- రాష్ట్ర వృద్ధిరేటులో కీలక పాత్ర పోషించే శాఖకు ప్రాధాన్యం
- జీఎస్డీపీలో 11.23 శాతం వాటా పశుసంవర్థక శాఖదే
- కోడిగుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రానిదే ప్రథమ స్థానం
- మాంసం ఉత్పత్తిలో 5, పాల ఉత్పత్తిలో 7వ స్థానంలో ఉన్నాం
- పాడి పరిశ్రమతో పేదల జీవితాల్లో మార్పు సాధ్యం
- గ్రామాల్లో డెయిరీ షెడ్లకు ప్రాపర్టీ టాక్స్ రద్దు చేస్తాం
- పశుసంవర్థక శాఖలో టెక్నాలజీతో మెరుగైన ఫలితాలు
- సామర్థ్య పెంపునకు టెక్నాలజీని అనుసరించాలి
- కులవృత్తుల వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు
- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ
- పశు సంవర్థక శాఖ -టెక్ ఏఐ 2.0 కాన్క్లేవ్కు హాజరైన సీఎం
- పాడి, ఫౌల్ట్రీ, జీవాల పెంపకంలో ఏఐ వినియోగంపై చర్చ
విజయవాడ (చైతన్య రథం): పాడి పరిశ్రమ ద్వారా పేదల జీవితాల్లో మార్పు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఏపీ నెంబర్వన్గా ఉందని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విజయవాడలో బుధవారం హొటల్ మురళీ ఫార్చూన్లో జరిగిన పశు సంవర్థక శాఖ -టెక్ ఏఐ 2.0 కాన్క్లేవ్లో సీఎం పాల్గొన్నారు. పశుగణ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా పేదరికాన్ని తగ్గించాలనే లక్ష్యంతో జిఎఫ్ఎస్టి (గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్) సంస్థ ఈ వర్క్ షాపు ఏర్పాటు చేయడం సంతోషకరమని, ఇటువంటి సమావేశాలకు హాజరవుతూ కొత్త విషయాలను అందరూ నేర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వివిధ వృత్తులవారితో ముచ్చటించారు. వారి ఆదాయ, వ్యయాలపై చర్చించారు. సుమారు మూడు గంటలకుపైగా సీఎం సమావేశంలో పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న ఏపీ
‘భారతదేశం ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో అగ్రగామి కాగా మన రాష్ట్రం అందులో వేగంగా పురోగతి సాధిస్తుండటం శుభ పరిణామం. గుడ్ల ఉత్పత్తిలో మొదటిస్థానం, మాంసం ఉత్పత్తిలో 5వ స్థానం, పాల ఉత్పత్తిలో 7వ స్థానంలో మన రాష్ట్రం ఉంది. లైవ్స్టాక్లో 2014-15లో జిఎస్డీపీ రూ.43,127 కోట్లు ఉండగా…. 2018-2019 నాటికి దానిని రూ.91,633 కోట్లకు పెంచాం. 2014-19 మధ్య సీఏజీఆర్ 21 శాతం ఉండగా.. 2019-24 మధ్య ఈ వృద్ది 11శాతానికి తగ్గింది. 2024-25లో రూ.1.69 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. రాష్ట్ర జీఎస్డీపీలో ఇది 11.23 శాతం. 2025-26 సంవత్సరానికి ఈ రంగంలో జీఎస్డీపీ వృద్ధి లక్ష్యం రూ.1,95,460 కోట్లుగా పెట్టుకున్నాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
పాడి రంగంతో పేదల జీవితాల్లో మార్పు
లైవ్ స్టాక్పైన 42 లక్షల కుటుంబాలు అధారపడి జీవిస్తున్నాయని, పాడి పరిశ్రమ ద్వారా పేదల బతుకుల్లో మార్పు వస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో రైతుల ఆదాయాలు రెట్టింపు అయ్యాయి. కానీ తరువాత వచ్చిన ప్రభుత్వాలు సమర్ధవంతంగా పని చేయలేదు. మా ప్రభుత్వంలో పాడి పరిశ్రమలో 22 శాతం సీఏజీఆర్ సాధించాం. జీఎస్టీలో రూ.లక్షా 69 వేల కోట్ల రూపాయలే లైవ్ స్టాక్ విభాగం నుంచి వస్తోంది. 18 లక్షల హెక్టార్లలో ఉద్యానవన పంటలు సాగైతే రూ.లక్షా 55 వేల కోట్ల ఆదాయం వస్తుంది. అదే 50 లక్షల హెక్టార్లలో పండే వ్యవసాయ పంటల కారణంగా రూ.55 వేల కోట్లు వస్తోంది. అందుకే అధిక ఆదాయాన్నిచ్చే ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాం. 18 లక్షల హెక్టార్లను 36 లక్షల హెక్టార్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
వ్యవసాయ రంగంలో మనమే టాప్
‘ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంలో నెంబర్వన్ రాష్ట్రంగా ఉంది. కానీ సేవల రంగం కూడా మెరుగవ్వాలి. ఇండస్ట్రీలు కూడా పెరగాలి. తెలంగాణ ఆదాయంలో 67 శాతం సేవల రంగం నుంచే వస్తోంది. అదే మన రాష్ట్రంలో 46 శాతం మాత్రమే ఉంది. రాష్ట్రంలో సేవల రంగంతోపాటు ఇండస్ట్రీని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మంచి ఆరోగ్యం కోసం ప్రోటీన్ ఫుడ్వైపు ప్రజలు మళ్లుతున్నారు. మిల్లెట్స్వంటి వాటిపై ఆసక్తి చూపుతున్నారు. వీటితోపాటు పండ్లు, కూరగాయలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకోసమే మనం ఉద్యానవన పంటలను అధికంగా పండిరచాలి. ఉద్యాన పంటల సంరక్షణ కోసం మైక్రో ఇరిగేషన్ చాలా అవసరం. మైక్రో ఇరిగేషన్పై అప్పటి వాజ్పేయి ప్రభుత్వానికి నేనొక నివేదిక ఇచ్చాను. ఆ నివేదికనే ఇప్పటికీ మైక్రో ఇరిగేషన్కు ఒక బైబిల్గా వాడుతున్నారు. మైక్రో ఇరిగేషన్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిరునామాగా ఉంది’ అన్నారు.
పాడి, పౌల్ట్రీ పరిశ్రమలను లాభాల బాట పట్టిస్తాం
‘పాడి, పౌల్ట్రీ పరిశ్రమలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఈ రెండు రంగాలను లాభాల బాట పట్టిస్తాం. గ్రామస్థాయిలో డెయిరీ షెడ్లకు ప్రాపర్టీ టాక్స్, హౌస్ టాక్స్ రద్దు చేస్తాం. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ ఆన్లైన్లో పెడతాం. అలాగే రాష్ట్రంలో మొబైల్ అంబులెన్స్లు ఎన్ని ఉన్నాయి, ఇంకెన్ని అవసరమో అధ్యయనం చేస్తాం. నరేగా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అవసరమైతే వాటిని డ్వాక్రాకు అప్పగిస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో మాట్లాడి దానిపై కార్యాచరణ రూపొందిస్తాం. ప్రతి రైతుకు నరేగా ద్వారా వాటర్ సప్లయ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. బీసీల్లో కులవృత్తుల వారిని ఆర్థికంగా పైకి తీసుకొస్తాం. యాదవ, కురబలతోపాటు అన్నివర్గాల వారిని ఆదుకుంటాం. డెయిరీకి మైక్రో ఇరిగేషన్ వర్తింపచేస్తాం. మైక్రో ఇరిగేషన్లో 2.5 లక్షల ఎకరాలకు ఈ ఏడాది ప్రాధాన్యత ఇచ్చాం. సోలార్ పవర్ వెయ్యి యూనిట్ల వరకు పర్మిషన్ ఇస్తాం. మహిళలు తేలిగ్గా గడ్డి కోసేలా కటింగ్ మిషన్స్ అందుబాటులోకి తెస్తాం. డెయిరీని ఎలా ముందుకు తీసుకుపోవాలి, ఖర్చు ఎలా తగ్గించాలి, పశువుల ఎలా చూసుకోవాలనే అంశంపై అధ్యయనంతో అవగాహన కల్పిస్తామని సీఎం చంద్రబాబు వివరించారు.
నేను నిత్య విద్యార్థిని
నేనేప్పుడూ నిత్య విద్యార్ధిగా నేర్చుకుంటూనే ఉంటాను. టెక్నాలజీలో చాలా మార్పులు వస్తున్నాయి. దాన్ని అందిపుచ్చుకున్నవారు మాత్రమే ముందుకు సాగుతారు. హైదరాబాద్లో ఐటీని అభివృద్ధి చేసిన కారణంగా ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం పొందుతున్న వారు భారతీయులు కాగా అందులో 35 శాతం మంది తెలుగు వారున్నారు. ప్రస్తుతం నాలెడ్జ్, టెక్నాలజీ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించుకొని ఎంట్రప్రెన్యూర్లను తయారు చేయాలి. అందుకోసం ఏర్పడిన సంస్థనే జీఎఫ్ఎస్టీ. ఈ సంస్థ ముందుకు సాగేందుకు కొంతమేరకు మేం సహాయపడతాం. దీన్ని జాతీయస్థాయిలో గొప్ప సంస్థగా రూపు దిద్దవలసింది నిర్వాహకులే. నాంది ఫౌండేషన్ నా సహాయంతో రెడ్డి ల్యాబ్స్ అధినేత అప్పట్లో ప్రారంభించారు. ఆ తర్వాత దాని నిర్వహణ ఆనంద్ మహీంద్రా చేతికి వెళ్లింది. ఇప్పుడు నాంది ఫాండేషన్ ఎంత సేవ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ఒక ట్రస్టుగా ఆ రంగంలో సేవలందిస్తున్న సంస్థల్లో దేశంలోనే మేటైన ట్రస్టుగా ఉంది. అలాగే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేసి సేవలందిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
ఐదేళ్ల విధ్వంసాన్ని అధిగమిస్తున్నాం
గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగింది మామూలు విధ్వంసం కాదు. రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై వేసి వెళ్లారు. బ్రాండ్ ఏపీ మైనస్కు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే పారిశ్రామికవేత్తలు భయపడిపోయారు. అమ్మో ఏపీకి రాలేమంటూ పరుగులు తీశారు. నా విశ్వసనీయతతో అందర్నీ రాష్ట్రానికి తిరిగి తీసుకొస్తున్నాను. ఎన్టీఆర్ స్పూర్తితో పీ4కు శ్రీకారం చుట్టాం. పేదరిక నిర్మూలనతో పాటు ఆర్థిక వ్యత్యాసాలు తగ్గిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు పనిచేస్తాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
వివిధ వృత్తిదారులతో సీఎం ముఖాముఖి
గొర్రెల ఫామ్ నడుపుతున్న నరేంద్ర యాదవ్ మాట్లాడుతూ `గొర్రెల పెంపకంపై అవగాహన కోసం ప్రతి రోజూ యువకులు మా ఫామ్కు వస్తుంటారు. మేము గొర్రెల పెంపంకంపై ప్రభుత్వ ఆస్పత్రుల నుంచే సలహాలు తీసుకుంటున్నాము. జమ్మలమడుగు నియోజకవర్గంలో మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని 13మంది గొర్రెల ఫామ్లు పెట్టుకున్నారు. మాకు 24 గంటలూ సింగిల్ ఫేజ్ విద్యుత్ అందేలా చర్యలు తీసుకోవాలి అని కోరారు. కోవా తయారీదారు జుబేదా మాట్లాడుతూ `మేము పాల కోవా తయారుచేస్తాం. 2014లో మీరు సీఎం అయ్యాక డ్వాక్రా బజార్లలో విక్రయించేవాళ్లం. 2017లో పశువుల పెంపకం చేపట్టాము. 200 గేదెలు ఉండేవి. గత ప్రభుత్వంలో ఇబ్బందులు వచ్చాయి. కేసులు పెట్టి వేధించారు. అయినా ధైర్యంగా నిలబడ్డానని వివరించారు. డెయిరీ నిర్వాహకురాలు శ్రీపద్మ మాట్లాడుతూ పశువుల మేత కోసం గడ్డి పెంచుకోవాలంటే నీరు పెట్టడానికి మనిషిని పెట్టుకోవాలి. ఇందుకోసం పశుసంవర్థక సంస్థ ద్వారా సాయం చేయండి. నా దగ్గర 50 పశువులు ఉన్నాయి. నెలకు రూ.15 వేలు కరెంటు బిల్లు వస్తోంది. 10 కేవీ కరెంటు వాడుతున్నాను. దీనికి సరిపడా సోలార్ ప్యానల్స్ను ప్రభుత్వం అందిస్తే ఖర్చు తగ్గుతుందని కోరారు.