- 152 ఓట్ల మెజార్టీతో గెలుపు
- ఆయనకు 452, విపక్ష అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు
- ఓటింగ్ కు దూరంగా బీఆర్ఎస్, బీజేడీ, అకాళీదళ్
- సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అభినందనలు
న్యూఢిల్లీ (చైతన్యరథం) ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపొందారు. మొత్తం 781 మంది సభ్యులకుగాను 767 మంది పార్లమెంట్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత రాష్ట్ర సమితి, బీజేడీ, శిరోమణి అకాళీదళ్ సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థులుగా ఎన్డీయే తరపున సీపీ రాధా కృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పోటీ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో విజయానికి కావాల్సిన ఓట్లు 377 కాగా.. రాధాకృష్ణన్కు 452 ఓట్లు, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి. 14 మంది ఎంపీలు గైర్హాజరయ్యారు. పోలైన మొత్తం ఓట్లలో 15 చెల్లనివిగా గుర్తించారు. దీంతో 152 ఓట్ల మెజార్టీతో రాధాకృష్ణన్ గెలుపొందినట్టు రాజ్యసభ సెక్రటరీ ప్రకటించారు. పార్లమెంట్ నూతన భవనంలోని ‘ఎఫ్- 101 వసుధ’లో మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. భారత 17వ ఉప రాష్ట్రపతిగా ఘన విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. 1957 అక్టోబరు 20న తమిళనాడులోని తిరుప్పూర్లో ఆయన జన్మించారు. తమిళనాడు నుంచి ఉప రాష్ట్రపతి పీఠం అధిష్ఠించనున్న మూడో వ్యక్తిగా రాధాకృష్ణన్ గుర్తింపు పొందారు.
ప్రజాస్వామ్మ విలువలు మరింత బలోపేతం సీఎం చంద్రబాబు
భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఆయన పదవీకాలం విజయవంతంగా పూర్తిచేయాలని ఆశిస్తున్నానన్నారు. పదవీకాలంలో దేశసేవకు, పురోగతికి తనవంతు సేవ చేయడానికి కృషి చేస్తారని ఆకాంక్షించారు. ఆయన అపార జ్ఞానం, అనుభవం ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేస్తాయని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఫోన్లో మంత్రి లోకేష్ శుభాకంక్షలు
భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్కి విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ఫోన్లో శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పరిశీలనకు ఢిల్లీ వెళ్లిన మంత్రి లోకేష్ ఫలితం వెలువడిన తరువాత అమరావతికి తిరుగు పయనమయ్యారు.