` ఏఎస్ఆర్ జిల్లాలో పాఠశాలల అభివృద్ధికి రూ.45.02 కోట్లు
` మారుమూల గిరిజన స్కూళ్ల అభివృద్ధికి నిధులు
` సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర విద్యారంగంలో దశాబ్దాలుగా వేళ్లూనుకున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. విద్యాశాఖను సవాల్గా స్వీకరించిన మంత్రి లోకేష్ గత ఏడాదికాలంగా విప్లవాత్మక సంస్కరణలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు అనునిత్యం పడుతున్న ఇబ్బందులను వివిధ ప్రసార సాధనాల ద్వారా తెలుసుకున్న లోకేష్…వారి సమస్యల శాశ్వత పరిష్కారానికి నడుంకట్టారు. గిరిజన ప్రాంతాలలో నూరుశాతం శాశ్వత భవనాలను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. మంత్రి లోకేష్ చొరవతో మారుమూల ప్రాంతమైన అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం రూ. 45.02 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం తాజాగా జి.ఓ నెం.264ని విడుదల చేసింది. ఇందులో ఇప్పటివరకు భవనాలు లేని, పూర్తిగా నూతన భవనాలు అవసరమైన 286 పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి, 85 పాఠశాలల్లో మేజర్, మైనర్ మరమ్మతుల కోసం మొత్తంగా రూ. 45.02 కోట్లు కేటాయించారు. ఈ పనులను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి లోకేష్ ఆదేశాలు జారీచేశారు. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలపై ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది.