- రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చిన వారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలి
- భూములిచ్చిన ఊళ్లోనే రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలి
- సీఆర్డీఏ అథార్టీ భేటీలో సీఎం చంద్రబాబు ఆదేశాలు
- అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్భవన్ నిర్మాణానికి సీఆర్డీఏ ఆమోదం
- 53వ సీఆర్డీఏ అథార్టీ సమావేశంలో కీలక నిర్ణయం
అమరావతి (చైతన్య రథం): అమరావతి అభివృద్ధితో పాటు… రాజధానికి భూములిచ్చిన రైతులూ అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను తక్షణం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 53వ సీఆర్డీఏ అథార్టీ సమావేశం జరిగింది. మొత్తంగా 18 అంశాలపై అథార్టీ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “రాజధాని నిర్మాణ పనులు రీస్టార్ట్ చేశాం. రాజధాని కోసం భూములను త్యాగం చేసిన రైతులకే మొదటగా రాజధాని అభివృద్ధి ఫలాలు అందాలి. రాజధాని రైతులకు కౌలు చెల్లింపుల్లోనూ ఎలాంటి జాప్యం జరగకూడదు. భూములిచ్చిన రైతులకు ఎక్కడ రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని చెప్పామో… అక్కడే ఇవ్వాలి. ఏ ఊళ్లో భూములిచ్చిన వారికి ఆ ఊళ్లోనే ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చాం. అలాగే ఎలాట్మెంట్ చేయాలి. రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం పెరగాలి. సెక్రటేరీయేట్ టవర్లతో సహా ఇతర నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి. వెస్ట్ బైపాస్ రోడ్డును వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. ఏమైనా సాంకేతిక ఇబ్బందులుంటే.. వాటిని వెంటనే పరిష్కరించుకుని ఖాజా టోల్ గేట్ దగ్గర జాతీయ రహదారిని చేరేలా ఉన్న రోడ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలి. కరకట్ట రోడ్డును విస్తరించాలి. మూడు నెలల్లో రాజధాని నగరాన్ని ఓ రూపునకు తీసుకురావాలి” అని సీఎం స్పష్టం చేశారు.
రాజభవన్ సహా వివిధ నిర్మాణలకు ఆమోదం
అమరావతిలో గవర్నర్ నివాసం రాజ్భవన్ నిర్మాణానికి సీఆర్డీఏ అథార్టీ ఆమోదించింది. రూ.212 కోట్ల వ్యయంతో రాజ్భవన్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. కృష్ణా నదీ ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్భవన్ నిర్మాణం జరగనుంది. రాజ్భవన్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ అద్భుతంగా ఉండాలని సీఎం సూచించారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25శాతం నిధులను సీఆర్డీఏ ఇచ్చేందుకు అథార్టీ ఆమోదం తెలిపింది. రాజధాని ప్రాంతంలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి అథార్టీ అంగీకరించింది. రాజధాని నగర జోనింగ్ నిబంధనల్లో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలుండేలా అవసరమైన మార్పులు చేర్పులు అథార్టీ ఆమోదించింది. అమరావతి క్యాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటీవ్ ఏజెన్సీగా సీఆర్డీఏ వ్యవహరించేలా అథార్టీలో నిర్ణయించారు. హ్యాపీ నెస్ట్, ఏపీ ఎన్నార్టీ ప్రాజెక్టులకు చెందిన బిల్డింగ్ పర్మిషన్ ఫీజును మాఫీ చేసేందుకు అథార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధానిలో నిర్మించే హెూటళ్ల వద్ద పార్కింగ్ నిబంధనల్లోనూ స్వల్ప మార్పులు చేసేందుకు అథార్టీ అంగీకరించింది. కొండవీడు వాగు సమీపంలో నీటి ప్రవాహాల కోసం 8400 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి అథార్టీ నిర్ణయించింది. దీంతోపాటు మరికొన్ని సాంకేతిక అంశాలకు, పరిపాలనా అంశాలకు అథార్టీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం కొన్ని సూచనలు చేశారు. భవిష్యత్తులో వాహనాల సంఖ్య బాగా పెరిగే అవకాశముందని… పార్కింగ్ సమస్య లేకుండా ప్రణాళికలు చేయాలని సూచించారు.
అమరావతి రాజధానిలో రోడ్డుపై వాహనాల పార్కింగ్ చేసే పరిస్థితి లేకుండా చూడాలన్నారు. కామన్ పార్కింగ్ ప్రాంతాలు ఉండేలా ప్రణాళికలు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లు తెనాలి మున్సిపాలిటీ, రాజధాని ప్రాంతంతో ఇంటిగ్రేట్ చేయాలని… బ్లూ గ్రీన్ అమరావతిగా రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఆర్డీఏ అథార్టీ సమావేశానికి మంత్రి నారాయణ, సీఎస్ కె విజయానంద్, సీఆర్డీఏ, ఏడీసీ, మౌలికసదుపాయాల కల్పన శాఖ ఉన్నతాధికారులు హజరయ్యారు.