- ఒక్కసారి మాతో చేతులు కలిపిన తర్వాత అది మీ ప్రాజెక్ట్ కాదు.. మా ప్రాజెక్ట్
- పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీని ఎంచుకోవాలి
- దార్శనిక నాయకత్వం, స్పీడ్, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఏపీ సొంతం
- వికసిత భారత్లో భాగంగా ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం
- విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి లోకేష్
విశాఖపట్నం (చైతన్యరథం): సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్కు ఏపీ ఆతిథ్యం ఇస్తుండటం ఎంతో గర్వకారణంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి మంత్రి లోకేష్ పేర్కొన్నారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సును ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… మీ అందరికీ సుందర విశాఖపట్నంలో స్వాగతం పలకడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. భారతదేశం ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇంజన్గా నిలుస్తున్న సమయంలో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్కు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇస్తుండటం ఎంతో గర్వకారణంగా ఉంది. పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీని ఎందుకు ఎంచుకోవాలని చాలామంది నన్ను అడుగుతారు. అందుకు మూడు కారణాలు ఉన్నాయి. మొదటిది అనుభవం కలిగిన దార్శనికత కలిగిన నాయకత్వం. ఆయన మరెవరో కాదు.. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. వారసత్వాన్ని నిర్మించే అవకాశం రాజకీయ నాయకులకు జీవితంలో ఒక్కసారి మాత్రమే అవకాశం వస్తుంది. కానీ రాష్ట్ర ప్రజలు చంద్రబాబునాయుడు గారికి రెండో వారసత్వాన్ని నిర్మించే అవకాశం ఇచ్చారు. అదే అమరావతి, విశాఖపట్నం అని మంత్రి లోకేష్ వివరించారు.
ఒక్కసారి మాతో చేతులు కలిపిన తర్వాత అది మీ ప్రాజెక్ట్ కాదు.. మా ప్రాజెక్ట్
పెట్టుబడులకు ఏపీనే ఎందుకు ఎంచుకోవాలనేందుకు రెండో కారణం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ప్రస్తుతం వేగవంతమైన ప్రపంచంలో మనం ఉన్నాం. మార్కెట్లు, నియంత్రణలు, సాంకేతికత నిరంతరం మారుతున్న ఈ వేగవంతమైన ప్రపంచంలో స్పీడ్ అనేది చాలా ముఖ్యం. నేను వేలాది మంది పెట్టుబడుదారులను, కార్పొరేట్లను కలిశాను. ఒక్క అంశంపై వారందరిలోనూ ఏకాభిప్రాయం ఉంది. అదే స్పీడ్. కంపెనీ ఎంత వేగంగా అడుగులు వేస్తుందో, ప్రభుత్వాలు కూడా అంతే వేగంతో స్పందించాలని వారు కోరుకుంటున్నారు. భూమి కేటాయింపులు దగ్గర నుంచి అనుమతులు, ఆమోదాలు, ప్రోత్సహకాలు.. ఇవన్నీ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యేలోగా మంజూరు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో మీ కంపెనీ వేగాన్ని మించిన వేగంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్
మూడో కారణం.. ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఒకసారి మీతో చేతులు కలిపిన తర్వాత, అది మీ ప్రాజెక్ట్ కాదు.. అది మా ప్రాజెక్ట్ అవుతుంది. వ్యాపారాన్ని విజయవంతం చేయడంతో పాటు అవసరమైన సంస్కరణలు, విధాన మార్పులను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఈ అద్భుతమైన అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడి అవకాశాలను అన్వేషించేందుకు సమయం కేటాయించాలని కోరుతున్నాను. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిదుతామని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు.













