- నిర్మాణానికి సహకారం అందించండి
- కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరికి మంత్రి లోకేష్ వినతి
న్యూఢిల్లీ (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్లో బీపీసీఎల్ సంస్థ నిర్మించే రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ త్వరితగతిన కార్యకలాపాలను ప్రారంభించేందుకు సహకారం అందించాల్సిందిగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో మంత్రి లోకేష్ సోమవారం ఢల్లీిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రామాయపట్నం పోర్టు సమీపాన బీపీసీఎల్ సంస్థ 6వేల ఎకరాల్లో రూ.95వేల కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్కు సంబంధించి పనుల పురోగతిపై చర్చించారు. రిఫైనరీకి అవసరమైన అదనపు భూసేకరణను రాష్ట్రప్రభుత్వ అధికారులు సమన్వయం చేస్తున్నారు. 9 ఎంఎంటీపీఏ సామర్థ్యంతో నిర్మితమయ్యే బీపీసీఎల్ రిఫైనరీ ద్వారా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా వేగవంతమైన అభివృద్ధి సాధించడమేగాక, 5వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయి. ఏడాది చివరకు బీపీసీఎల్ రిఫైనరీ ప్రారంభించేందుకు రాష్ట్రప్రభుత్వం తరపున అన్నివిధాల సహాయ, సహకారాలను అందిస్తున్నాం, ప్రాజెక్టు త్వరితగతిన పూర్తిచేసేందుకు కేంద్రం తమవంతు సహకారాన్ని అందించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. ఆంధ్రప్రదేశ్లో తీరం వెంట మారిటైమ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ లో దీపం-2 పథకం కింద బీపీఎల్ కుటుంబాలను బలోపేతం చేసేందుకు ప్రతిఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలండర్లను అందజేస్తున్నాం. దీనిని ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయువై)తో అనుసంధానం చేసి మరింత సమర్థవంతంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సహకరించాలని మంత్రి లోకేష్ విజ్జప్తి చేశారు. ఎనర్జీ, మారిటైమ్ రంగాల్లో వ్యూహాత్మక పెట్టుబడులు, అనుమతులు, అంతర్జాతీయ భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం మద్దతు ఇవ్వాల్సిందిగా లోకేష్ కోరారు. విధానపరమైన సంస్కరణలు, నైపుణ్యాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో డిజిటల్ ప్లాట్ఫాం వినియోగం, టెక్నాలజీ అడాప్షన్కు రాష్ట్రప్రభుత్వం పూర్తిస్థాయి సహకారం అందిస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రతిపాదిత ప్రాజెక్టులకు వేగవంతమైన అనుమతులు, సాంకేతిక మద్దతు అందిస్తున్నందుకు కేంద్రమంత్రికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.