- నెలాఖరునుంచి డేటాలేక్ ద్వారా సమాచార విశ్లేషణ
- ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా పౌరసేవలు
- ఆర్టీజీఎస్ పై సమీక్షలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి (చైతన్య రథం ప్రభుత్వ శాఖలన్నిటికీ కామన్ డేటా సెంటర్గా ఆర్టీజీఎస్ వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెలాఖరునుంచి ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారమంతా క్రోడీకరించి డేటా లేక్ ద్వారా విశ్లేషించనున్నట్టు వెల్లడించారు. మంగళవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంనుంచి వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా మెరుగైన పౌరసేవలు అందించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజలనుంచి వస్తున్న సమాచారాన్ని విశ్లేషించి సేవలను సులభతరం చేయాలని ఆదేశించారు. సమాచార మాధ్యమాల్లో వచ్చిన వివిధ అంశాలపై స్పందించి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రజలకు సంబంధించిన అంశాల్లో ఎక్కడా రాజీపడొద్దని వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 175 నియోజకవర్గాల్లోని స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ల ద్వారా విస్తృత ప్రచారం జరగాలన్నారు.
వ్యవసాయం, నీటి భద్రత, మార్కెటింగ్ తదితర డిమాండ్ డ్రివెన్ పంటలులాంటి అంశాలపై ‘రైతన్నా… మీకోసం’ పేరిట రైతుల వద్దకు వెళ్లామని అన్నారు. ఏపీలో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివిధ సంస్థలు, కాంట్రాక్టర్లు నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించేలా డేటాను విశ్లేషించాలని సీఎం ఆదేశించారు. డిసెంబరు నెలాఖరులోగా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన 794 సర్వీసులు వాట్సవ్ గవర్నెన్సు ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇక ప్రతీ నెలా జీఎస్టీపీ సహా ఎకనమిక్ ఇండికేటర్లను పరిశీలించనున్నట్టు తెలిపారు. కేంద్రానికి పంపే నివేదికలు కూడా కీ పెర్ఫార్మెన్సు ఇండికేటర్ల ఆధారంగానే ఉంటాయని.. ఆమేరకు అధికారులు, ప్రభుత్వోద్యోగులు సామర్ధ్యాలు పెంచుకోవాలని సూచించారు. ప్రజావసరాలకు అనుగుణంగానే పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు.













