` జాతీయ పతాకాన్ని రూపొందించింది తెలుగువారు కావడం గర్వకారణం
` మోదీ రూపంలో దేశానికి సమర్థ నాయకత్వం
` భారత్ది డెడ్ ఎకానమీ కాదు, గుడ్ ఎకానమీ
` మోదీ నాయకత్వంలో త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
` ప్రతి ఇల్లు, ప్రతి కార్యాలయంపై జాతీయ జెండా రెపరెపలాడాలి
` హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
విజయవాడ (చైతన్యరథం): కుల, మత, ప్రాంత, భాషా భేదం లేకుండా దేశమంతా ఒకటే అనే జాతీయ భావన పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరంగా అంటే కేవలం ఇంటిపై జెండా ఎగరేయడం కాదని, దేశభక్తిని పెంచే సంకల్పమన్నారు. సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ముందుగా జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పింగళి వెంకయ్య జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…గతంలో ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అనేక కార్యక్రమాలకు తాను హాజరయ్యానని, కానీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిస్తోందన్నారు. ఏ జెండా చూస్తే ప్రతి భారతీయ పౌరుడి మనసు పులకరిస్తుందో, ఏ జెండా చూస్తే దేశం యావత్తు గర్వంగా తలెత్తుకుంటుందో, ఏ జెండా చూస్తే ఉద్వేగం కలుగుతుందో అదే మువ్వన్నెల జెండా’ అన్నారు.
పింగళి తెలుగువారు కావడం గర్వకారణం
ప్రపంచంలోనే అతి శక్తివంతమైన జాతీయ జెండాను మన తెలుగు వ్యక్తి పింగళి వెంకయ్య రూపొందించడం మనందరికీ గర్వకారణం. జెండా అంటే కేవలం ఒక వస్త్రం కాదు. మన దేశ గౌరవం. జాతీయ జెండా చూడగానే మనందరిలో ఉద్వేగం, దేశభక్తి కలుగుతుంది. ఎందరో మహానుభావులు తెలుగునేలపై జన్మించారు. వారి పోరాటపటిమతో మనలో జాతీయస్పూర్తిని రగిలించారు. 1857లో ప్రథమ స్వాతంత్య్ర పోరాటం జరగ్గా అంతకముందే బ్రిటీష్ వారిపై తెలుగు వారు పోరాటం చేశారు. బ్రిటీష్ వారిని గడగడలాడిరచిన అల్లూరి సీతారామరాజు, తుపాకీ గుళ్లకు గుండె చూపించిన టంగుటూరి, గొట్టిపాటి బ్రహ్మయ్య, సర్దార్ గౌతు లచ్చన్న, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య వంటి స్వాతంత్య్ర సమరయోధులు తెలుగు గడ్డపై పుట్టడం మన అదృష్టం అని సీఎం చంద్రబాబు అన్నారు.
దేశం ఎవరికీ తలవంచదు
దేశ సమగ్రత విషయంలో భారత్ ఎవరికీ తలవంచదు. దేశ క్షేమం, భద్రత విషయంలో మనమంతా ఒకటే. కార్గిల్ యుద్ధం, పహల్గామ్ ఘటన జరిగినప్పుడు దేశ ప్రజానీకం ఒక్క తాటిపై నిలిచింది. నేడు ఉన్నది దృఢమైన భారతదేశం. విశ్వగురువుగా అవతరిస్తున్న భారతదేశం. ఆపరేషన్ సిందూర్తో ఉగ్రవాదానికి గట్టిగా బదులిచ్చాం. ఉగ్రవాదుల గుండెల్లో సైనికులు రైళ్లు పరుగెత్తించారు. ఉగ్రవాదంపై అలుపెరుగని పోరాటం చేస్తున్న మన సైనికులకు సెల్యూట్ చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
భారత్ది గుడ్ ఎకానమీ
ప్రధాని మోదీ రూపంలో మన దేశానికి సమర్థవంతమైన నాయకత్వం లభించింది. ఒకప్పుడు మనది పేద దేశం అనేవాళ్లు. 11 ఏళ్ల మోదీ పాలనలో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చింది. 2028కి 3వ స్థానానికి చేరుతుంది. 2047లో వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే నాటికి ప్రపంచంలోనే శక్తివంతంగా మనదేశం నిలుస్తుంది. 2047 నాటికి దేశంలో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనది డెడ్ ఎకానమీ అన్నారు. ఎవరిది డెడ్ ఎకానమీనో భవిష్యత్ నిర్ణయిస్తుంది. మనపై సుంకాలు వేయడం తాత్కాలికమే. మనది గుడ్ ఎకానమీ. మన భారతీయుల సేవలు ప్రపంచానికి చాలా అవసరం. తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు 1991లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. 1995లో ఐటీ విప్లవం వచ్చింది. దాన్ని మనం అందిపుచ్చుకుని ముందుకెళ్లాం. ఐటీని ప్రమోట్ చేసేందుకు హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టాం. నేడు ఏపీలో క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నాం. యువత ఎక్కువగా ఉండే దేశం మనది. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని స్థిరమైన అభివృద్ధి సాధించే దిశగా ముందుకు వెళదామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.