- ఏఐ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రీస్కిల్లింగ్ అవసరం
- దావోస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్
దావోస్ (చైతన్యరథం): ప్రపంచవ్యాప్తంగా ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కారణంగా డేటా సైంటిస్టులు, ఏఐ ట్రైనర్లు, ఎథికల్ ఏఐ స్పెషలిస్టులకు డిమాండ్ ఏర్పడుతుందని రాష్ట్ర విద్య, ఐటీి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. గ్లోబల్ ఎకానమీస్ అండ్ లేబర్ మార్కెట్లపై ఏఐ పరివర్తన ప్రభావం (The Transformative Impact of AI on Global Economies & Labour Markets) అనే అంశంపై దావోస్ ఆల్పెన్ గోల్డ్ హోటల్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వరల్డ్ ఎకనమిక్ ఫోరం వైట్ షీల్డ్ ఆర్థిక విభాగం మాజీ చీఫ్ జెన్నీఫర్ బ్లాంకే, గూగుల్ డైరెక్టర్ (గవర్నమెంట్ ఎఫైర్స్) సెలిమ్ ఎడే సంధానకర్తలుగా వ్యవహరించారు. సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఇదే సమయంలో మ్యానుఫ్యాక్చరింగ్, కస్టమర్ సర్వీస్, డేటా ప్రాసెసింగ్ వంటి రంగాల్లో 25 నుంచి 30శాతం వరకు టాస్క్లు ఆటోమేషన్ అవుతాయన్నారు. దీనిప్రభావం ఆయారంగాల్లో పనిచేసే ఉద్యోగులపై ఉంటుందన్నారు. ఏఐ ట్రాన్సర్పేషన్ నేపథ్యంలో రీస్కిల్లింగ్ అవసరం. ఇందుకోసం ప్రభుత్వాలు, కార్పొరేట్లు కలసి పనిచేయాల్సి ఉందన్నారు.
భారత్లో ఏఐ సంబంధిత వనరులకు జాతీయ ఏఐ పోర్టల్ రిపోజిటరీగా పనిచేస్తోంది.
వ్యక్తులు, సంస్థలు ఏఐలో అవకాశాలను అన్వేషించడానికి ఈ పోర్టల్ సహాయపడుతుంది. డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా నిర్వహిస్తున్న అక్షరాస్యత కార్యక్రమాలు భవిష్యత్ ఏఐ శిక్షణకు పునాదిగా నిలుస్తాయి. ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ వంటి జాతీయ-స్థాయి కార్యక్రమాలు, NASSCOM, ఐటీి, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ సంయుక్త ప్రయత్నాలు.. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్లో నైపుణ్యం పెంపొందించడానికి దోహదపడతాయి. ఏపీలో ఏఐ విద్య అభివృద్ధికి గూగుల్ సహా ప్రముఖ సంస్థలతో కలసి పనిచేస్తాం. రాష్ట్రంలో తొలి ఏఐ స్కిల్స్ ల్యాబ్ని విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో ఏర్పాటు చేశారు. చీపురుపల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు 500 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ‘ఏఐ ఫర్ ఆల్’ కార్యక్రమం కింద ఉపాధ్యాయులు శిక్షణ కూడా తీసుకున్నారు. భవిష్యత్ తరం ఏఐ నిపుణులు, పరిశోధకులు, అభ్యాసకులకు శిక్షణనిచ్చేందుకు ఏఐ విశ్వవిద్యాలయాన్ని స్థాపించబోతున్నామని మంత్రి లోకేష్ చెప్పారు.