- గ్రామాల్లో విరివిగా సిమెంట్ రోడ్లు
- మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి (చైతన్యరథం): కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది పాలనలోనే అన్నమయ్య జిల్లాలో ఊహించని విధంగా అభివృద్ధి జరిగిందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన శుభ సందర్భంగా బుధవారం రాయచోటి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరితో కలిసి జిల్లావ్యాప్తంగా రూ.143.81 కోట్లతో పూర్తయిన 1377 పనుల ప్రారంభోత్సవం, రూ. 81.53 కోట్లతో 255 నూతన పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి మండిపల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ…ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారన్నారు. ఆయన అలుపు లేకుండా పని చేస్తూ ఆయనతోపాటు మంత్రులు ఎమ్మెల్యేలతో కూడా పని చేయిస్తారన్నారు. అదేవిధంగా వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలపై దిశ నిర్దేశం చేస్తారన్నారు. గత ప్రభుత్వంలో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయాలంటే అప్పటి పాలకులు ఎన్నో ఇబ్బందులు పెట్టేవారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లు వేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ప్రతి చోట్ల ఆర్ అండ్ బి రోడ్లు వేసి రహదారుల రూపురేఖలు మార్చామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా దీపం-2 పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేద మహిళలకు ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తున్నారన్నారు. పెన్షన్లను భారీగా పెంచి అర్హులందరికీ పెన్షన్లు అందజేస్తున్నామన్నారు.
`