గుంటూరు (చైతన్యరథం): రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని వ్యవసాయమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గుంటూరు నగరంలో గురువారం జరిగిన వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, ఎండీ నజీర్తో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు పాల్గున్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడైనా నిర్మాణాలకు 10 శాతం బ్లూ అండ్ గ్రీన్ ఉంటుంది, కానీ అమరావతిలో 30 శాతం బ్లూ అండ్ గ్రీన్ ఉండేలా నిర్మిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గించేలా పచ్చదనాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సింగపూర్, జపాన్ వంటి దేశాలతో సంప్రదించి అక్కడి మాదిరిగా మంచి ప్లాంటేషన్ ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు.అదే విధానంలో అమరావతిలో కూడా రకరకాల మొక్కలను శాస్త్రీయ విధానంలో నాటేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.