాలు ఉన్నప్పుడు ముందస్తు హెచ్చరికలు చేసే ప్రక్రియను మరింత పెంచాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కుప్పం మండలంలోని వెంకటేశ్వరపురంలో కిట్టయ్య అనే వ్యక్తి ఏనుగు దాడిలో మరణించిన ఘటన డిప్యూటీ సీఎం దృష్టికి వచ్చింది. పీసీసీఎఫ్, సంబంధిత అధికారులతో గురువారం ఉదయం ఘటనపై చర్చించారు. కిట్టయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. తమిళనాడు అటవీ ప్రాంతం వైపునుంచి వచ్చిన ఏనుగు మూలంగా ఘటన చోటు చేసుకొందని, అక్కడ కూడా ఏనుగు మూలంగా మరణాలు సంభవించాయని అటవీ శాఖ అధికారులు వివరించారు. మన రాష్ట్ర అటవీ ప్రాంతంలోకి వస్తోందని ట్రాక్ చేసిన వెంటనే సమీప గ్రామాలవారికి ముందుగానే తెలియచేశామన్నారు. పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ‘ముందస్తు హెచ్చరికలను మరింత విస్తృతం చేయండి. గ్రామాలవారీగా, రైతులతోనూ, సోషల్ మీడియా గ్రూప్స్ ఏర్పాటుచేసి వాటికి సమాచారం అందించాలని, వాయిస్ మెసేజిలు పంపిస్తే సమాచారం తొందరగా చేరుతుందని అన్నారు.















