- చకచకా ఉద్యోగుల టవర్ల నిర్మాణానికి చర్యలు
- కోర్ క్యాపిటల్లో 71 సంస్థలకు 1050 ఎకరాల కేటాయింపు
- పట్టణాభివృద్ధి శాఖామంత్రి పొంగూరు నారాయణ వెల్లడి
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన 47వ సీఆర్డీఏ సమావేశం
అమరావతి (చైతన్య రథం): రాష్ట్ర రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో గజిటెడ్ మరియు నాన్ గజిటెడ్ ఉద్యోగుల నివాసానికై నాలుగు ప్యాకేజీల్లో టవర్ల నిర్మాణానానికి రూ.1,732.31 కోట్ల విలువైన పనుల టెండర్లకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిందని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన 47వ సీఆర్డిఏ సమావేశం సచివాలయంలో జరిగిందని, సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించిన పలు టెండర్లను ఆమోదించడం జరిగిందన్నారు. 2014-19 మధ్యకాలంలో చేపట్టిన గజిటెడ్ అధికారుల టవర్ల నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు రూ.514.41 కోట్ల విలువైన టెండర్లకు, బాహ్య మౌలిక సదుపాయాల కల్పనకు రూ.194.73 కోట్ల విలువైన టెండర్లకు సీఆర్డిఏ సమావేశంలో ఆమోదం తెలిపామన్నారు. నాన్ గజిటెడ్ ఉద్యోగుల నివాసానికై తొమ్మిది టవర్ల నిర్మాణానికై రూ.506.67 కోట్ల విలువైన టెండర్లకు, మరో 12 టవర్ల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు రూ.517.10 కోట్ల విలువైన టెండర్లకు సమావేశంలో ఆమోదం తెలిపినట్టు మంత్రి వివరించారు. 190 ఎంఎల్డి సామర్థ్యంగల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి, ఐదేళ్లపాటు ఆపరేషన్ మరియు నిర్వహణకై రూ.560.57 కోట్ల విలువైన టెండర్లకు మరియు ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి రూ.494.86 కోట్ల విలువైన టెండర్లకు ఆమోదం లభించిందన్నారు. జాతీయ రహదారికి అనుసంధానమయ్యే ఇ-3, ఇ-13 మరియు ఇ-15 రోడ్ల నిర్మాణానికై అవసరమైన టెండర్లను పిలిచేందుకు కూడా సమావేశం ఆమోదించిందన్నారు. ఇ-3 సీడ్ యాక్సిస్ రోడ్డులో 1.5 కి.మీ మేర ఎలివేటెడ్ రోడ్ల నిర్మాణానికి మరియు 4.10 కి.మీ ఇ-13 రోడ్డును రూ.384.78 కోట్లుతో పొడిగించేందుకు, 3.98 కి.మీ. ఇ-15 రోడ్డును రూ.70 కోట్లతో పొడిగించేందుకు సమావేశం ఆమోదించిందన్నారు.
ఇప్పటి వరకూ 71 సంస్థలకు 1,050 ఎకరాలు కేటాయింపు
రాష్ట్ర రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో పలు సంస్థలకు భూముల కేటాయింపునకు సంబంధించి మంత్రుల బృందం సమావేశం నేడు జరిగిందని, సమావేశంలో ఏడు సంస్థలకు భూములను కేటాయించడం జరిగిందని మంత్రి వివరించారు. న్యాయ విశ్వ విద్యాలయాలనికి 55 ఎకరాలు, క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు, ఆదాయ పన్ను శాఖకు 0.78 ఎకరాలు, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీకి 0.78 ఎకరాలు, కోస్టల్ బ్యాంక్ హెడ్ ఆఫీసుకి 0.40 ఎకరాలు, ఐఆర్సీటీసీ హోటళ్లకు ఒక ఎకరం కేటాయించినట్టు మంత్రి నారాయణ వివరించారు. అదేవిధంగా బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్కు గతంలో 15 ఎకరాలు ఇవ్వడం జరిగిందని, అయితే వైద్య కళాశాల నిర్మాణానికి ఇప్పుడు మరో 6 ఎకరాలను కేటాయించడం జరిగిందన్నారు. గతంలో 64 సంస్థలకు భూములను కేటాయించడం జరిగిందన్నారు. ఈవిధంగా ఇప్పటివరకూ మొత్తం 71 సంస్థలకు 1,050 ఎకరాలను కేటాయించడం జరిగిందని మంత్రి నారాయణ తెలిపారు.