- క్రిమినల్స్, చరిత్రహీనులు, గంజాయి ముఠాలకు మద్దతు దుర్మార్గం
- సత్తెనపల్లి పర్యటన నీచ రాజకీయానికి నిదర్శనం
- ఏడాది కింద చనిపోయిన వ్యక్తి కుటుంబానికి పరామర్శ పేరుతో అల్లర్లకు కుట్ర
- రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజం
విశాఖపట్నం (చైతన్యరథం): జగన్ రెడ్డికి శవరాజకీయాలు చేయటం అలవాటుగా మారిందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. నేరస్థులు, చరిత్రహీనులు, గంజాయిముఠాలకు జగన్ మద్దతుగా నిలవడం అత్యంత దుర్మార్గమని తప్పుబట్టారు. విశాఖలోని వీఎంఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యోగాంధ్ర-2025 ఏర్పాట్లపై, జగన్ సత్తెనపల్లి పర్యటనపై మంత్రి అనగాని మాట్లాడారు. ప్రజల సమస్యల పట్ల జగన్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయన ఎప్పుడూ శవ రాజకీయాలే చేస్తాడని మంత్రి అనగాని ధ్వజమెత్తారు. జగన్ ఎప్పుడూ ప్రజల బాధలపట్ల స్పందించలేదని మంత్రి మండిపడ్డారు. గతంలో ప్రకృతి విపత్తులు, హింసాకాండలు జరిగినా ఆయన బాధితులను పరామర్శించలేదని, కానీ క్రిమినల్స్, చరిత్రహీనులు, గంజాయి ముఠాలకు మాత్రం మద్దతుగా నిలుస్తున్నారని మండిపడ్డారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో నాగమల్లేశ్వరరావు మరణంపై జగన్ చేస్తున్న పరామర్శ కూడా శవ రాజకీయాల్లో భాగమేనని అనగాని ఆరోపించారు. ఇతడు గతేడాది బెట్టింగ్లో డబ్బులు కోల్పోయి గడ్డి మందు తాగి చనిపోయాడు. మా ప్రభుత్వం ఏర్పడకముందే ఇది జరిగింది. ఏడాది తర్వాత ఆయన ఇంటికి వెళ్లి పరామర్శ పేరుతో రాజకీయాలు చేయడం ప్రజల హితం కోసం కాదన్న విషయం స్పష్టమవుతోందన్నారు.
విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఘటనను గుర్తు చేస్తూ.. వైసీపీ పాలనలో తాము ప్రజా చైతన్య యాత్రకు వెళ్లినప్పుడు రాళ్లు, చెప్పులతో దాడికి గురయ్యామని తెలిపారు. అయితే ఇప్పుడు జగన్ పర్యటనకు ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు పెట్టలేదన్నారు. ఇంతకుముందు అనంతపురం జిల్లా పర్యటనలో జగన్ హెలికాప్టర్పై తానే రాయి వేసుకుని డ్రామాలు చేశాడని అని మంత్రి దుయ్యబట్టారు. ప్రకాశం జిల్లా పొదిలిలో రైతుల పొగాకు పంటను కావాలనే తొక్కించారని విమర్శించారు. రైతు సుభిక్షంగా ఉండాలన్నదే మా ధ్యేయం అని అన్నారు. జగన్ పార్టీని లష్కరే తోయిబా తరహా తీవ్రవాద సంస్థలా మలుస్తున్నాడని అంటూ తీవ్రంగా విమర్శించారు సైకో అనే పదం జగన్కు సరిగ్గా సరిపోతుందని వ్యాఖ్యానించారు. జగన్ ర్యాలీలో చనిపోయిన ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి సింగయ్య (53) కుటుంబాన్ని పరామర్శించకపోవడం, కనీసం ఆసుపత్రికి తరలించకపోవడం దళితుల పట్ల జగన్ నిర్లక్ష్యాన్ని చూపుతోందని తప్పుబట్టారు. మేము జగన్ పర్యటనలను అడ్డుకోము.. కానీ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోబోమని మంత్రి అనగాని స్పష్టం చేశారు.
ప్రతిష్టాత్మకంగా యోగా దినోత్సవం
రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీ స్టేట్గా మార్చాలని సీఎం చంద్రబాబు కోరుకుంటున్నారని మంత్రి తెలిపారు. యోగాంధ్ర-2025కు ప్రధాని మోదీ విశాఖను ఎంచుకోవడం చరిత్రాత్మకం అన్నారు. యోగాంధ్ర-2025 గ్లోబల్ కార్యక్రమన్నారు. విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచమంతా వీక్షించనున్నట్లు తెలిపారు. ఈనెల 21న యోగా చేసేందుకు రాష్ట్రా వ్యాప్తంగా సుమారు రెండు కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. విశాఖలో సుమారు ఆరు లక్షల మంది యోగా చేసేందుకు యాప్లో నమోదు చేసుకున్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రధాని మోదీ ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి యోగా ప్రయోజనాలను చాటిచెప్పనున్నారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని మీడియా సైతం హైలెట్ చేయాలి. ఈ కార్యక్రమంలో 25 వేల మంది గిరిజన విద్యార్థులు 108 సార్లు సూర్య నమస్కారాలు చేయనున్నారు. ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కనుండడం చరిత్ర. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాటు చేశాం. ఇంతకు ముందే మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించాం. గత ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాల్ని అటకెక్కించింది. యోగాంధ్రలో ప్రతి కంపార్ట్ మెంట్ పర్యవేక్షణకు ఒక ఐఏఎస్, మంత్రిని నియమించారు. ప్రతి ఒక్కరూ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.