- విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు
- సద్విమర్శలను స్వాగతిస్తాం
- మహిళలపై అసభ్య పోస్టులపై నిఘా
- ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అమలు చేస్తున్న చట్టాలపై అధ్యయనం
- సోషల్ మీడియాపై మంత్రుల బృందం సమావేశంలో మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): సోషల్ మీడియాలో కుట్ర పూరిత విద్వేష పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా జవాబుదారీతనం, పౌరుల రక్షణను బలోపేతం చేయడం అనే అంశంపై రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన మంత్రుల బృందం సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీ యాక్ట్ 2000` సేఫ్ హార్బర్, బ్లాకింగ్ పవర్స్, ఐటీ రూల్స్ 2021 ` కంప్లయన్స్ అండ్ ట్రేసబిలిటీ, డీపీడీపీ యాక్ట్- 2023 డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్ వర్క్, జ్యుడీషియల్ సేఫ్ గార్డ్స్ ` ఫ్రెష్ స్పీచ్ అండ్ ప్రైవసీ లపై చర్చించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ప్రభుత్వ నిర్ణయాలపై సద్విమర్శలను స్వాగతిస్తాం, ఉద్దేశపూర్వక విద్వేష వ్యాఖ్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. ఏఐ ఆధారిత డీప్ ఫేక్ అసభ్య కంటెంట్ను అరికట్టాలి, నిర్ణీత వయసు ఆధారితంగానే సోషల్ మీడియాకు వచ్చేలా నిబంధనలు రూపొందించాలి. మహిళలపై అవమానకర, అసభ్య పోస్టులు పెట్టే వారిపై నిఘా పెట్టాలి. ప్రజాభీష్టాన్ని అడ్డుకోవడం మా ఉద్దేశం కాదు, అదే సమయంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఆర్గనైజ్డ్గా దురుద్దేశపూర్వక పోస్టులు పెడుతున్నారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించం. ప్రతిపక్షాలు ధర్నా చౌక్ లాంటి ప్రదేశాల్లో నిరసన తెలియజేయడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. గతంలో జ్యుడీషియరీతో పాటు కొంతమందిని టార్గెట్ చేసి అసభ్య పోస్టులు పెట్టారు. విదేశాల్లో ఉండి అభ్యంతరకర పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేస్తాం. ఇందుకోసం బలమైన లీగల్ ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు చేయాలి.
ఉద్దేశపూర్వకంగా తప్పుడు పోస్టుల కట్టడికి కేంద్రప్రభుత్వం సహయోగ్ ఇంటిగ్రేషన్ పోర్టల్ ప్రవేశపెట్టింది. మాజీ ముఖ్యమంత్రి భార్యపై పోస్టు చేస్తే మా పార్టీ వాడైనా జైలుకు పంపించాం. వ్యక్తిత్వ హననం, వ్యక్తిగతమైన వ్యాఖ్యలు, ముఖ్యంగా మహిళల పట్ల అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరిస్తాం. సోషల్ మీడియాలో సెకన్ల వ్యవధిలో కంటెంట్ వ్యాప్తి చెందుతోంది. ఫలితంగా వెనువెంటనే ప్రభావం చూపుతుంది. కాంట్రవర్సీ ఎక్కువగా జనంలోకి వెళుతోంది. ఉద్దేశపూర్వకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిపై నిఘా పెట్టాలి. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలలో అమలు చేస్తున్న చట్టాలను అధ్యయనం చేయాలి. ఆస్ట్రేలియా, ఈయూ, యూకేలలో ఇండిపెండెంట్ రెగ్యులేషన్స్ అమలు చేస్తూ హెవీ పెనాలిటీస్ విధిస్తున్నారని చెప్పారు.
హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ… సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి కేసు నమోదు, చార్జిషీటుకు సమయం పడుతోందన్నారు. సైబర్ క్రైమ్ కెపాసిటీ బిల్డింగ్ చేయాల్సిన అవసరం ఉంది. నెలరోజుల్లో చార్జిషీటు ఏర్పాటుచేసేలా చర్యలు చేపట్టాలి. అటువంటి వ్యక్తుల సోషల్ మీడియా ఎకౌంట్లను సస్పెండ్ చేయడంపై దృష్టిపెట్టాలి. రిటైర్డ్ జడ్జిలు, న్యాయకోవిదుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని లీగల్ ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు చేస్తామన్నారు.
రాష్ట్రస్థాయి కోఆర్డినేషన్ సెల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్, ఆకే రవికృష్ణ (ఐజీ, ఈగల్) సైబర్ క్రైమ్ ఇన్చార్జి కుమార్, సీహెచ్ వెంకటేశ్వర్లు (డిప్యూటీ సెక్రటరీ, లా డిపార్ట్ మెంట్), పి.కిరణ్ కుమార్ (జాయింట్ డైరెక్టర్, ఐ అండ్ పిఆర్), పి.జయరావు, చీఫ్ జనరల్ మేనేజర్ (సోషల్ మీడియా అండ్ డిజిటల్ మీడియా, డిజిటల్ కార్పొరేషన్), ఒ.మధుసూదన (చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్, ఐ అండ్ పిఆర్), ప్రాసిక్యూషన్ డైరెక్టర్ రామకోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.















