నందికొట్కూరు (చైతన్య రథం): హంద్రీనీవా ఫేజ్-1 కాల్వల విస్తరణ పనులు పూర్తి కావడంతో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు జలాలు విడుదల చేశారు. జలహారతి ఇచ్చి నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్లో రెండు మోటార్లను ఆన్ చేశారు. నీటి విడుదలతో రాయలసీమకు తాగు, సాగునీటి కష్టాలు తీరనున్నాయి. పుష్కర కాలం తర్వాత సీమకు 40 టీఎంసీ నీరు అందుబాటులోకి వచ్చింది. జలవనరులశాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను సీఎం తిలకించారు. ప్రాజెక్టు అలైన్మెంట్, ఆయకట్టు, కృష్ణా రివర్ బేసిన్ మ్యాప్లను పరిశీలించారు. పంపింగ్ స్టేషన్ వ్యూపాయింట్ నుంచి నీటి విడుదలను వీక్షించారు. నీటిపారుదల మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ బైరెడ్డి శబరి, ఇరిగేషన్ ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.