- క్యాపిటల్ సిటీ ఖర్చు 64.7వేల కోట్లు
- అసెంబ్లీలో వెల్లడిరచిన మంత్రి నారాయణ
అమరావతి (చైతన్య రథం) రాజధాని అమరావతి నిర్మాణానికయ్యే ఖర్చు రూ.64,721 కోట్లని పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. 2028నాటికి రాజధాని నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో భాజపా ఎమ్మెల్యే సుజనాచౌదరి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (ఏజీసీ)లో ఇళ్లు, భవన నిర్మాణాలు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి రూ.64,721.48 కోట్లు ఖర్చవుతుందన్నారు. నిధులను వివిధ రూపాల్లో సేకరించి అమరావతి నిర్మాణం చేపడుతున్నట్టు మంత్రి నారాయణ వివరించారు. వివిధ ఏజెన్సీలు, బ్యాంకులనుంచి రుణాలు, కేంద్ర ప్రభుత్వంనుంచి గ్రాంట్లు పొందడం ద్వారా నిధులు సమీకరిస్తున్నట్టు తెలిపారు. అభివృద్ధి చేసిన ప్లాట్లను మూడేళ్లలో రైతులకు అప్పగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీఎం చంద్రబాబుపై నమ్మకంతో రైతులు 58రోజుల్లోనే 34వేల ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. ప్రపంచంలో టాప్-5 నగరాల్లో ఒకటిగా అమరావతి ఉండాలని రాజధానిని సీఎం డిజైన్ చేశారన్నారు. అమరావతి నిర్మాణానికి 30వేల ఎకరాలు కావాలని ఇదే అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పారని..
అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించి మూడు ముక్కలాట ఆడారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులను గత ఐదేళ్లలో నానా ఇబ్బందులు పెట్టారని ఆక్షేపించారు. శాడిజంతో ఆర్-5 జోన్ ఏర్పాటు చేశారని.. 50వేల మందికి ఒక సెంట్ భూమి ఇచ్చారన్నారు. వారికి కూడా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నట్టు మంత్రి వివరించారు. రాజధానికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ బ్యాంకు కలిపి రూ.13,400 కోట్ల రుణం ఇస్తున్నాయన్నారు. కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు రూ.5 వేలకోట్ల రుణం ఇస్తుందని.. హడ్కో నుంచి రూ.11వేల కోట్ల రుణం రెండు మూడు రోజుల్లో వస్తుందన్నారు. అమరావతిలో 106 ప్రభుత్వ, ప్రభుత్వేతరరంగ సంస్థలు తమ కార్యాలయాలు ఏర్పాటుచేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. సగానికి పైగా నిర్మాణం జరిగిన అధికారుల భవనాలు ఏడాదిన్నరలో పూర్తిచేస్తామని మంత్రి వివరించారు. మిగతావి రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు.