` 2029 నాటికి ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను నిజం చేస్తాం
` ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ
` నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 633 మందికి పట్టాల పంపిణీలో వర్చ్యువల్గా పాల్గొన్న సీఎం
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో 2029 నాటికి ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను నిజం చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో 3సెంట్ల ఇంటి స్థలం ఇస్తామనే హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో పేదలు రెండు మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎమ్మెల్యేలకు చెప్పామని…పలుచోట్ల వారు చొరవ తీసుకుని అర్హులకు పట్టాలు ఇప్పించడం అభినందనీయమని అన్నారు. నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 633 మందికి పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు శనివారం వర్చ్యువల్గా పాల్గొన్నారు. పురపాలక మంత్రి, స్థానిక ఎమ్మెల్యే నారాయణ విన్నపం మేరకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో వర్చ్యువల్గా పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ:…రాఖీ పండుగ రోజు ఆడబిడ్డలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. నెల్లూరు భగత్సింగ్ కాలనీలో పట్టాలు అందుకున్న 633 మందికి శుభాకాంక్షలు. ఎక్కడ ఏ అవకాశం ఉన్నా పేదలకు సాయం చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుంది. నెల్లూరులో చొరవ తీసుకుని అన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించి మహిళలకు పట్టాలిచ్చిన నారాయణకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. పేదలను ఆదుకునేందుకు సూపర్ సిక్స్ సహా అన్ని పథకాలు అమలు చేస్తున్నామని….సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని సీఎం అన్నారు.
ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నామని….ప్రభుత్వం ఇచ్చే పింఛన్లు, ఉచిత గ్యాస్, తల్లికి వందనం, అన్నదాత సుఖీవభ, అన్న క్యాంటీన్లు వంటి సంక్షేమ కార్యక్రమాలతో పేదల జీవన ప్రమాణాలు పెంచుతున్నామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యంతో ఆడబిడ్డలకు మరింత మేలు జరుగుతుందని సీిఎం అన్నారు.
ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా మస్తానమ్మ, సయ్యద్ సబీహా అనే మహిళలు సీఎంతో మాట్లాడారు. దశాబ్దాలుగా తాము ఇక్కడ నివాసం ఉంటున్నా…ఈ రోజు ప్రభుత్వ చొరవ వల్ల తమకు పట్టాలు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం తమను పట్టాల పంపిణీ పేరుతో మోసం చేసిందని….కానీ కూటమి ప్రభుత్వలో మంత్రి నారాయణ సహకారంతో తమకు కలగా మిగిలిన పట్టాలు నేడు తమ చేతికి వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ నేపథ్యం…
నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 1400 మంది పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. భగత్ సింగ్ కాలనీ 54వ డివిజన్లో వెంకటేశ్వరపురం హైవేను ఆనుకుని ఉంటుంది. ఇక్కడ సుమారు 20 ఏళ్ల నుంచి కొంతమంది పేదవారు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. ఆ తర్వాత కొంతమంది పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. ఇక్కడివారికి కనీస మౌలిక వసతులు లేవు. తాగడానికి నీరు, కరెంట్, రోడ్లు, వీధి లైట్లు, కాలువలు వంటి సదుపాయాలు లేవు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే భగత్ సింగ్ కాలనీకి సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టారు. ఈ కాలనీలో మొత్తం 1400 కుటుంబాలున్నాయి. ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం, రోడ్లు, కాలువలు వీధిలైట్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అయితే 2019కు ముందే ఇక్కడి వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రయత్నాలు చేసినా… కొన్ని కారణాల వల్ల జరగలేదు. 2019లో ప్రభుత్వం మారిపోవడంతో కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు రాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాల ప్రక్రియ వేగవంతమైంది. సర్వేచేసి, అన్ని రికార్డులు పరిశీలించి 1429 మందికి పట్టాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.1400 మంది పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి ఉండగా…తొలివిడతలో 633 మందికి ఆన్లైన్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు.