- గేమ్ చేంజర్ గుర్తించే పారిశ్రామిక హోదా
- ఇజాలన్నింటిలో టూరిజమే అత్యంత కీలకం
- పర్యాటక రంగంలోనే ఎక్కువ ఉద్యోగావకాశాలు
- పర్యాటక శాఖ సలహాదారుగా యోగా గురు రామ్దేవ్
- జీఎఫ్ఎస్టీ టూరిజం కాన్క్లేవ్లో చంద్రబాబు స్పష్టం
- టూరిజం క్యారవాన్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి
- సీఎం సమక్షంలో రూ.10,329 కోట్లమేరకు 82 ఒప్పందాలు కుదుర్చుకున్న ఏపీటీడీసీ
అమరావతి (చైతన్య రథం): గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గేమ్ ఛేంజర్ కాబట్టే పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా ఇచ్చామని స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో జరిగిన గ్లోబల్ ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ (జీఎప్ఎస్టీ) టూరిజం కాన్క్లేవ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్ని ఇజాలకంటే టూరిజమే మిన్న అని దశాబ్దాల కిందటే తాను చెప్పిన మాట నిజమవుతోందని ముఖ్యమంత్రి అన్నారు. భవిష్యత్ అంతా పర్యాటక రంగానిదేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పర్యాటక రంగం ద్వారానే పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఆస్కారముందని స్పష్టం చేశారు. వెల్నెస్, హ్యాపీనెస్ ఫ్యూచర్ డెస్టినేషన్గా ఏపీని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం పెట్టుబడులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాం. హెల్తీ, వెల్తీ, హ్యాపీ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. ఐటీ, ఉత్పత్తి పరిశ్రమలు, వ్యవసాయంకంటే ఎక్కువమందికి పర్యాటక రంగం ఉద్యోగాలు కల్పిస్తుంది. పర్యాటక రంగం 20 శాతం వృద్ధి నమోదు చేస్తుంది. ఏపీలో భక్తుల్ని, పర్యాటకుల్ని ఆకట్టుకునేలా కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి ఆలయముంది. శ్రీశైలంతోపాటు మరో 10 ప్రముఖ దేవాలయాలు పర్యాటక సర్క్యూట్లో ఉన్నాయి. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, అద్భుతమైన బీచ్లు, పురాతత్వ ఆనవాళ్లు కలిగిన ప్రదేశాలు, వెయ్యి కిలోమీటర్ల బీచ్ లైన్, కోనసీమ, హార్సిలీ హిల్స్ ఇలా వేర్వేరు అంశాలు ఏపీకి ఆకర్షణలు. ప్రస్తుతం అఖండ గోదావరి ప్రాజెక్టు చేపడుతున్నాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు
ప్రస్తుతం ఏపీలో అత్యుత్తమ పర్యాటక విధానం అమలవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇచ్చేందుకు కార్యాచరణ చేపట్టామన్నారు. అనుమతుల విషయంలో ఒక్క గంట కూడా వృధాకాకుండా అనుమతులు ఇస్తామని ప్రకటించారు. ‘‘రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులకు విద్యుత్ సబ్సీడీలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. పర్యాటక రంగంలో ఏపీ నెంబర్-1 కావాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. దేశానికి టూరిజం మోడల్గా ఏపీ మారాలి. అనుమతులు రియల్ టైమ్లో లభించేలా ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్’ బిజినెస్ అమలు చేస్తున్నాం. ఏపీలో ఎలాంటి అవినీతీ లేదు, పారదర్శకత, జవాబుదారీతనమే ఉంది. ప్రస్తుతం ఏపీలో 3 వేల హోటల్ గదులు అందుబాటులో ఉన్నాయి. వచ్చే నాలుగేళ్లలో వీటిని 15 వేలకు పెరిగేలా చేస్తున్నాం. ఈ రంగంలో ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తాం. ఏపీలో 21 టెంపుల్ సర్క్యూట్లు, 2 బుద్ధిస్ట్ సర్క్యూట్లు, 25 థీమాటిక్ సర్క్యూట్లు ఉన్నాయి. బ్రిటీష్ వారు రవాణా కోసం తవ్వించిన బకింగ్ హామ్ కాలువలాంటి వాటిని కూడా పర్యాటకానికి వినియోగిస్తాం. శ్రీశైలంనుంచి బెంగుళూరు, హైదరాబాద్, చెన్నైలకు కూడా హెలీ టూరిజం ప్రారంభిస్తా’’మని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పెట్టుబడుల ద్వారా సంపద సృష్టిస్తేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని.. తర్వాతే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
ఐటీ లాగే పర్యాటకాన్నీ ప్రమోట్ చేస్తున్నాం
మూడు దశాబ్దాల క్రితం ఐటీని ప్రోత్సహించినట్టే ఇప్పుడు పర్యాటకాన్ని ప్రమోట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ సమయంలో ఎవరూ హర్షించకున్నా.. ఇప్పుడు ఆ ఫలాలను అందిపుచ్చుకుంటున్నారని అన్నారు. ‘‘పాతికేళ్ల క్రితం ప్రతి కుటుంబంలో ఒక ఐటీ ప్రోఫెషనల్ ఉండాలని పిలుపునిచ్చా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణులు మన తెలుగువాళ్లే ఉన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ నినాదం ఇప్పుడు ఇస్తున్నాం. త్వరలోనే ఈ లక్ష్యం నెరవేరుతుంది. ఇప్పుడు అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాం. దీంతోపాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత కూడా విస్తృతంగా అమలు చేయబోతున్నాం. వేర్వేరు మార్గాల ద్వారా వచ్చే డేటాను వీటితో విశ్లేషించి పాలనలో మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రభుత్వం అందించే 703 పౌరసేవల్లో ప్రస్తుతం 500కు పైగా సేవలు వాట్సాప్ ద్వారా అందిస్తున్నాం. ఆగస్టు 15 తర్వాత అన్ని పౌర సేవలూ వాట్సాప్ ద్వారానే అందుతాయి. ఎవరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అనుమతులూ వాట్సాప్ ద్వారానే అందుకోవచ్చు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతకు నైపుణ్యం కల్పించాలని నిర్ణయించాం. విశాఖ, అమరావతి, రాజమహేంద్రవరం, తిరుపతి, అనంతపురంలో ఆర్టీఐహెచ్లు ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్లో నా విజన్ను విశ్వసించి పెట్టుబడులు పెట్టినవారు సంపదను ఆర్జించారు. ఏపీలో మీ పెట్టుబడి సురక్షితం. ఇప్పుడే పెట్టుబడులు పెట్టండి. ఇప్పుడు కాకపోతే అవకాశం కోల్పోతారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. జీరో పావర్టీ లక్ష్యంగా పీ`4 విధానాన్ని అమలు చేస్తున్నామని .. సంపన్నులు, పేదల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేలా కార్యాచరణ చేపట్టినట్టు చంద్రబాబు వెల్లడిరచారు.
పర్యాటక సలహాదారుగా యోగా గురు బాబా రామ్దేవ్
యోగాలో ప్రజల్ని ప్రభావితం చేసినట్టే ఏపీ పర్యాటకాన్నీ బ్రాండిరగ్ చేయాలని ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. పర్యాటకం వెల్నెస్ కేంద్రాలకు బాబా రామ్దేవ్ సలహాదారుగా సేవలు అందించాలన్నారు. పతంజలి సంస్థను అగ్రస్థానానికి చేర్చినట్టే.. ఏపీ పర్యాటకరంగాన్ని మార్కెటింగ్ చేయాలని సూచించారు. ‘‘బాబా రామ్దేవ్ ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులు తేవటంలో కృషి చేయాలి. ప్రధాని మోదీ కోరిన మేరకు విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా డే నిర్వహించి.. గిన్నీస్ రికార్డులు, ప్రపంచ రికార్డులు సాధించాం. అంతకుముందు నెల రోజులపాటు రాష్ట్రంలో యోగా కార్యక్రమాలు చేపట్టాం. 3 లక్షలమందికి పైగా ఒకేచోట యోగా చేయించి రికార్డు సృష్టించాం. ఏపీలో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటైతే, యోగా, ఆయుర్వేద, నేచురోపతి అందుబాటులో ఉంటుంది. మదనపల్లిలో ఏర్పాటు చేసే వెల్నెస్ సెంటర్ను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలి. మౌలికసదుపాయాలు కల్పించి ఎక్కువమంది పర్యాటకులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తాం. ప్రస్తుతం ఏపీ ప్రకృతి వ్యవసాయంలో మొదటిస్థానంలో ఉంది. ఆర్గానిక్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ కోసం కూడా వెళ్తున్నాం’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
చంద్రబాబు దార్శనిక నేత: బాబా రామ్దేవ్
దేశంలో చంద్రబాబుకంటే దార్శనికత కలిగిన నేత.. ప్రజాహితం కోరే నాయకుడు ఎవరూ లేరని ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ వ్యాఖ్యానించారు. క్రియేటివిటీ, ప్రొడక్టివిటీ, ప్రొఫషనలిజం, ఎఫీషియన్సీలాంటి అంశాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అన్నారు. చంద్రబాబు తెలుగు ప్రజలకు దేవుడు పంపిన వరమంటూ బాబా రామ్దేవ్ ప్రశంసించారు. ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన చేసినంత విజన్ మరెవరూ చేయటం లేదన్నారు. అందరికంటే వేగంగా, ముందుగానే ఆలోచిస్తూ చంద్రబాబు తన బయోలాజికల్ వయస్సును రివర్స్ చేశారన్నారు. పారిస్, స్విట్జర్లాండ్, టర్కీలాంటి దేశాలకు పర్యాటకం కోసం వెళ్తున్న ప్రజలు ఏపీలో ఉన్న పర్యాటక ప్రాంతాలను కూడా గుర్తించాలన్నారు. ఏపీ పర్యాటక రంగాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని రామ్దేవ్ అన్నారు. పతంజలి సంస్థ హార్సిలీ హిల్స్లో ప్రపంచ ప్రమాణాలతో వెల్నెస్ సెంటర్ను ఏర్పాటు చేయనుందని వెల్లడిరచారు.
అలాగే దిండిలాంటి ప్రాంతాల్లో వెడ్డింగ్ క్రూయిజ్ బోట్లాంటి ప్రాజెక్టు చేపట్టేందుకు ఆసక్తి కనపరుస్తోందన్నారు. భారతీయ సంప్రదాయ వివాహాలు అక్కడ జరిపించేలా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రాజెక్టు చేపడతామన్నారు. ప్రభుత్వం అనుమతిస్తే ఏపీ పర్యాటకానికి తాను ప్రచారం చేస్తానని వెల్లడిరచారు. కార్యక్రమం అనంతరం హరిద్వార్నుంచి తెచ్చిన పవిత్ర గంగా జలాన్ని సీఎం చంద్రబాబుకు బాబారామ్ దేవ్ అందజేశారు. జీఎఫ్ఎస్టీ టూరిజం కాన్క్లేవ్లో భాగంగా వివిధ పర్యాటక ప్రాజెక్టుల ఒప్పందాలు సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగాయి. 82 ప్రాజెక్టులకు సంబంధించి రూ.10,329 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థతో ఆయా సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. అనంతరం టూరిజం బ్రోచర్, కాఫీ టేబుల్ బుక్, పర్యాటక ఈవెంట్ల కేలండర్ను బాబా రామ్దేవ్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. అంతకుముందు హోటల్ గదులుగా తీర్చిదిద్దిన టూరిజం క్యారవాన్లను సీఎం జెండా ఊపి ప్రారంభించారు.