- పెంపుదలపై కేంద్రంతో మాట్లాడతాం
- కర్నూలు జిల్లాలో అవసరమైన సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేస్తాం
- త్వరలోనే మరో డీఎస్సీ ప్రకటిస్తాం: శాసనసభలో మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్య రథం): ‘సమగ్రశిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, డీటీపీ ఆపరేటర్లు, ఇతర సిబ్బందికి జీతాల పెంపుదలపై వచ్చే ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు సమావేశంలో చర్చిస్తాం. కేంద్రంతో కూడా సంప్రదిసా’్తమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శాసనసభలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడకుదిటి ఈశ్వరరావు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ… సమగ్రశిక్షలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, డీటీపీ ఆపరేటర్ల జీతాలు దక్షిణ భారతంలోని తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలతో పోలిస్తే ఏపీలోనే అత్యధికంగా ఉన్నాయన్నారు. గతంలో మూడు నెలలకోసారి జీతాలు ఇవ్వగా, ప్రస్తుతం ప్రతినెలా 1న జీతాలు చెల్లిస్తున్నాం. సమగ్ర శిక్ష అనేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇందులో 60శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా, 40శాతం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేస్తుంది. అందువల్ల ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్రప్రభుత్వ ఆమోదంతోనే తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు.
కర్నూలు జిల్లాలో సీజనల్ హాస్టళ్లు పెంచాలన్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి చేసిన విజ్ఞప్తిపై మంత్రి లోకేష్ సమాధానమిస్తూ… కర్నూలు జిల్లాలో అవసరమైనమేర నూటికి నూరుశాతం సీజనల్ హాస్టళ్ల మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. “యువగళం పాదయాత్ర సందర్భంగా ఆలూరు, ఆదోని, మంత్రాలయంలో పర్యటించినపుడు ఆ ప్రాంతం ఎంత వెనుకబడి ఉందో ప్రత్యక్షంగా చూశాను. నంద్యాల, కర్నూలు పార్లమెంటు నడుమ ఎంతో వ్యత్యాసం కనిపించింది. నిన్న జరిగిన ఎసఐపీబీ సమావేశంలో కర్నూలు పార్లమెంటు పరిధిలో వస్తున్న పరిశ్రమలకు అదనపు ఇన్సెంటివ్స్ కూడా ప్రజాప్రభుత్వం ఆమోదించింది. ఆ ప్రాంతంలో పెద్దఎత్తున పెట్టుబడులు తెచ్చే లక్ష్యంతో మేం పనిచేస్తున్నాం. గత ఏడాది జరిగిన డీఎస్సీలో కూడా కర్నూలు జిల్లాకు ఎక్కువ ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేశాం. అయినా ఇప్పటికీ టీచర్ -స్టూడెంట్ రేషియో అక్కడ తక్కువగా ఉంది. త్వరలో మరో డీఎస్సీ ప్రకటించబోతున్నాం. అందులో కర్నూలు పార్లమెంటుపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తాం. ఆ ప్రాంతంలో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం” అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
















