- సాయంత్రం విజయవాడలో అమరజీవి ఆత్మార్పణ దినం కార్యక్రమానికి సీఎం హాజరు
అమరావతి (చైతన్యరథం): హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న కన్హా శాంతి వనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించనున్నారు. సీఎం చంద్రబాబు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి ఉదయం బయల్దేరి 11 గంటలకు కన్హా శాంతివనం చేరుకోనున్నారు. ఆశ్రమం అధ్యక్షులు కమలేష్ డి.పటేల్ దాజీతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రెండు గంటల పాటు శాంతివనంలోని వెల్ నెస్, మెడిటేషన్ సెంటర్ సహా, యోగా కేంద్రాలను ముఖ్యమంత్రి తిలకిస్తారు. ట్రీ కన్జర్వేషన్ సెంటర్, రెయిన్ ఫారెస్ట్ కేంద్రం, మెడిటేషన్ సెంటర్, బయోచార్ కేంద్రం, పుల్లెల గోపీచంద్ స్టేడియంతో పాటు హార్టిఫుల్ నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ను సీఎం సందర్శిస్తారు. అనంతరం శాంతివనం వ్యవస్థాపకులు దాజీ నివాసానికి వెళతారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మొత్తం 1400 ఎకరాల్లో కన్హా శాంతి వనాన్ని శ్రీరామచంద్ర మిషన్ అభివృద్ధి చేసింది. ఈ ఆశ్రమంలో ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ ఉంది. 8 లక్షలకు పైగా వివిధ జాతుల వృక్షాలతో బయోడైవర్సిటీ కేంద్రంగా ఈ ఆశ్రమం పెద్దఎత్తున పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది.
మానవ వనరుల్ని గ్లోబల్ లీడర్లుగా తయారు చేసేందుకు అధ్యక్షులు దాజీ నేతృత్వంలో హార్ట్ఫుల్ నెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ను ఈ ఆశ్రమం నిర్వహిస్తోంది. కౌశలం పేరిట శిక్షణా కార్యక్రమాలను చేపడుతోంది. కన్హా శాంతివనంలోని యోగా, మెడిటేషన్, వెల్నెస్ సెంటర్లతో పాటు సుస్థిర వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు హెలికాప్టర్లో బయల్దేరి అమరావతికి తిరిగి రానున్నారు. మధ్యాహ్నం సచివాలయంలో అధికారులతో వేర్వేరు సమీక్షల్లో పాల్గొంటారు. సోమవారం సాయంత్రం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమానికి హాజరు కానున్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకునేందుకు ఆత్మార్పణ దినం కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది.
















