- ప్రపంచ వేదికపై సీఎం టీం వ్యూహాత్మక ప్రమోషన్
- దిగ్గజ సంస్థల ముందు పాలసీలు, అవకాశాలు, ఆలోచనలు
- పెట్టుబడులతో రాష్ట్రానికి రావాలంటూ సాదర ఆహ్వానం
- భేటీలు, సదస్సులు, చర్చలలో ఏపీని ఆవిష్కరించిన చంద్రబాబు
- మార్స్క్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకూ ఏకబిగిన సాగిన చర్చలు
- నెట్వర్క్ విస్తరణ, బ్రాండ్ ప్రమోషన్లో సక్సెస్
- ఆశావాహంగా ముగిసిన సీఎం బృందం దావోస్ టూర్
- ఢిల్లీకి చేరుకుంటున్న సీపం చంద్రబాబు బృందం
దావోస్ (చైతన్య రథం): ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు రోజుల దావోస్ పర్యటన విజయవంతమైంది. ఒకవైపు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈవోలు, అధిపతులు, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే.. మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో విరామం లేకుండా పాల్గొని ఏపీ బ్రాండ్ను ముఖ్యమంత్రి ప్రమోట్ చేశారు.
సమావేశాలు సఫలం
ప్రపంచం దేశాల నుంచి దావోస్కు వచ్చిన పెట్టుబడిదారులను ఆకట్టుకోవడంలో చంద్రబాబు సంపూర్ణంగా సఫలమయ్యారు. వివిధరంగాలకు చెందిన దాదాపు 15 ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను వివరించారు. వాణిజ్యాభివృద్ధికి, పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్రం కొత్తగా తీసుకువచ్చిన పాలసీలు, స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికలు… పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయసహకారాలను వివరించారు. రాష్ట్రానికి వచ్చి అనుకూలతలను ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆహ్వానించారు. దీంతో పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆసక్తి కనబర్చాయి. స్వయంగా రాష్ట్రంలో పర్యటించి పెట్టుబడుల అంశాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఆయా సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి.
పర్యటన మొదటి రోజు
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు తొలిరోజు పర్యటనలో ముందుగా జ్యూరిచ్లోని హిల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్లోని భారత అంబాసిడర్ మృధుల్కుమార్తో సమావేశమై రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ఫార్మాస్యుటికల్స్, మెడికల్ డివైజ్లు, టెక్నికల్ టెక్స్టైల్స్, రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. ఏపీ, స్విట్జర్లాండ్ యూనివర్సిటీలు.. ఏపీలో ఏర్పాటు చేస్తున్న స్కిల్లింగ్, ఏఐ యూనివర్సిటీకి కలిసి పనిచేసేలా చూడాలని మృధుల్కుమార్కు ప్రతిపాదించారు.
స్విట్జర్లాండ్ కంపెనీల సీఈవోలతో భేటీ
స్విస్మెన్, ఓర్లికాన్, ఆంగ్స్ట్ఫిస్టర్, స్విస్ టెక్స్టైల్స్ సీఈవోలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు.
స్విస్మెన్: రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు, ఇన్నోవేషన్ హబ్లు – ఇంక్యుబేటర్ల ఏర్పాటు, స్విస్ వెట్ తరహాలో రాష్ట్రంలో ప్లంబింగ్ ల్యాబ్ల ఏర్పాటుకు, శిక్షణ కార్యక్రమాలకు ‘స్విస్మెన్’ కంపెనీ ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరారు.
ఓర్లికాన్: రాష్ట్రంలో అడ్వాన్స్ కోటింగ్ సెంటర్ ఆవశ్యకత ఉందని, అలాగే ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఎనర్జీ, టూలింగ్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయని, పరిశోధన కోసం ఏఎం సెంటర్ నెలకొల్పవచ్చని… వీటిని ‘ఓర్లికాన్’ వినియోగించుకోవచ్చని చంద్రబాబు వివరించారు.
ఆంగ్స్ట్ ఫిస్టర్: అడ్వాన్డ్స్ సీలింగ్ సొల్యూషన్స్ ప్లాంట్, యాంటీవైబ్రేషన్ సిస్టమ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయమని ‘ఆంగ్స్ట్ ఫిస్టర్’ను కోరారు.
స్విస్ టెక్స్టైల్: ఏపీ టెక్స్టైల్ రంగంలో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కోసం ‘స్విస్ టెక్స్టైల్స్’కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం పలికారు.
జ్యూరిచ్లో అపూర్వ స్వాగతం
పర్యటనలో ముందుగా జ్యూరిచ్లో దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అధికారుల బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది. పెద్దఎత్తున తరలివచ్చిన యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. జ్యూరిచ్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రాలకు వస్తున్న పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది. అలాగే, జ్యూరిచ్లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్లో చంద్రబాబు పాల్గొన్నారు. నిత్య స్ఫూర్తినిచ్చే తెలుగు జాతిలో పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని…. మళ్లీ జన్మంటూవుంటే తెలుగుబిడ్డగానే పుడతానని అన్నారు. తెలుగువారు ప్రపంచమంతా ఉండాలి… కర్మభూమిని పట్టించుకోవాలి… జన్మభూమికి అవకాశాలు కల్పించాలని జ్యూరిచ్ వేదికగా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. యూరప్లోని 12 దేశాలనుంచి సమావేశానికి తెలుగు ప్రజలు హాజరయ్యారు.
పర్యటన రెండవ రోజు
పర్యటన రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు.. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రత్యేక సెషన్లో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్పై ప్రసంగించారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో విజయం సాధించి… గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్లుగా ఎదిగే సత్తా భారతీయల్లో ఉందన్నారు. మానవ వనరుల లభ్యత ఏపీకి ప్లస్ పాయింట్ అని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్నారని, తమ ప్రతిభతో రాణిస్తున్నారన్నారు. స్వర్ణాంధ్ర `2047 విజన్ రోడ్మ్యాప్లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న పది మార్గదర్శక సూత్రాలను ముఖ్యమంత్రి వివరించారు. భవిష్యత్ నాయకులను సిద్ధం చేయడానికి అమరావతిలో ఏర్పాటు చేయబోయే గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఉపయోగ పడుతుందని చెప్పారు. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్కు గ్లోబల్ హబ్గా మార్చడానికి కృషి చేస్తున్నట్టు తన ప్రసంగంలో వెల్లడిరచారు.
ఆసక్తి చూపిన ‘మార్స్క్’: ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీలలో ఒకటైన డెన్మార్క్కు చెందిన మార్స్క్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. మార్స్క్ కంపెనీ సీఈవో విన్సెంట్ క్లర్క్తో చంద్రబాబు కీలక చర్చలు జరిపారు. వెయ్యి కిలోమీటర్లపైనే తీరప్రాంతం కలిగి వుండటం, విస్తారంగా పోర్టులు ఉండటం… ఆంధ్రప్రదేశ్ బలమని, మానవ వనరులకు లోటు లేదని విన్సెంట్ క్లర్క్కు తెలిపారు.
సిస్కో: డేటా సెంటర్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో పేరున్న మల్టీ-నేషనల్ టెక్నాలజీ సంస్థ సిస్కో చైర్మన్, సీఈవో చుక్ రాబిన్స్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. విశాఖ లేదా తిరుపతిలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటుతో పాటు, నెట్వర్క్ భాగాల తయారీకి ఆహ్వానించారు.
ఎల్జీ కెమ్: దక్షిణ కొరియాలో అతిపెద్ద కెమికల్ కంపెనీ అయిన ఎల్జీ కెమ్ లిమిటెడ్ సీఈవో షిన్ హక్ చియోల్తో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి ఎల్జీ కెమ్ అనుబంధ సంస్థ ఎనర్జీని రాష్ట్రంలో నెలకొల్పాల్సిందిగా కోరారు. పెట్రో కెమికల్ రంగంలో యూనిట్లు మూలపేట -విశాఖలోనూ, సెమీకండక్టర్ యూనిట్ తిరుపతిలోనూ నెలకొల్పేందుకువున్న అవకాశాలను పరిశీలించమని కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్, దక్షిణ కొరియా మధ్య పెట్టుబడుల కోసం ఎల్జీ కెమ్ సీఈవోను అంబాసిడర్గా ఉండాలని అభ్యర్ధించారు.
కార్ల్స్బెర్గ్ గ్రూప్: పళ్ల రసాలు, శీతల పానీయాలు, బీర్లు, ప్యాకేజ్డ్ డ్రిరకింగ్ వాటర్, ఉత్పత్తి చేసే కార్ల్స్ బెర్గ్ గ్రూప్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్తోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. ఇంటిగ్రేటెడ్ బ్రూవరీ, బాట్లింగ్ యూనిట్ను రాష్ట్రంలో ఏర్పాటు చేయమని అభ్యర్థించారు. ఇందుకోసం విశాఖపట్నం, కృష్ణపట్నం, శ్రీ సిటీలోని ఇండస్ట్రియల్ పార్కులను పరిశీలించమని చెప్పారు. బార్లీ, మొక్కజొన్న, వరివంటి అధిక నాణ్యమైన ఆహార ఉత్పత్తులను సేకరించేందుకు ఏపీ రైతులతో భాగస్వామి కావాలని కోరారు.
ఆర్సెల్లార్ మిట్టల్ ప్రాజెక్టు: అనకాపల్లిలో రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడితో 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్టుపై ఆర్సెలార్ మిట్టల్/ నిప్పన్ స్టీల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ ఎన్ మిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. అలాగే, వెల్స్పన్ చైర్మన్ బీకే గోయింకాతో పెట్టుబడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు.
పర్యటన మూడవ రోజు :
గూగుల్ క్లౌడ్: సర్వర్ల కోసం సొంత చిప్లను రూపొందిస్తున్న గూగుల్ విశాఖలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ను కోరారు. గూగుల్ క్లౌడ్ తన సర్వర్ సప్లై చైన్ అనుసంధానించేలా తయారీ యూనిట్ను ఏపీలో నెలకొల్పాలని థామస్ కురియన్కు ముఖ్యమంత్రి సూచించారు. సర్వర్ నిర్వహణ సేవల విషయంలో ఏపీని ప్రధాన కేంద్రం చేసుకోవాలని కోరారు.
పెట్రోనాస్: మలేషియాకు చెందిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముహమ్మద్ తౌఫిక్తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న పెట్రోనాస్ కాకినాడ ప్లాంటులో రూ. 13,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. పెట్రోకెమికల్ హబ్గా అవతరిస్తున్న మూలపేటలోనూ, అలాగే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లోనూ భాగస్వామి కావాలని ముహమ్మద్ తౌఫిక్ను కోరారు.
పెప్సీకో: ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫుడ్ బెవరేజెస్గా ఉన్న పెప్సీకో ఇంటర్నేషనల్ బెవరేజస్ సీఈవో యూజీన్ విల్లెంసెన్, పెప్సీకో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కెహోతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఇప్పటికే ఏపీలోని శ్రీసిటీలో బాటిలింగ్ ప్లాంట్ నిర్వహిస్తున్న పెప్సికో బెవరేజెస్… విశాఖపట్నాన్ని గ్లోబల్ డెలివరీ సెంటర్గా చేసుకుని పెప్సీకో డిజిటల్ హబ్ను ఏర్పాటు చేయవచ్చని ముఖ్యమంత్రి సూచించారు. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ను విశాఖకు విస్తరించాల్సిందిగా కోరారు. కుర్కురే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుతో పాటు పెప్సీకో తమ సప్లై చైన్ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఏపీసీఎన్ఎఫ్తో భాగస్వామ్యం కావాలని కోరారు.
బహ్రెయిన్ ప్రతినిధులు: బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం ప్రతినిధి హమద్ అల్ మహ్మీద్, ముంతాలకత్ సీఈవో అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫాతోనూ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పారిశ్రామికాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీలను వివరించారు.
బిల్గేట్స్తో భేటీ: ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ బిల్ గేట్స్ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్ధించారు. ఆంధ్రప్రదేశ్లో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్, డయాగ్నోస్టిక్స్ ప్రారంభించాలని, అలాగే ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో సూచనలు చేయాలని కోరారు. బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ విజయవంతంగా అమలు చేస్తున్న హెల్త్ డ్యాష్బోర్డ్లు, సామాజిక కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్వహించాలని చంద్రబాబు కోరారు.
హిందుస్థాన్ యూనిలీవర్: ఫుడ్, హోమ్ కేర్, బ్యూటీ, పర్సనల్ కేర్ సంబంధిత ఉత్పత్తులకు పేరున్న సంస్థ యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉజ్జెన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. ఏపీలో రూ.330 కోట్లతో పామాయిల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని భావిస్తున్న యూనిలీవర్ను బ్యూటీ పోర్ట్ఫోలియోకు సంబంధించి టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నం అనుకూలంగా వుంటుందని సీఎం అన్నారు. రాష్ట్రంలో పెద్దఎత్తున వచ్చే వ్యవసాయ దిగుబడులను హిందుస్థాన్ యూనిలీవర్ వినయోగించుకోవచ్చని… ఫుడ్ ప్రాసెసింగ్, బ్యూటీ, హోమ్ కేర్ ఉత్పత్తుల తయారీకి రాష్ట్రం అనుకూలంగా ఉంటుందని చెప్పారు.
సెన్మట్ : వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్ (సెన్మట్) హెడ్ రాబర్టో బోకాతో సమావేశమైన ముఖ్యమంత్రి.. గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, సోలార్ మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు తరలివచ్చేలా సెన్మట్ సహకారం అందించాలని కోరారు. క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ – స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు డబ్ల్యూఈఎఫ్ మద్దతివ్వాలని అభ్యర్ధించారు.
డీపీ వరల్డ్ : ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు ముందుకురావాలని ప్రపంచంలో కంటైనర్ టెర్మినల్లో ప్రతిష్టాత్మక సంస్థ డీపీ వరల్డ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. డీపీ వరల్డ్ సెంట్రల్ ఏసియా, ఆఫ్రికా మేనేజింగ్ డైరెక్టర్ రిజ్వాన్ సూమర్తో ఈ మేరకు చర్చలు జరిపారు. కాకినాడ, కృష్ణపట్నం, మూలపేటలో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు.
పలువురితో భేటీలు: స్విట్జర్లాండ్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ నిక్లాస్ శామ్యూల్ గుగ్గర్, యాక్సెస్ హెల్త్ కేర్ సీఈవో అనురాగ్ జైన్, వాడ్కు చెందిన కౌన్సిలర్ ఆఫ్ స్టేట్… క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్డ్, ఇసాబెల్లా మోరెట్, సింగపూర్ డిప్యూటీ పీఎం హెంగ్ స్వీ కీట్, యూఎన్ అండర్ సెక్రటరీ జనరల్ అనాక్లాడియా రాస్బాచ్తో సమావేశమయ్యారు.
‘టీమిండియా’ మీడియా మీట్
దావోస్ పర్యటనలో చివరిగా.. ఇండియన్ పెవిలియన్లో ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, తెలంగాణ, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల మంత్రులతో కలిసి మాట్లాడారు. దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో భారత్ తొలిసారి ‘టీమిండియా’ భావనతో ఒకే వేదికపైకి వచ్చిందని, అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా సదస్సులో పాల్గొన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. తమ దగ్గర పెట్టుబడుల కోసం రాష్ట్రాలన్నీ వేరువేరుగా పోటీపడినా, పరస్పరం సహకరించుకుని భారతదేశ సమైఖ్య స్ఫూర్తిని చాటాయని కొనియాడారు. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో భారతదేశానికి స్వర్ణయుగం ప్రారంభమైందని, మోదీ నాయకత్వంలో ఇండియా బ్రాండ్ బలంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వికసిత్ భారత్పై అందరూ నమ్మకంగా ఉన్నారని చెప్పారు.
సంస్కరణలు, స్థిరమైన వృద్ధి, సాంకేతికత మన బలం
బ్లూమ్బెర్గ్ అంచనాల ప్రకారం 2028 నాటికి పెరుగుతున్న జీడీపీ వృద్ధితో భారత్ అగ్రగామి దేశంగా ఎదుగుతుందని, ఇక తిరుగు ఉండదని చెప్పారు. ఆర్థిక సంస్కరణలు, స్థిరమైన వృద్ధి రేట్లు, అధునాతన సాంకేతికత వినియోగంలో భారత్ ఇప్పుడు ఉన్నతస్థానంలో ఉందన్నారు. ఆరోగ్యం, సామాజిక సంక్షేమం, ఇతర కీలకమైన రంగాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. భారతదేశం గ్రీన్ఎనర్జీ, టెక్నాలజీకి కేంద్రంగా ఆవిర్భవిస్తుందని చెప్పారు. పలు గ్లోబల్ టెక్ కంపెనీల సీఈఓలు భారతీయ మూలానికి చెందినవారని, ఆవిష్కరణలు- నాయకత్వంలో తమ ప్రతిభను భారతీయులు చూపిస్తారని… అందుకే ప్రపంచ దేశాలన్నీ భారతీయుల్ని ఆమోదిస్తున్నాయని చెప్పారు.
2047 నాటికి అగ్రదేశంగా భారత్
భారతదేశ వృద్ధిలో ఈ కీలక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు ప్రపంచ పెట్టుబడిదారులకు దావోస్ వేదికగా పిలుపునిచ్చారు. భారతదేశ భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేసిన చంద్రబాబు.. భారత్ నేడు ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, బలమైన నాయకత్వం, టీమ్వర్క్తో… 2047 నాటికి ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
1997 నుంచి నేటికి పోటీ పెరిగింది
తాను 1997 నుంచి దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులకు హాజరవుతున్నానని… అప్పటికన్నా ఇప్పుడు పోటీ పెరిగిందని, అలాగే ఈసారి అపూర్వ ఆహ్వానం లభించిందని చెప్పారు. మహారాష్ట్ర, తెలంగాణవంటి రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకువెళ్లాల్సి ఉందన్నారు. అందుకుతగ్గట్టుగా స్పష్టమైన విజన్తో కష్టపడుతున్నామని తెలిపారు. వచ్చేవన్నీ గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రోజులని.. అందుకే వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పర్యావరణ సుస్థిరత కోసం 165 గిగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి అన్నారు. మీడియా మీట్లో చంద్రబాబును మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్.. టెక్నాలజీ మ్యాన్గా కొనియాడారు. పెట్టుబడులను ఆకర్షించడంలోనూ, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు ఒక ఐకాన్గా అభివర్ణించారు.
తిరుగు ప్రయాణం వేళ భేటీలు: దావోస్ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చే ముందుక్షణం వరకు ముఖ్యమంత్రి వివిధ సంస్థల అధిపతులు, వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమై రాష్ట్రాభివృద్ధి కోసం వారితో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ప్రఖ్యాత స్విస్ వ్యవస్థాపకుడు, పర్యావరణవేత్త, చె హోల్డింగ్స్ వైస్-ఛైర్మన్ ఆండ్రే హాఫ్మన్తో భేటీ అయ్యారు. అలాగే యూఎన్డీపీ అధిపతి అచిమ్ స్టెయినర్, సీఎన్ఎన్ బెకీ ఆండర్సన్తోనూ చర్చించారు. అనంతరం సీఎం బృందం దావోస్నుంచి జ్యూరిచ్కు రోడ్డుమార్గంలో చేరుకుంది. అక్కడినుంచి ఈ రోజు అర్ధరాత్రి తరువాత సీఎం ఢల్లీి చేరుకోనున్నారు. మంత్రి లోకేష్ మరో రోజు అదనంగా దావోస్లో ఉండనున్నారు. ఈరోజు మరికొంత మంది పారిశ్రామికవేత్తలతో భేటీ అనంతరం రేపు లోకేష్ తిరుగుప్రయాణం కానున్నారు. నాలుగవసారి సీఎం అయిన తరువాత చేపట్టిన తొలి విదేశీ పర్యటన సంతృప్తినిచ్చిందని… రానున్న రోజుల్లో ఈ చర్చలు మంచి ఫలితాలను ఇస్తాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.