- ఇప్పటివరకూ మంచితనమే చూశారు..
- ఇకపై తప్పుడు వైఖరిని ఉపేక్షించను
- వైసీపీ తీరుపై మండిపడిన చంద్రబాబు
మంగళగిరి (చైతన్య రథం): వైకాపా అధినేత జగన్ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత ధైర్యం ఉంటే తెనాలిలో గంజాయి బ్యాచ్ను పరామర్శిస్తారని మండిపడ్డారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ప్రజా భద్రత, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోను. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశం చేసింది చాలక కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక రాక్షసుల మాదిరి రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నారు. దేవతల రాజధాని అమరావతిని వేశ్యల రాజధాని అన్నారు. తెనాలిలో గంజాయి బ్యాచ్ను పరామర్శిస్తారా.? పొదిలికి గూండాలను తీసుకెళ్లి మహిళలపై దాడి చేసి రౌడీయజం చేస్తారా.? ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా బుద్ధి రాలేదు. సమస్యలను అధిగమనించేందుకు మేము ప్రయత్నిస్తుంటే రాక్షసుల మాదిరి రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని, శాంతిభద్రతల సమస్య సృష్టించి ప్రజలకు ఇబ్బందులు కలిగించాలని రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. నేరాలు, ఘోరాలు చేసేవారికి అండగా ఉంటున్నారు. ఇలాంటి వారికి ప్రజలెందుకు మద్దతివ్వాలి. పొగాకు క్వింటాకు రూ.12 వేలు ధర ఇస్తున్నాం. బాధ్యత లేకుండా వేలమందిని వెంటేసుకుని పొదిలి వెళ్లి హంగామా చేశారు. దేవతల రాజధాని అమరావతి వేశ్యల నగరమా? ఎంత కొవ్వెక్కితే ఇలాంటి మాటలు వస్తాయి.? అమరావతిపై చేసిన మురికి వ్యాఖ్యలను పక్కదారి పట్టించేందుకే పొదిలి వెళ్లి గొడవలు చేశారు. అక్కడ మహిళలపై రాళ్లదాడి చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోను. ప్రజల భద్రత విషమయంలో రాజీపడను. రౌడీయిజం చేసి పెత్తనం చేయాలంటే ఆటలు సాగనివ్వను. ఇప్పటివరకూ నా మంచితనం చూశారు. ఇకపై ఉపేక్షించను’ అని సీఎం చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించారు.