- రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడి
- ఈ నెల 12 వరకూ దరఖాస్తుల స్వీకరణ
- 2 నెలల్లో యూనిట్లు గ్రౌండయ్యేలా చర్యలు
- అర్హులకే ఆర్థిక చేయూత ఇవ్వాలి
విజయవాడ (చైతన్యరథం): రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బీసీ కార్పొరేషన్ల రుణాలను అర్హులందరికీ అందజేయాలని, గడువులోగా యూనిట్లు గ్రౌండిరగయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. లబ్ధిదారుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సహా వివిధ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మంజూరు చేస్తున్న యూనిట్లకు రుణాల దరఖాస్తుల గడవును ఈ నెల 12 వ తేదీన వరకూ పొడిగిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడిరచారు. గురువారం విజయవాడ నగరం గొల్లపూడిలోని బీసీ భవన్లో వివిధ బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లతో రుణాలు-సద్వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, వెనుకబడిన తరగతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరం మరో 2 నెలల్లో ముగినుందని, తక్షణమే అర్హులను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో అర్హులకు మాత్రమే ప్రాధాన్యమివ్వాలన్నారు. ప్రభుత్వం అందజేసే ఆర్థిక చేయూతను వినియోగించుకునేలా లబ్ధిదారుల్లో చైతన్యం కలిగించి, తక్షణమే యూనిట్లు గ్రౌండిరగయ్యేలా చూడాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో కార్పొరేషన్లకు విధులతో పాటు నిధులు కూడా కేటాయించామన్నారు.
గడువు పెంపు లబ్ధిదారులకు తెలిసేలా చూడాలి
స్వయం ఉపాధి కల్పనకు స్వీకరిస్తున్న దరఖాస్తుల గడువును ఈ నెల 12 తేదీ వరకూ పొడిగించిన విషయంపై జిల్లాల్లో లబ్ధిదారులకు సమాచారమందించాలని మంత్రి సవిత సూచించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో ఆలస్యం చోటుచేసుకోకుండా తహసీల్దార్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. రాబోయే బడ్జెట్లో బీసీ కార్పొరేషన్లకు మరింత ఎక్కువగా నిధులు కేటాయించేలా కృషి చేస్తామన్నారు. కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు వ్యక్తం చేసిన సమస్యలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి సవిత హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి సవితను కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వీరంకి గురుమూర్తి, డూండీ రాకేష్, నందం అబద్ధయ్య, సదాశివం, దేవేంద్రప్ప, కృష్ణంనాయుడు, చిలకలపూడి పాపారావు, సావిత్రి, పీవీజీ కుమార్, మళ్ల సురేంద్ర, కప్పట్రాల సుశీలమ్మ, పాలవలస యశస్విని, నరిసింహ యాదవ్ సహా పలువురు డైరెక్టర్లు పాల్గొన్నారు.