దావోస్ (చైతన్యరథం): ఏపీ విద్యారంగంలో ప్రపంచస్థాయి శిక్షణా కార్యక్రమాలకు సహకరించాలని వరల్డ్ ఎకమికమిక్ ఫోరం (డబ్ల్యుఇఎఫ్) న్యూఎకానమీ, సొసైటీ విభాగం ఎంగేజ్మెంట్ అండ్ ఆపరేషన్స్ విభాగం హెడ్ రవి గుత్తాను రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. రవి గుత్తాతో దావోస్ కాంగ్రెస్ సెంటర్లో భేటీ అయిన మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో విద్యారంగానికి గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించేందుకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో గ్లోబల్-స్టాండర్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లను రూపొందించడానికి సహకారం అందించండి. డబ్ల్యుఇఎఫ్ వార్షిక సమావేశం వంటి గ్లోబల్ ప్లాట్ఫారమ్లలో ఆంధ్రప్రదేశ్ని విద్యాపరమైన ఆవిష్కరణలు, సాంకేతికతకు కేంద్రంగా ప్రోత్సహించడంలో సహకారం అందించండి. స్వర్ణాంధ్ర` 2047 లక్ష్యాలకు అనుగుణంగా విద్య, మానవ మూలధనం అభివృద్ధిలో ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పాలని నిర్ణయించాం. భవిష్యత్ నైపుణ్యాలు, అభ్యసనా పద్ధతులు, ఎమర్జింగ్ టెక్నాలజీస్పై ప్రత్యేకంగా దృష్టిసారించాం. విద్యాప్రమాణాలను మెరుగుపర్చడానికి ఏఐ, డిజిటల్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతకతలు వినియోగిస్తున్నాం. పరిశ్రమ సంబంధిత అధునాతన శిక్షణ కోసం ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ కోరారు.
దీనిపై రవి గుత్తా స్పందిస్తూ… భారతదేశంలో విద్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో తాము చురుగ్గా పాల్గొంటున్నామని తెలిపారు. బోధన, అభ్యాసం కోసం ఏఐ వినియోగంలో భారత్కు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్ మార్కెట్ల కోసం శ్రామికశక్తిని సిద్ధం చేయడంలో భారత సంస్థలతో కలిసి పనిచేస్తామని రవి గుత్తా చెప్పారు.