- పది రోజుల దూరంలో ఎమ్మెల్సీ ఎన్నికలు
- కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించాలి
- సార్వత్రిక ఎన్నికల స్ట్రైక్ రేట్ దాటాలి
- రూ.7 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు
- 4 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..
- 8 నెలల ప్రభుత్వ ప్రగతిని వివరించండి
- టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు పిలుపు
అమరావతి (చైతన్య రథం): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు 10 రోజుల సమయమే ఉందని, మూడు పార్టీల నేతలు నిత్యం సమన్వయంతో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నేతలు కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా విజయం కోసం పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చే మెజారిటీ సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే మెరుగ్గా ఉండాలన్నారు. ఉమ్మడి గుంటూరు- కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. కూటమి నేతలతో సీఎం చంద్రబాబు ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించేలా నాయకులంతా సమష్టిగా పనిచేయాలని ఆదేశించారు. ప్రతి ఎన్నిక పరీక్షవంటిదేనని.. ప్రతి ఎన్నికలోనూ కూటమి విజయం సాధించాలని తేల్చిచెప్పారు. మూడు పార్టీల అభ్యర్థులు కలిసికట్టుగా పనిచేయడం సహా క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోవాలని, ఓటర్లను చైతన్యపరచాలని సూచించారు.
ప్రజలు మనపై నమ్మకంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్ రేట్తో కూటమికి ప్రజలు తీర్పు ఇచ్చారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రతిరోజూ పని చేస్తున్నామన్నారు. వ్యవస్థలను గాడిలో పెట్టి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించామని, పాలనలో స్పష్టమైన మార్పు తీసుకొచ్చామని చెప్పారు. బ్రాండ్ ఏపీతో పెట్టుబడులు సాధించి యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారుల్లో నమ్మకం కల్పించాం. దాదాపు రూ.7లక్షల కోట్ల పెట్టుబడులకు పైగా ఒప్పందాలు కుదుర్చుకున్నాం.. దీని ద్వారా 4 లక్షలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్రమంతటా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.
ప్రతి నెలా 64 లక్షలమందికి పెన్షన్ ఇస్తున్నాం. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. గత ప్రభుత్వం విద్యార్థులకు బకాయి పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్లో రూ.780 కోట్లు చెల్లించాం. ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నాం. విద్యావంతులైన మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఆదాయ మార్గాల కల్పనకు ఆలోచనలు చేస్తున్నాం. ఇవన్నీ 8 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేపట్టింది. చేసిన మంచి కార్యక్రమాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనపై ఉంది.