- సీఎం చంద్రబాబు నేతృత్వంలో లాజిస్టిక్ హబ్గా ఏపీ
- స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు
- పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులు
- కోయంబత్తూరు పారిశ్రామికవేత్తలతో భేటీలో మంత్రి లోకేష్
- విమానాశ్రయంలో తెలుగుప్రజల ఘనస్వాగతం
కోయంబత్తూరు (చైతన్యరథం): పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూల వాతావరణం ఉన్న ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని కోయంబత్తూరులోని పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపు ఇచ్చారు. పారిశ్రామిక వేత్తలతో సమావేశానికి తమిళనాడులోని కోయంబత్తూరుకు చేరుకున్న మంత్రి లోకేష్కు ఆదివారం ఎయిర్ పోర్టులో తమిళనాడు బీజేపీ నేత అమర్ ప్రసాద్ రెడ్డి, అక్కడి తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కోయంబత్తూరులోని పారిశ్రామికవేత్తలతో జరిపిన సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొని ఉందిదన్నారు. పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను అమలు చేస్తున్నాం. పరిశ్రమదారులు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టుతో రాష్ట్రానికి వచ్చాక నిర్మాణం పూర్తయ్యే వరకు పూర్తి బాధ్యత మాదే. రాష్ట్రంలో పెద్దఎత్తున వాయు, జల, రోడ్డు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రపదేశ్ లాజిస్టిక్ హబ్ అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న పరిశ్రమ అనుకూల విధానాల వల్ల పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. పరిశ్రమలకు గమ్యస్థానంగా మారిన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.