- ప్రభుత్వం, హోమ్ శాఖ, ఈగల్ టీమ్ సమష్టి సత్ఫతితాలు
- నాడు గంజాయి హబ్గా పేరొందిన ఉత్తరాంధ్ర ఏజెన్సీ
- నేడు అరకు కాఫీ బ్రాండ్గా ప్రాచుర్యం
- హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో, ఆయన సూచనలు, సలహాల మేరకు డేగ కన్నుతో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపి గత ఏడాది కాలంలో మంచి ఫలితాలను సాధించామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రభుత్వం, హోం శాఖ, ఈగల్ టీమ్ సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయులతో ఆమె మాట్లాడుతూ రాష్ట్రం నుండి గంజాయి, డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండే ఒక యజ్ఞాన్ని ప్రారంభించామన్నారు. ఇందులో బాగంగా విద్య, వైద్య, ఎక్సైజ్, గిరిజన సంక్షేమం, హోం శాఖల మంత్రులతో ప్రభుత్వం ఒక సబ్కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ సూచనల మేరకు అమరావతి హెడ్క్వార్టర్గా పాటు రాజమహేంద్రవరం, విశాఖపట్నం కేంద్రాలుగా ఈగల్ టాస్కుఫోర్స్ను ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా 26 జిల్లాల్లో ఈగల్ సెల్స్ను ఏర్పాటు చేసి గంజాయి, డ్రగ్స్ నియంత్రణకై పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని ప్రధాన ప్రాంతాల్లో చెక్ పోస్టులు, సీసీి కెమేరాలు పెట్టి గంజాయి సాగును, రవాణాను నియంత్రిస్తున్నామన్నారు. గత ఏడాది కాలంలో దాదాపు 831 కేసులను నమోదు చేసి 2,114 మందిని అరెస్టు చేయడమే కాకుండా 23,770 కేజీల గంజాయిని, 27 లీటర్ల హాషిష్ ఆయిల్ను సీజ్ చేశామన్నారు. 293 వాహనాలను కూడా సీజ్ చేశామన్నారు. గంజాయి సాగును ప్రోత్సహించే మూల విరాట్లపై దృష్టి సారించడమే కాకుండా వారి ఆర్థిక లావాదేవీల ఆధారంగా ఏడుగురికి చెందిన రూ.7.75 కోట్ల ఆస్తులను కూడా సీజ్ చేశామని ఆమె తెలిపారు. ఆపరేషన్ గరుడలో భాగంగా దాదాపు 100 జాయింట్ టీమ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ షాపులపై దాడులు నిర్వహించి డ్రగ్స్ అండ్ కాస్మొటిక్ యాక్టు-1940ని ఉల్లంఘిస్తున్నట్లుగా 150 షాపులను గుర్తించి సీజ్ చేశామని తెలిపారు.
ఏజెన్సీలో సాగు నియంత్రణ
గతంలో గంజాయి, డ్రగ్స్కు హబ్ గా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని పక్క రాష్ట్రాల డిజిపిలు విమర్శించే వారన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో అటు వంటి పరిస్థితులు లేవని, గంజాయి హబ్గా పేరొందిన ఉత్తరాంద్ర ఏజన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు నేడు అత్యత్తమమైన కాఫీకి బ్రాండ్గా మంచి పేరు పొందాయన్నారు. ప్రపంచంలోని పలు దేశాలతో పాటు పార్లమెంట్లో కూడా అరకు కాఫీ అవుట్ లెట్స్ను పెట్టి ఎంతగానో ప్రమోట్ చేయడం వల్ల ఇది సాధ్యమైందన్నారు. అదే సమయంలో ఈగల్ టాస్క్ ఫోర్స్, ఈగల్ సెల్స్ ద్వారా 325 హాట్ స్పాట్ గ్రామాల్లో గంజాయి సాగును నియంత్రించడమే కాకుండా, గిరిజనుల జీవనోపాధికై ప్రత్యామ్నాయ పంటల సాగుకై గత ఏడాది కాలంలో దాదాపు 40 లక్షల మొక్కలను పంపిణీ చేస్తూ తగిన ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది 2 కోట్ల మేర మొక్కలను పంపిణీ చేసే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు. అల్లూరి జిల్లాలో 94.77 ఎకరాల్లో గంజాయి సాగును రూపుమాపి, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు మొక్కలను పంపిణీ చేశామన్నారు. దాదాపు 8,200 అవగాహన శిబిరాలను నిర్వహించి గంజాయి సాగు వల్ల సంభవించే పరిణామాలు, ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న కఠిన చర్యలను అమాయకులైన గిరిజనులకు వివరించామని ఆమె తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలల్లో దాదాపు 40 వేలకు పైగా ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేసి విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కల్పిస్తున్నట్లు హోంమంత్రి అనిత చెప్పారు.
ఈగల్ ఐజి రవికృష్ణ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇప్పటికి వరకూ సాధించిన ప్రగతిని వివరించారు. గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో భవిష్యత్తులో వ్యూహాత్మంగా చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణా చర్యల్లో భాగంగా డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు మాదకద్రవ్యాల నెట్ వర్క్ను ఆధునిక సాంకేతికత సహాయంతో ఛేదించేందుకు చర్యలు తీసుకోనున్నామన్నారు. మాదకద్రవ్యాల సరఫరా, వినియోగించే నేరస్తుల ఆర్థిక వ్యవహారాలపై దర్యాపు చేయడంతో పాటు పీఐటీఎన్డీపీఎస్ చట్టాన్ని పటిష్టంగా అమలు పరుస్తామన్నారు. పరివర్తన చెందిన నేరస్తులకు పునరావాసం కల్పిస్తామని, ఈగల్ క్లబ్స్ ద్వారా ‘‘డ్రగ్స్ ఒద్దు బ్రదర్’’ అంటూ డ్రగ్స్ వల్ల ఎదురయ్యే దుష్పలితాలపై అవగాహన కల్పిస్తామన్నారు.