- వృద్ధుని మరణానికి కిడ్నీ సమస్యలే కారణం
- మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో మృతిచెందాడు
- సీఎంకు వివరించిన వైద్యారోగ్య శాఖ అధికార్లు
అమరావతి (చైతన్య రథం): శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా కేసులు నమోదు కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఈమేరకు గ్రామంలోని పరిస్థితిని సీఎంకు వైద్యారోగ్య శాఖ అధికారులు వివరించారు. తాళ్లవలస గ్రామంలో శనివారం రాత్రి, ఆదివారం ఉదయం వరకు ఆరుగురు వ్యక్తులు అస్వస్థతకు గురవగా వారిని టెక్కలి ఆసుపత్రికి తరలించామని చెప్పారు. సోమవారం మరో ముగ్గురు ఆసుపత్రిలో చేరారని అధికారులు సీఎంకు వివరించారు. బాధితులంతా వేర్వేరు కుటుంబాలకు చెందినవారని, ప్రస్తుతం ఆసుపత్రిలో ఐదుగురు చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని, ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. అయితే చిన్నారావు (70) అనే వృద్ధుడు చికిత్స పొందుతూ ఆదివారం మరణించారని తెలిపారు. చిన్నారావు మృతికి డయేరియా కారణం కాదని వైద్యారోగ్య శాఖ అధికారులు చెప్పారు. చిన్నారావు మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారని… మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ వల్ల గుండెపోటు వచ్చి మృతి చెందారని వైద్యులు నిర్ధారించినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. గ్రామంలో ఉన్న ఒక బావి ద్వారా 5 పబ్లిక్ కుళాయిలకు నీటి సరఫరా అవుతోందని… అలాగే మరో 2 చేతి పంపుల నీరు సరఫరా అవుతోందని వివరించారు. ఈ నీటిని ఆర్డబ్ల్యుఎస్ ద్వారా పరీక్షించగా, ఎక్కడా కలుషితం లేదని, నీరు తాగడానికి సురక్షితమేనని తేలిందని అధికారులు చెప్పారు.
అయినా ముందు జాగ్రత్త చర్యగా బావినుంచి నీటి సరఫరాను నిలిపివేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. జిల్లా పంచాయతీ ఆఫీసర్, ఎస్ఈ (ఆర్డబ్ల్యుఎస్) క్ష్షేత్రస్థాయిలోనే ఉండి పారిశుధ్యం, నీటి సరఫరాను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. డయేరియా ప్రబలడానికిగల అసలు కారణాన్ని కనుగొనేందుకు డిప్యూటీ డీఎంహెచ్వో, ఎపిడెమియాలజిస్ట్ గ్రామంలోనే ఉండి పరిశీలిస్తున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నాయని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. తాళ్లవలస గ్రామస్థులు ఎందుకు అనారోగ్యం పాలవుతున్నారో గుర్తించాలని సీఎం ఆదేశించారు. గ్రామస్థులకు సరఫరా అయ్యే నీటిలో ఎక్కడైనా మలినాలు కలుస్తున్నాయా…? లేక ఇతర కారణాలా…? అనేది విశ్లేషించాలని సూచించారు. గ్రామస్థులందరికీ సురక్షితమైన మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవడంతోపాటు… సమీప గ్రామాలపైనా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.















