` అవినీతి సొమ్ము గుమ్మరిస్తున్న జగన్
` అధికారులకు ప్రతోభాలు, బెదిరింపులు
` ఎన్నిచేసినా ప్రజలు మా వైపే
` పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి
పులివెందుల (చైతన్యరథం): కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు ఇప్పటివరకు దాదాపు వంద కోట్ల రూపాయలు ఖర్చు చేశారని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి ఆరోపించారు. సోమవారం రాత్రి ఆయన మాట్లాడుతూ పోలింగ్ కొద్ది గంటల్లోకి వచ్చినా ఇంకా డబ్బులు, ముక్కుపుడకలు, చీరలు పంపిణీ చేస్తున్నారన్నారు. అవినీతి సొమ్మును పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక కోసం కుమ్మరిస్తున్నారు. జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి పోలింగ్ సిబ్బందిని బెదిరించారు. వైసీపీకి అనుకూలంగా చేయకపోతే వచ్చేది మా ప్రభుత్వమే మీ అంతు చూస్తానని పోలీసు అధికారులను బెదిరించారు. తొలుత ప్రలోభపెట్టారు. విననిపక్షంలో బెదిరింపులకు దిగుతున్నారు. అనేక రకాలుగా దౌర్జన్యాలు చేశారు. ఈ 35 సంవత్సరాల్లో తొలిసారి స్వేచ్ఛాయుత వాతావరణంలో 11 నామినేషన్లు వేయించి నేడు ప్రజాస్వామ్యయుతంగా పోటీకి దిగుతుంటే.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే వైసీపీకి ఓట్లు రావని టీడీపీ మీద ఇష్టమొచ్చినట్లు వారి సొంత మీడియాలో దుష్ప్రచారం చేశారు. పులివెందుల ప్రజలు అన్నీ గ్రహించారు. జరగబోయే పోలింగ్లో ప్రజలు తమ వైపే ఉన్నారని రవి ఉద్ఘాటించారు.