- వాతావరణం, నీటినిర్వహణ సూచికలకు ప్రత్యేక వ్యవస్థ
- వర్షాలు, తుపాన్లపై వారం ముందుగానే హెచ్చరికలు
- విపత్తు నిర్వహణకు కీలకం కానున్న ప్రత్యేక వ్యవస్థ
- ప్రాణ, ఆస్తి నష్టాల నివారణలో ముఖ్య భూమిక
- నదులు, జలాశయాల్లో నీటి నిల్వలపైనా నిరంతర పర్యవేక్షణ
- సేద్యం, మత్స్యరంగం సహా 42 విభాగాలక సేవల విస్తరణ
- సీఎం చంద్రబాబు ఆదేశాలతో డాష్ బోర్డు తెచ్చిన ఆర్టీజీఎస్
అమరావతి (చైతన్య రథం): వాతావరణ ముందస్తు అంచనాలు, విపత్తు నిర్వహణ, నదులు, జలాశయాల్లో నీటి నిల్వలపై పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తోంది. అవేర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని వివిధ అంశాల్లో ముందస్తు సమాచారాన్ని ప్రజలకు అందిస్తోన్న ప్రభుత్వం మరిన్ని రంగాలనూ ఈ వ్యవస్థకిందకు తీసుకువస్తూ నిర్ణయం తీసుకుంది. వాతావరణంతోపాటు రాష్ట్రంలోని నదులు, జలాశయాల్లో నీటి నిల్వలు, సాయిల్ మాయిశ్చర్, గాలి నాణ్యత, కాలుష్యం, భూగర్భ జలాలు.. ఇలా వేర్వేరు అంశాలను పర్యవేక్షించేలా, ప్రజలకు వేగంగా సమాచారాన్ని అందించేలా అవేర్ 2.0ను రూపొందించింది. భారీ వర్షాలు, పిడుగులు, తుపాన్లు, తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలులాంటి వాతావరణ అంశాలపై ముందస్తు సమాచారాన్ని సేకరించి అప్రమత్తం చేయటం ద్వారా ప్రజల ప్రాణాలను, ఆస్తిని కాపాడేలా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈమేరకు ఏపీ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ రీసెర్చ్ సెంటర్-అవేర్ 2.0 వ్యవస్థను ఆర్టీజీఎస్ ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ ద్వారా వర్షాలు, వరదలు, పిడుగులు, గాలివానలు, జలాశయాల నీటిస్థాయిలు, నదుల ప్రవాహాలపై ముందస్తు అంచనాలు ఇచ్చి విపత్తు నిర్వహణలో కీలక సమాచారాన్ని ముందుగానే అందుబాటులోకి తేనుంది. వాతావరణంలో వచ్చే మార్పులను ఏడురోజుల ముందుగానే అవేర్-2.0 వ్యవస్థ పసిగట్టి హెచ్చరికలు జారీ చేయనుంది. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై ప్రజల ప్రాణాల్ని, ఆస్తుల్ని, మూగజీవాలను కాపాడేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఆవేర్ 2.0తో ప్రకృతి విపత్తులవల్ల కలిగే ప్రాణ, ఆస్తి నష్టాలను చాలా వరకు తగ్గించే అవకాశం కలుగుతుందని ఆర్టీజీఎస్ చెబుతోంది. కొత్త వ్యవస్థతో పూర్తిగా మరణాలను నివారించేందుకు ఆస్కారం ఏర్పడిరదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
రైతులకు, మత్స్యకారులకు మేలు జరిగేలా..
అవేర్ 2.0 ద్వారా వారం ముందుగానే వర్షపాతం, గాలివేగం, మెరుపులు, పిడుగుపాటుపై ఖచ్చితమైన అంచనాలు లభిస్తున్నాయని ఆర్టీజీఎస్ వెల్లడిరచింది. ఈ సమాచారం ఆధారంగా రైతులు పంటల నిర్వహణ, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. తుపాన్లకు సంబంధించి ముందస్తు సమాచారం లేకపోవటంతో మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుంటున్న పరిస్థితులు నెలకొంటున్నాయని, ఈ కారణంగా వారి విలువైన ప్రాణాలు కోల్పోవటం లేదా పొరుగుదేశాల సరిహద్దుల్లోకి వెళ్తున్న ఘటనలు నమోదు అవుతున్నట్టు ఆర్టీజీఎస్ తెలిపింది. ప్రస్తుతం అవేర్ `2.0 వ్యవస్థతో సముద్రంలో జరిగే ప్రమాదాలను నివారించవచ్చని స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్రంలోని 109 జలాశయాలు, కృష్ణా, గోదావరి వంటి ప్రధాన నదులపై రియల్ టైమ్ మానిటరింగ్ను కూడా చేస్తున్నట్టు ఆర్టీజీఎస్ పేర్కొంది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు, ప్రవాహాలపైనా అవేర్తో తక్షణం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడిరచారు.
ముందస్తు చర్యలతో ప్రజలకు రక్షణ
ప్రకాశం బ్యారేజ్, పోలవరం, శ్రీశైలంవంటి కీలక ప్రాజెక్టులు, నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ప్రవాహాల అంచనాలను ముందస్తుగానే తెలుసుకుని ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆవేర్ ఆస్కారం కల్పించనుంది. ఈ వ్యవస్థ ద్వారా వ్యవసాయం, మత్స్యకారులు, రవాణా, విద్యుత్, జలవనరులువంటి 42 విభాగాలకు సేవలు అందనున్నాయి. అలాగే వ్యవసాయానికి సంబంధించి భూగర్భజలాల లభ్యతతోపాటు మండల, జిల్లాలవారీగా పంటలకు వచ్చే తెగుళ్లులాంటి అంశాల్లోనూ హెచ్చరికలు జారీ చేసేందుకు అవేర్ వ్యవస్థ ఉపయోగపడనుంది. మరోవైపు సముద్రంలో చేపల వేటకువెళ్లే మత్స్యకారులకు కూడా ఏ ప్రాంతాల్లో చేపలు ఎక్కువగా లభ్యమవుతాయన్న అంశాన్నీ ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా అవేర్ అందిస్తుందని ఆర్టీజీఎస్ స్పష్టం చేసింది. ఈ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం ఓ డ్యాష్ బోర్డును ఏర్పాటు చేసింది. aషaతీవ.aజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్లో వాతావరణ సూచనలు, జలాశయాల స్థితి, నదుల ప్రవాహాలపై లైవ్ డేటా చూసేందుకు ఆస్కారం ఏర్పడనుందని ఆర్టీజీఎస్ స్పష్టం చేసింది.