- తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను వర్చువల్గా ప్రారంభించిన ముఖ్యమంత్రి
- ఏర్పాటు చేసిన హీరో ఫ్యూచర్ ఎనర్జీస్
- రూ.1000 కోట్ల పెట్టుబడి, 2 వేల మందికి ఉపాధి
- ఏడాదికి 25 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం
అమరావతి (చైతన్యరథం): గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ని అంతర్జాతీయ కేంద్రంగా మార్చాలనే లక్ష్యసాధనలో తొలి అడుగు పడిరదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. తిరుపతిలోని రాక్మ్యాన్ ఇండస్ట్రీస్లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండిరగ్ ప్లాంట్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దీని గురించి ఎక్స్లో ప్రత్యేకంగా పోస్ట్ చేశారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్…పారిశ్రామిక అవరసరాల కోసం పీఎన్జీ, ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండిరగ్కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ సాంకేతికత.. కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని, భారతదేశ ఇంధన పరివర్తనకు కొత్త బెంచ్మార్క్ను నిర్దేశిస్తుందని వివరించారు. తిరుపతిలో ప్రవేశపెట్టిన ఈ స్కేలబుల్ మోడల్ను ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఇతర పరిశ్రమల్లోనూ అనుకరించవచ్చని చెప్పారు. ప్రపంచం మొత్తం హరిత ఇంధనం వైపు వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో, ఆంధ్రప్రదేశ్ కూడా తనదైన ముద్ర వేస్తోందన్నారు. తిరుపతిలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ప్రారంభించిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, మన రాష్ట్ర ఎనర్జీ రంగంలో ఒక మైలురాయిగా అభివర్ణించారు.
లక్ష్యానికి తొలి అడుగు ఇది
స్వర్ణాంధ్ర విజన్-2047 సాధనలో పేర్కొన్నట్టుగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఇది తొలి అడుగు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ఐసీఈ) పాలసీ `2024 కింద 160 గెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, క్లీన్ ఎనర్జీలో రూ.10 ట్రిలియన్ల పెట్టుబడిని సాధిస్తామనే విశ్వాసం ఉందన్నారు. శిలాజ ఇంధనాలపై ఆంధ్రప్రదేశ్ ఆధారపడటాన్ని తగ్గించడానికి, 2070 నాటికి భారతదేశ నెట్-జీరో లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికి, ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి, ఇంధన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీ ప్లాంట్తో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ జైత్రయాత్ర మొదలు కావాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో వాణిజ్యానికి ఉన్న అనుకూల విధానాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి హీరో ఫ్యూచర్ ఎనర్జీస్కు సహకారం అందిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు.
ఎన్నో వనరులు…వినియోగించుకోండి
విస్తారమైన తీరప్రాంతం, లోతైన సముద్ర ఓడరేవులు, బలమైన లాజిస్టిక్స్ నెట్వర్క్తో ఆంధ్రప్రదేశ్… దేశీయ, ప్రపంచ మార్కెట్ అవసరాలను తీర్చడానికి, గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులకు కేంద్రంగా మారడానికి అనువైందని ముఖ్యమంత్రి వివరించారు. రూ. వెయ్యి కోట్ల పెట్టుబడితో రెండు వేల మందికి ఉపాధి కల్పించేలా ఈ ప్లాంట్ నెలకొల్పడంతో తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని సీఎం చంద్రబాబు చెప్పారు.
తిరుపతిలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ప్రారంభించిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, ఆంధ్రప్రదేశ్లో ఎనర్జీ విప్లవానికి నాంది అని చెప్పవచ్చు. ఇది పర్యావరణ పరిరక్షణ, ఉపాధి కల్పన, ఆర్థిక అభివృద్ధికి అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో అంతర్జాతీయ కేంద్రంగా మార్చడంతో పాటు, భారతదేశ నెట్-జీరో లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పడుతుంది.
ప్రాజెక్టుతో ఎన్నో లాభాలు
రూ. వెయ్యి కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ద్వారా రెండు వేల మందికి ఉపాధి కలుగుతుంది. ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఏడాదికి 54 టన్నులకు పెంచుకునే అవకాశం ఉంది. ఏడాదికి 206 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాల తగ్గింపుతో పాటు, వాతావరణంలోకి ఏడాదికి 190 నుంచి 195 టన్నుల ఆక్సిజన్ విడుదల అవుతుంది. మొత్తమ్మీద 8 నుంచి 10 శాతం ఉద్గార తగ్గింపు సాధ్యమవుతుంది.
హీరో ఫ్యూచర్ ఎనర్జీస్
2012లో స్థాపించిన హీరో గ్రూపునకు చెందిన పునరుత్పాదక ఇంధన విభాగం హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ పవన, సౌర, హైబ్రిడ్ ఇంధన వనరుల ఉత్పత్తిపై దృష్టి పెట్టి పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నిస్తోంది. భారతదేశం, యుకె, ఉక్రెయిన్, వియత్నాం, బంగ్లాదేశ్లో 1.9 గిగా వాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులను నిర్వహిస్తూ రూ.1,460 కోట్ల వార్షిక ఆదాయం సాధిస్తూ ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ప్రపంచ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా, 2030 నాటికి సామర్థ్యాన్ని 30 గిగా వాట్లకి పెంచడానికి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధంగా ఉంది.
రాక్మాన్ ఇండస్ట్రీస్
1960లో స్థాపించిన హీరో గ్రూప్లో భాగమైన రాక్మ్యాన్ ఇండస్ట్రీస్ అల్యూమినియం డై-కాస్టింగ్ భాగాలు, అధునాతన కార్బన్ సంబంధిత ఆటో భాగాల తయారీదారు. లుధియానా, హరిద్వార్, చెన్నై, బవాల్, సూరత్, వడోదర, తిరుపతి ప్లాంట్లతో రూ.2,390 కోట్ల వార్షిక ఆదాయం కలిగి ఉంది. ఏరోస్పేస్, హై-ఎండ్ ఆటోమోటివ్ రంగాల్లోకి ప్రవేశించింది.
ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఎండీ, చైర్మన్ రాహుల్ ముంజల్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ గ్లోబల్ సీఈవో శ్రీవాత్సన్ అయ్యర్, రాక్మాన్ ఇండస్ట్రీస్ ఎండీ ఉజ్వల్ ముంజల్, రాక్మాన్ ఇండస్ట్రీస్ సీఈవో కౌసిక్ మన్నా, ఓహ్మియం సీఈవో ఆర్నే బాలంటైన్ పాల్గొన్నారు.
`