- తప్పుడు ఆలోచన చేయడానికే భయపడాలి
- ఆడబిడ్డలపై చేయివేసే సాహసం చేయకూడదు
- పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నా..
- విచారణను శరవేగంగా పూర్తి చేయండి
- గంజాయిగాళ్లను రాష్ట్రంనుంచి ఏరేయండి
- నిర్దుష్ట సమయంలో శిక్షలు పడేలా చూడాలి
- ఉమ్మడి అనంతపురం ఘటనలపై సీఎం సమీక్ష
- దర్యాప్తు వివరాలను నివేదించిన డీజీపీ..
అమరావతి (చైతన్య రథం): ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆడబిడ్డలపై జరిగిన రెండు ఘటలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగురాళ్లపల్లిలో బాలికపై అత్యాచారం.. రెండు ఘటనలపై డీజీపీ సహా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి దర్యాప్తు అంశాలను వివరించారు. అనంతపురం ఘటనలో తన్మయి అనే యువతి తెలిసిన వ్యక్తి చేతిలో హత్యకు గురైతే.. ఏడుగురాళ్లపల్లిలో బాలికపై కొద్దిమంది చాలాకాలంగా అత్యాచారానికి పాల్పడడం దారుణమన్నారు. ఈ రెండు ఘటనలపై సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసు పూర్వాపరాలు పూర్తిగా తెలుసుకున్న సీఎం.. ఈ కేసుల్లో నిందితులకు వెంటనే శిక్షలు పడాలన్నారు. వెంటనే విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసి ట్రయల్స్ పూర్తయ్యేలా చూడాలని పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రత్యేక శ్రద్ధతో పక్కాగా ఆధారాలు సేకరించి నిందితులకు అత్యంత కఠిన శిక్షలు పడేలా చూడాలని సీఎం ఆదేశించారు. మహిళలపై నేరాల విషయంలో పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించాలన్నారు.
నేరం చేయాలనే ఆలోచన ఉన్నవారు పోలీసులు తీసుకునే చర్యల గురించి భయపడే పరిస్థితి రావాలన్నారు. ఆడబిడ్డలపై క్షణికావేశంలోనో… గంజాయి మత్తులోనో… వ్యవస్థీకృతంగానో నేరాలకు పాల్పడే వారికి శిక్షతప్పదనే అభిప్రాయాన్ని కలిగించాల్సి ఉందని సీఎం సూచించారు. ఈ రెండు ఘటనలే కాకుండా… మహిళలపై అఘాయిత్యాలకు, వారిపై హింసకు, లైంగిక దాడికి ఎవరు పాల్పడినా గట్టి సందేశం ఇచ్చేలా పోలీస్ శాఖ ద్యర్యాప్తు, చర్యలు ఉండాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లు నేరగాళ్లపై నియంత్రణ లేదని, గంజాయి, డ్రగ్స్, చట్టమంటే భయం లేకపోవడంవల్ల నేరగాళ్లు అదుపులో లేకుండా పోయారని… దీంతో నేటికీ కొందరు పాత అలవాట్లను మానుకోవడం లేదన్నారు. ముఖ్యంగా గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. ఈ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నానని…. 100 శాతం మార్పు కనిపించాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్గుప్తా, ఇంటలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ఇతర అధికారులు పాల్గొన్నారు.