- ‘మొంథా’ తుఫాను ఎదుర్కోడానికి యంత్రాంగం సిద్ధంకండి
- విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరాకు అంతరాయం రానివ్వొద్దు
- తీరప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి
- రోడ్లు, చెరువులు, కాల్వగట్లు కోతకు గురైతే తక్షణ మరమ్మతులు
- అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు
అమరావతి (చైతన్య రథం): మొంథా తుఫాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. 27, 28, 29 తేదీల్లో తీరప్రాంత జిల్లాల్లో భారీనుంచి అతిభారీ వర్షాలు, తీవ్ర గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీచేసిన హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం అధికారులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. వాయుగుండం 28 ఉదయంనాటికి తీవ్రమైన తుఫానుగా మారుతుందని, ఈ సమయంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా అప్రమత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం నుంచి కాకినాడ ప్రాంతం వరకూ తుఫాను తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు.
ఎస్ఎంఎస్ అలర్ట్స్, సోషల్ మీడియా, ఐవీఆర్ఎస్ కాల్స్, వాట్సాప్ ద్వారా ప్రజలకు ముందస్తుగా హెచ్చరికలు పంపించాలన్నారు. గ్రామస్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు తుఫాన్ ప్రభావంపై సమాచారం వేగంగా చేరవేసి, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే తీరప్రాంత జిల్లాలలో మోహరించాయని వెల్లడించిన ముఖ్యమంత్రి… తుఫానుపై ప్రిడెక్టివ్ మోడల్, రియల్ టైమ్ డేటా ఆధారంగా విశ్లేషణ చేస్తున్నామన్నారు. రిజర్వాయర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించి అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు
పవర్ సా, జేసీబీలు, క్రేన్లు సిద్ధంచేయండి
రాష్ట్రవ్యాప్తంగా 27,000 సెల్ టవర్లను డీజిల్ జనరేటర్లతో సిద్ధం చేశామని ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. సముద్ర తీరప్రాంత ప్రజలను తక్షణమే సమీపంలోని తుఫాను రక్షణ కేంద్రాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు. తుఫాన్ తీవ్రతను బట్టి విద్యా సంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించాలన్నారు. రహదారులు, చెరువులు, కాలువగట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మతులు చేసేలా సిద్ధంగా ఉండాలన్నారు. చెట్లు కూలిపోయినా, కొమ్మలు విరిగిపడినా వాటిని తొలగించడానికి అవసరమైన పవర్ సా, క్రేన్లు, జేసీబీలు ప్రతీ సబ్ డివిజన్ స్థాయిలో సిద్ధం చేయాలని, డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే తుఫాను రక్షణ చర్యలపై ఇప్పటివరకు 11సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. జాతీయ రహదారులపై అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వాహనాలు సిద్ధం చేశామని, రాష్ట్రవ్యాప్తంగా 851 జేసీబీలు, అలాగే క్రేన్లు -పవర్ సాలు 757 అందుబాటులో ఉంచామని వెల్లడించారు.
సముద్రంలో పడవలు వెనక్కి రప్పించండి
మరోవైపు పంటనష్టం వివరాలను స్పష్టంగా తెలుసుకునేలా వ్యవసాయ శాఖ- ఆర్టీజీ వ్యవస్థ సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇంకా సముద్రంలోనే ఉన్న 82 మెకనైజ్డ్ పడవలు, 37 మోటరైజ్డ్ పడవలను సురక్షితంగా తీరానికి రప్పించే చర్యలు తీసుకోవాలన్నారు. ఈసారి మొంథా తుఫాను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ జిల్లాలకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించామని… ప్రతీ శాఖ, ప్రతీ విభాగం సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రజల ఆస్తి, ప్రాణ, మౌలిక సదుపాయాల రక్షణకు ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.










