- టెక్ ఆధారిత ఆధ్యాత్మిక సేవపై మంత్రి లోకేష్ ఉద్ఘాటన
- ఆధ్యాత్మిక పర్యాటకంలో అగ్రగామిగా ఏపీ
- ఎంత టెక్నాలజీ వచ్చినా.. సమాజాన్ని నడిపేది దేవదేవుడే
- హారీ పోట్టర్, ఎవెంజర్స్కంటే మన పురాణగాధలే మిన్న
- ఇంటర్నేషనల్ టెంపుల్ ఎక్స్పోలో మంత్రి లోకేష్ పిలుపు
తిరుపతి (చైతన్య రథం) వాట్సాప్ ద్వారా ఆలయాల సేవలు, డ్రోన్ నిఘావంటి సాంకేతిక ఆధారిత కార్యక్రమాలతో మన ఆధ్యాత్మిక సంప్రదాయాలను కాపాడుతూ… ఆలయాల పాలనా వ్యవస్థను ఆధునీకరించడంలో ఏపీ ప్రభుత్వం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ అన్నారు. తిరుపతి ఆశా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ ఎక్స్పో `2025 ముగింపు కార్యక్రమంలో లోకేష్ మాట్లాడారు. సానుకూల నాయకత్వం పరివర్తనాత్మక మార్పును తేగలదనడానికి ఎన్టీఆర్, చంద్రబాబు నిదర్శనమన్నారు. ‘వేంకటేశ్వర నిత్యాన్నదాన పథకాన్ని తిరుమలలో ఏప్రిల్ 6, 1985న ప్రారంభించారు. ఈ పథకాన్ని నందమూరి తారక రామారావు కోటి కార్పస్ ఫండ్తో ప్రతిరోజూ 2వేల మంది యాత్రీకులకు అన్నదానంతో ప్రారంభించారు. ప్రస్తుతం ప్రతివారం సాధారణ రోజుల్లో 1,59,500, వారాంతాల్లో 2,05,000 భోజనాలను టీటీడీ అందిస్తోంది. ప్రస్తుతం పథకంలో కార్పస్ ఫండ్ రూ.2 వేలకోట్లకు పెరిగింది. 2001 నవంబర్లో చంద్రబాబు ప్రాణదానం ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఔట్ పేషెంట్/ ఇన్ పేషెంట్ చికిత్సలు, శస్త్రచికిత్సలు, మందులు, భోజనం సదుపాయాలను ఈ ట్రస్ట్ అందిస్తోంది. ప్రస్తుతం రూ.440 కోట్లతో ట్రస్ట్ విస్తృతమైన సేవలు అందిస్తోంది. 588 గ్రామీణ వైద్య శిబిరాల ద్వారా 1,80,466మందికి, 212 ఎపిలెప్సీ క్లినిక్ల ద్వారా 1,38,066 మందికి, ప్రత్యేక క్లినిక్ల ద్వారా 57,610 మంది రోగులకు, 8,500 మంది క్యాన్సర్ రోగులకు సర్జరీలు చేయడం ద్వారా ప్రాణదాన ట్రస్ట్ విస్తృత ఆరోగ్యసేవలు అందించిందని లోకేష్ వివరించారు.
ఆధ్యాత్మిక పర్యాటకంలో అగ్రగామిగా ఏపీ
గ్లోబల్ టెంపుల్ మేనేజ్మెంట్ లీడర్లు, విధాన రూపకర్తలు, నిపుణులను ఒకచోట చేర్చడంలో ఈ కార్యక్రమం మైలురాయిగా నిలుస్తుందని లోకేష్ వ్యాఖ్యానించారు.‘ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంవద్ద పవిత్ర మహా కుంభమేళాకు హాజరైనందుకు ఎంతో ఆనందించాను. ఈరోజు తిరుపతిలోని ఆలయాల మహా కుంభ్లో పాలుపంచుకోవడం ఆనందంగా భావిస్తున్నాను. దేవాలయాలు ఆధ్యాత్మికంగానేగాక ఆధునిక సాంకేతికతను సమర్థంగా అందిపుచ్చుకోవడంలో ముందున్నాయనడానికి ఐటీసీఎక్స్ నిదర్శనం. ఆధ్యాత్మిక పర్యాటకం, టెంపుల్ టూరిజంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏటా 36-40 మిలియన్లమంది యాత్రికులు సందర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 27,105 దేవాలయాలకు నిలయంగా ఉంది. ఆలయ సంరక్షణ, ఆధునీకరణ, భక్తుల విశ్వాసాన్ని పెంపొందించడానికి మేంకట్టుబడి ఉన్నాం. ఐటీసీఎక్స్ అనేది దేవాలయాలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఒక ప్రపంచ సమాజం. భారతదేశ ఆలయ ఆర్థిక వ్యవస్థ 5-6 లక్షల కోట్ల అంచనా విలువతో అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ `2047 దార్శనికతకు ఐటీసీఎక్స్ `2025 మద్దతునిస్తుంది. ఆలయాల స్థిరమైన వృద్ధి, ఆలయ పర్యావరణ వ్యవస్థ సాధికారతపై దృష్టి సారిస్తుంది. ‘వసుదైక కుటుంబం’ తత్వాన్ని స్వీకరించి, ఆలయ నిర్వహణలో ప్రపంచ సహకారాన్ని ఐటీసీఎక్స్ ప్రోత్సహిస్తుందని లోకేష్ అన్నారు.
ఆలయాల్లో సేవలకు వాట్సాప్, డ్రోన్ల వినియోగం
వాట్సాప్ ఇంటిగ్రేషన్ ద్వారా ఆలయాల సేవలను మెరుగుపరచడం, భక్తులందరికీ ఆలయ ప్రవేశాన్ని సులభతరం చేయడం, మరింత సౌకర్యవంతంగా చేయడం ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటిగా ప్రభుత్వం ఎంచుకుంది. దర్శనం, టిక్కెట్ బుకింగ్లు, ఆలయ సేవల కోసం పొడవైన క్యూలలో వేచివుండే ఇక్కట్లు ఇకపై ఉండరాదన్నది మా ఉద్దేశం. అందుకే మేము ఆలయ సేవల కోసం వాట్సాప్ను వన్-స్టాప్ ప్లాట్ఫారమ్గా ఉపయోగిస్తున్నాం. భక్తులు ఇప్పుడు వారి ఆలయ టిక్కెట్లను నేరుగా వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఆచారాల గురించి సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు. వారి మొబైల్ ఫోన్ల నుండి రియల్ టైమ్ సేవలను అందుకోవచ్చు. ఎటువంటి అవాంతరాలు లేకుండా భక్తులకు ఆలయాలను చేరువ చేయడమే మా లక్ష్యం. యాత్రికుల భద్రత, క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం డ్రోన్ నిఘా ఏర్పాటు చేస్తున్నాం. ప్రధాన దేవాలయాలను సందర్శించే యాత్రికుల సంఖ్య పెరుగుతున్నందున వారి భద్రత చాలా ముఖ్యం. బ్రహ్మోత్సవాలు, పెద్ద ఆలయ ఉత్సవాల సమయంలో నిర్వహణ సవాలుగా మారుతోంది. ఈ సమస్య పరిష్కారానికి కీలకమైన పుణ్యక్షేత్రాలలో డ్రోన్ ఆధారిత నిఘాను ప్రవేశపెట్టాం. డ్రోన్లు క్రౌడ్ కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రమాదాలను నివారిస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడంలో అధికారులకు సహాయపడతున్నాయని లోకేష్ వివరించారు.
సమైక్య కృషితో సంస్కృతి రక్షణ
హిందూ ధర్మం సనాతన ధర్మం. మానవ సేవే మాధవ సేవ. సాటి మనుషులకు, సమాజానికి సేవ చేస్తే.. ఆ దేవుడికి సేవ చేసినట్టేనని హిందూధర్మం చెబుతోంది. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది. మన సంస్కృతిలో ఆలయాలు, పండుగలు, పూజలు అనేది కీలకమైన భాగం. ఇది మన జీవన విధానం. దీన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఎంత టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చినా మానవ సమాజాన్ని నడిపించేది ఆ దేవదేవుడే. ఇస్రో శాస్త్రవేత్తలు సైతం… వారి ప్రయోగం సక్సెస్ కావాలని చెంగాలమ్మ ఆలయంలోనో… తిరుమల శ్రీవారి ఆలయంలోనో ముందు రోజు పూజలు చేస్తారు. నమ్మకం మాత్రమేగాక ఇదొక నిజం. అందుకే ప్రజల్లో భక్తి భావాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు, దేవాలయ వ్యవస్థలు, సంస్ధలు కృషి చేయాలి. దీని ద్వారా సమాజంలో మంచిని పెంచవచ్చు. పిల్లలకు గంటలకు గంటలు ఫోన్లు, ట్యాబ్లు ఇచ్చే పద్దతికి స్వస్తి చెప్పాలి. ఆ సమయంలో మన పురాణాలు, మన దేవుళ్లు, మన పండుగలు, ఆచారాల గురించి చెప్పే పుస్తకాలు ఇవ్వాలి. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ల కంటే మన హనుమాన్ శక్తివంతుడు అని చెప్పాలి. హారీ పోట్టర్ కథల కంటే మన పురాణాల్లో ఉన్న కథలు ఇంకా బాగుంటాయని వివరించాలి. ఎవెంజర్స్ ఎండ్ గేం, క్యాప్టెన్ అమెరికా, అవతార్ సినిమాల కంటే…. మన శ్రీకృష్ణుడి లీలలు, మన శ్రీరాముడి గొప్పతనం గురించి చెప్పాలి. అందరం కలిసి సంస్కృతిని కాపాడుకోవాలని మంత్రి నారా లోకే ష్ పిలుపునిచ్చారు.
అర్చకుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చర్యలు
ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో ఆలయాల పరిపాలనను మెరుగుపరచడానికి సిబ్బంది, భక్తుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. యువగళం పాదయాత్రలో నేను ఇచ్చిన హామీమేరకు అర్చకుల పారితోషికం నెలకు రూ.10వేల నుండి రూ.15వేలకు పెంచారు. పరిమిత ఆదాయం ఉన్న దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం కింద నెలకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు సాయం అందిస్తున్నారు. ప్రధాన ఆలయాల్లో వైదిక సంప్రదాయాలను నిలబెట్టేందుకు వైదిక కమిటీలు ఏర్పాటు చేశారు. చారిత్రక నేపథ్యమున్న ఆలయాల పునర్నిర్మాణం కోసం పునరుద్ధరణ, పరిరక్షణ కమిటీలు ఏర్పాటుచేశారు. ప్రధాన దేవాలయాల ద్వారా నిరుద్యోగ వేద పండితులకు నెలకు రూ.3వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డుల్లో బ్రాహ్మణ, నాయీబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులను చేర్చేందుకు ఎండోమెంట్స్ చట్టం సవరణ చేశారు. ఆలయాల ఆస్తుల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ధార్మిక పరిషత్లను బలోపేతం చేస్తున్నారని లోకేష్ వివరించారు.
రూ.134 కోట్లతో ఆలయాల అభివృద్ధి
గత 7 నెలల్లో 73 దేవాలయాల అభివృద్ధి, పునరుద్ధరణ కోసం కూటమి ప్రభుత్వం రూ.134 కోట్లు మంజూరు చేసింది. దేవాలయాల్లో పరిశుభ్రత కోసం యాంత్రిక పారిశుద్ధ్య పద్ధతులను అమలు చేస్తున్నారు. ఆలయాల్లో సేవలను మెరుగుపరచడానికి ఐవీఆర్ఎస్ ఉపయోగించి వినూత్న ఫీడ్బ్యాక్ మెకానిజమ్ ఏర్పాటుచేశారు. భారతదేశంలోని దేవాలయాలు కేవలం మతపరమైన కేంద్రాలు మాత్రమే కాదు, అవి మన సాంస్కృతిక జీవనాధారాలు. విభిన్న ఆధ్యాత్మిక సమూహాలు. తమ ఆలోచనలను పంచుకోవడానికి, ఉత్తమ పద్ధతులను అవలంబించడానికి, బలమైన ఆలయ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి ఐటీసీఎక్స్ 2025 ఒక వేదికగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాను. ఆలయాల సంక్షేమం, ఆధ్యాత్మిక పర్యాటకం, పవిత్ర స్థలాల సమగ్ర అభివృద్ధికి ఐటీసీఎక్స్ నిబద్ధతతో పనిచేస్తోంది. కార్యక్రమానికి ఆతిథ్య రాష్ట్రంగా, భాగస్వామిగా ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్ గర్విస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆలయాల నిర్వహణ, భవిష్యత్తును రూపొందించే ఇటువంటి నిర్మాణాత్మకమైన చర్చల కోసం నేను ఎదురు చూస్తుంటానని మంత్రి లోకేష్ అన్నారు.