అమరావతి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా క్లినికల్ సైకాలజీ కోర్సుల్ని ప్రారంభించనున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాధి నిర్ధారణ, చికిత్స అందించడంలో క్లినికల్ సైకాలజిస్టులు కీలక పాత్ర వహిస్తారన్నారు. దీంతోపాటు అన్ని రకాల రోగులు వ్యాధుల నుంచి పూర్తిగా కోలుకోవడం(రిహేబిలిటేషన్)లో కూడా ప్రధాన భూమిక వహిస్తారు. కానీ మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్లినికల్ సైకాలజిస్టులు దాదాపుగా లేని పరిస్థితి నెలకొంది. దీనికి కారణం రాష్ట్రంలోనే కాక దాదాపు అన్ని చోట్లా క్లినికల్ సైకాలజీ కోర్సులు నిర్వహించక పోవడమే. క్రమేపీ పెరుగుతున్న మానసిక సమస్యలు, క్లినికల్ సైకాలజిస్టుల లోటును దృష్టిలో పెట్టుకుని అతి త్వరలో రెండేళ్ల వ్యవధితో కూడిన ఎం.ఫిల్, ఒక ఏడాదిపాటు సాగే ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ కోర్సుని ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ రెండు కోర్సుల్ని వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు వీలుగా మార్గదర్శకాల్ని తయారు చేయాలని అధికారుల్ని ఆదేశించాను. క్లినికల్ సైకాలజీ విద్యను నియంత్రించే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సంప్రదింపులు జరిపి ఎంతో ఉపయోగకరమైన ఈ కోర్సుల్ని రాష్ట్రంలో త్వరలో ప్రారంభిస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నానని ఎక్స్లో మంత్రి సత్యకుమార్ పోస్ట్ చేశారు.