- పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీలు
- బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో పరిశ్రమలు తెచ్చేందుకు 6 రోజుల పర్యటన
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటించనున్నారు. ఈనెల 26నుంచి 31 వరకు ఆరు రోజులపాటు ఆయన ఆ దేశంలో పర్యటిస్తారు. దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీలు నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దావోస్ పర్యటనకు వెళ్లిన సిఎం… రెండో విదేశీ పర్యటనగా సింగపూర్కు వెళ్తున్నార. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు ఈ పర్యటనను వేదిక చేసుకోనున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ విధానాలను వివరించి పెట్టుబడుదారులను ఆహ్వానించనున్నారు.
పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, 1053 కి.మీ తీరప్రాంతం, నిపుణులైన మానవ వనరులు గురించి అంతర్జాతీయ పెట్టుబడిదారులకు వివరించనున్నారు. అలాగే పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు. ఆరు రోజుల పర్యటనలో సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే ‘తెలుగు డయాస్పోరా’ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఏపీలో పెట్టబడులపై ఆయా దేశాలవారిని ఆహ్వానించనున్నారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ`4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీపం పారిశ్రామికవేత్తలను కోరనున్నారు.
విశాఖ పెట్టుబడుల సదస్సు లక్ష్యంగా…
ఏపీలో పోర్టు ఆధారిత ప్రాజెక్టులు, సెమి కండక్టర్లు, ఏఐ, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడులపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఈ ఏడాది నవంబరులో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకుగానూ.. ఆ దేశానికి చెందిన ప్రముఖులతోనూ ముఖ్యమంత్రి భేటీ అవుతారు. డిజిటల్ ఎకానమీ, ఫిన్టెక్పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే సింగపూర్లో నిర్వహించే బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు. ఆ దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను కూడా సీఎం సందర్శించనున్నారు.