- కేంద్రం జోక్యం చేసుకోవాలి
- సుంకాల నుంచి ఆక్వాను మినహాయించేలా ప్రయత్నించాలి
- ఏపీ జీడీపీలో ఆక్వా రంగానిది ప్రధాన పాత్ర
- సంక్షోభ సమయంలో అండగా నిలవాలి
- కేంద్రానికి సీఎం చంద్రబాబు వినతి
- కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్కు లేఖ
అమరావతి (చైతన్యరథం): అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వా రంగానికి కేంద్రం అండగా నిలవాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. అమెరికా సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులు మినహాయింపు పొందేలా ప్రయత్నించి రైతులను ఆదుకోవాలని కేంద్రమంత్రిని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడీపీలో మత్స్య రంగం కీలకమైన భూమిక పోషిస్తోందని, ఆక్వా రైతులకు సంక్షోభ సమయంలో అండగా నిలవాలని సీఎం చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. భారతదేశం నుంచి వెళ్లే సముద్రపు ఆహార ఎగుమతులపై అమెరికా ప్రభుత్వం 27 శాతం దిగుమతి సుంకం విధిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు 2.55 బిలియన్ డాలర్ల విలువైన సముద్రపు ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. వీటిలో రొయ్యలే 92 శాతం వాటా కలిగి ఉన్నాయి. అమెరికా దేశానికి రొయ్యల ఎగుమతిలో కీలకమైన భారత్పై 27 శాతం దిగుమతి సుంకం విధించడంతో ఆక్వా రైతాంగం నష్టపోతోంది. ఈక్వెడార్ వంటి దేశాల రొయ్యల ఎగుమతులపై అమెరికా కేవలం 10 శాతం పన్ను మాత్రమే విధిస్తోంది. ఇది మన దేశానికి పరోక్షంగా నష్టం చేస్తూ.. వారికి అనుకూలంగా మారుతోంది. దీనికి తోడు మన దేశ ఎగుమతిదారులు ఇప్పటికే 5.77 శాతం కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ (సీవీడీ) భారాన్ని మోస్తున్నారు. అన్ని సుంకాలను కలుపుకుంటే ఈక్వెడార్కు భారతదేశానికి మధ్య సుంకాల వ్యత్యాసం దాదాపు 20 శాతం ఉంటోంది.
ట్రంప్ సర్కార్ విధించిన కొత్త సుంకం ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వచ్చింది. దీని కారణంగా అమెరికా దేశానికి వెళ్లే అన్ని ఎగుమతులపైనా ఈ భారం పడుతోంది. గతంలో వచ్చిన ఆర్డర్లకు సంబంధించిన ఉత్పత్తులు ప్యాకింగ్ పూర్తయి కోల్డ్ స్టోరేజ్లు, పోర్టుల్లో ఉన్నాయి. కొత్త నిబంధనల కారణంగా ఈ ఉత్పత్తులపైనా సుంకాల భారం పడుతోంది. యూరోపియన్ యూనియన్లో భారతీయ ఎగుమతిదారులు 50 శాతం తనిఖీ రేట్లు, 4 నుంచి 7 శాతం వరకూ దిగుమతి సుంకంతో సహా నాన్-టారిఫ్ అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. కానీ, వియత్నాం వంటి దేశాలు ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ `ఎప్టీఏ) కింద జీరో డ్యూటీ వెసులుబాటు పొందుతున్నాయి. ఈ కారణంగా వియత్నాం వంటి దేశాలు యూరోపియన్ మార్కెట్ను పూర్తిగా ఆక్రమిస్తున్నాయి.
మరోపక్క వియత్నాం, థాయిలాండ్, జపాన్ దేశాలు భారతదేశం నుంచి సీఫుడ్ కొనుగోలు చేసి వాటిని ప్రాసెస్ చేసి అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. అయితే నేడు తుది ఉత్పత్తులపై విధించిన అధిక సుంకాల కారణంగా ఆ దేశాలూ మనకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో శీతల గిడ్డంగులూ నిండిపోవడంతో చేతికి వచ్చిన ఆక్వా పంట ఎక్కడ ఉంచాలో తెలియని గందరగోళ పరిస్థితిలో రైతాంగం ఉంది. మరోవైపు ఇంకా పంట దిగుబడికి సిద్ధంగా ఉంది. 27 శాతం సుంకాల కారణంగా రైతుల నుంచి ఎగుమతిదారులు పంట సేకరించడం నిలిపివేశారు. ఈ పరిణామాలు రాష్ట్ర ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి. ఆక్వా రైతులు, హేచరీలు, ఫీడ్ మిల్లులు, ప్రాసెసర్లు, ఎగుమతిదారులు ఇలా అందరికీ సమస్యలు ఎదురయ్యాయి. సుంకాల నుంచి మినహాయింపు జాబితాలో రొయ్యలను చేర్చేలా అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరుతున్నా. సకాలంలో మీరు దీనిపై జోక్యం చేసుకుని సమస్య పరిష్కరిస్తే ఆక్వాపై ఆధారపడిన లక్షలాది మంది జీవనోపాధిని కాపాడవచ్చునని సీఎం చంద్రబాబు లేఖలో అభ్యర్థించారు.