- ప్రపంచ స్థాయి ఐటీ/ ఐటీఈఎస్ క్యాంపస్ ఏర్పాటు
- రూ.1,583 కోట్ల పెట్టుబడులు
- 8 వేల మందికి ఉద్యోగాలు
- కాపులుప్పాడ వద్ద 21.31 ఎకరాల భూమి కేటాయింపు
- రాష్ట్రంలో ఐటీ రంగానికి పెద్ద ఊపు
- మంత్రి లోకేష్ మరో భారీ విజయం
విశాఖపట్నం (చైతన్యరథం): ఐటీ రంగంలో పెట్టుబడులకు దిగ్గజ కంపెనీలను ఒప్పించడంలో విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ మరో పెద్ద విజయం సాధించారు. విశాఖను ఐటీ హబ్గా అభివృద్ధి చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలతో విశాఖ మరో సిలికాన్ వ్యాలీగా మారే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మంత్రి లోకేష్ చొరవతో ఇప్పటికే విశాఖలో టీసీఎస్ భారీ క్యాంపస్ ఏర్పాటుకు సర్వం సిద్ధమయింది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ పర్యావరణ వ్యవస్థకు పెద్ద ఊపునిస్తూ మరో దిగ్గజ ఐటీ కంపెనీ విశాఖలో క్యాంపస్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. విశాఖపట్నంలో రూ.1,582.98 కోట్ల పెట్టుబడితో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ ముందుకొచ్చింది. ఈ సంస్థ ఏర్పాటుతో దాదాపు 8000 ఉద్యోగాలు వస్తాయని అంచనా.
ఏపీలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు మంత్రి నారా లోకేష్తో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో జరిగిన చర్చల్లో కాగ్నిజెంట్ సుముఖత వ్యక్తం చేసింది. ఆ తరువాత కూడా మంత్రి లోకేష్ పట్టువదలకుండా ప్రయత్నించి విజయం సాధించారు. ఈ క్రమంలో విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) కింద కాపులుప్పాడ వద్ద 21.31 ఎకరాల భూమి కావాలని కాగ్నిజెంట్ కోరింది. ఈ కంపెనీకి ఎకరా భూమిని 99 పైసల నామమాత్రపు ధరకే కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచ స్థాయి ఐటీ/ ఐటీఈఎస్ క్యాంపస్ను స్థాపించడానికి సిద్ధంగా ఉన్నట్లు కాగ్నిజెంట్ వెల్లడిరచింది.
2029, మార్చి నాటికి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించేలా ఈ కంపెనీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. మొత్తం ప్రాజెక్ట్లో 100 శాతం నిధులను కాగ్నిజెంట్ సొంతంగా సమీకరించుకోనుంది. విశాఖపట్నంలో క్యాంపస్ ఏర్పాటు.. ఆంధ్రప్రదేశ్ పట్ల కాగ్నిజెంట్ దీర్ఘకాలిక నిబద్ధతకు తిరుగులేని నిదర్శనంగా భావిస్తున్నారు. ఈ పెట్టుబడి అభివృద్ధి చెందుతున్న ఐటీ కేంద్రంగా రాష్ట్ర ఖ్యాతిని మరింత దృఢంగా చాటిచెబుతోంది.
ఐటీ పెట్టుబడుల అభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చెందే క్రమంలో వైజాగ్కు కాగ్నిజెంట్ రావటం గొప్ప మైలురాయిగా లోకేష్ అభివర్ణించారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడుల ఆకర్షణ, ముఖ్యంగా ఐటీ రంగంలో దిగ్గజసంస్థలను తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న ఐటీ మంత్రి నారా లోకేష్కు కాగ్నిజెంట్ రాక.. మరో పెద్ద విజయంగా భావిస్తున్నారు. మరోవైపు విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం దిగ్గజ సంస్థలను రప్పిస్తోంది. అందులో భాగంగా ఇటీవల టీసీఎస్ ఆపరేషన్స్ సెంటర్ ఏర్పాటు కోసం భూమిని కేటాయించింది. టీసీఎస్కు రుషికొండలో 21.6 ఎకరాలను కేటాయించింది. ఎకరాకు నామమాత్రంగా 99 పైసలకే లీజు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో ఏర్పాటు చేయబోయే కేంద్రంలో టీసీఎస్ రూ. 1,370 కోట్లు పెట్టుబడిగా పెట్టబోతోంది. దీని ద్వారా 12 వేల నుంచి 15వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉంది.