విజయవాడ (చైతన్యరథం): అణగారిన వర్గాల ఆశా జ్యోతి సావిత్రిభాయి పూలే స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఆమె ఆశయాల సాధనే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. సావిత్రభాయి పూలే జయంతి సందర్భంగా విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె విగ్రహానికి పూల మాలలు వేసి మంత్రి సవిత ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, సావిత్రిబాయి ఫూలే గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారిణి అని కొనియాడారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, మహిళల హక్కుల కోసం పోరాటం చేసిన ధీశాలన్నారు. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని, స్త్రీ విద్య కోసం కృషి చేసిన మొట్టమొదటి మహిళా ఉద్యమకారిణి అని అన్నారు. తన భర్త మహత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం గొప్ప పోరాటం చేశారన్నారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారని, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించారన్నారు.
సావిత్రి బాయిపూలే ఆశయ సాధనేలక్ష్యంగా టీడీపీ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించారన్నారు. బడుగు, బలహీన వర్గాలతో పాటు మహిళలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేశారన్నారు. మహిళలకు ఉన్నత విద్యే లక్ష్యంగా మహిళా యూనివర్శిటీని నెలకొల్పారన్నారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు మహిళలకు రాజకీయ, ఆర్థిక భరోసా కలిగించేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. విద్య, ఉద్యోగావకాశాల్లో మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కూడా సీఎం చంద్రబాబుదేనన్నారు. స్థానిక సంస్థల్లోనూ 34 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. బాలికా విద్య కోసం తల్లికి వందనం పథకం అమలు చేసి, ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేశారన్నారు. మహిళల పేరున రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు అందజేశారన్నారు. ప్రతి ఇంటి నుంచి మహిళా పారిశ్రామిక వేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఎంఎస్ఎంఈ పార్కుల్లో స్త్రీలకు అవకాశమిస్తున్నార న్నారు. సావిత్రిబాయి పూలే ఆశయాల సాధనే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల ఆద్యుడు సీఎం చంద్రబాబు
అని మంత్రి సవిత కొనియాడారు.
బీసీ ఉద్యోగుల సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ
అంతకుముందు ఏపీ బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ క్యాలెండర్ను మంత్రి సవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్ రాజు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, నందం అబద్ధయ్య, పేరేపి ఈశ్వర్, ఈశ్వరరావు, శ్రీధర్, వెంకటేశ్వరరాజు సహా పలువురు కార్పొరేషన్ల డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఏపీ బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ ప్రతినిధులు కె.శ్రీనివాసులు, ఎం.ప్రసాద్, చలం, వి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
















